కృష్ణా: రంజాన్ మత సామరస్యానికి ప్రతీక అని విశ్వ హిందూ పరిషత్ నేషనల్ ట్రస్టీ పుట్టగుంట సతీష్ కుమార్ అన్నారు. ఆదివారం బాపులపాడు(మం) బొమ్ములూరులోని తన INC 1947 లెదర్ ఇండస్ట్రీలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి అతిథులకు స్వయంగా హలీమ్, అల్పాహారం అందించారు. భిన్నత్వంలో ఏకత్వం భారత దేశ గొప్పతనం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనను అభినందించారు.
ప్రకాశం: హనుమంతునిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీట్ హోల్డర్లకు ఆదివారం ఎస్సై మాధవరావు కౌన్సెలింగ్ నిర్వహించారు. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడకుండా మంచి ప్రవర్తనతో ఉండాలని హెచ్చరించారు. ఎవరైనా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
NTR: గంపలగూడెం(మం) రాజవరంలో డ్వాక్రా మహిళలు అక్షర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆదివారం పరీక్షలు రాశారు. చిన్నతనంలో నేర్చుకున్న అక్షరాలను గుర్తు చేసుకొని ఆ జ్ఞానంతో పరీక్ష రాస్తూ స్కూలుకు వెళ్లిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మహిళల చదువుకోవాలని ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని వారు అభినందించారు.
కోనసీమ: కె.గంగవరం మండలం కూళ్ల గ్రామంలో కోటి రూపాయల పుష్కర నిధులతో నిర్మించనున్న వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి అంకురార్పణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, మాజీ ఎంపీ చిట్టూరి రవీంద్ర పాల్గొన్నారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా స్వామివారి విగ్రహాలను బాలాలయంలోకి తరలించే కార్యక్రమం నిర్వహించారు.
TPT: తిరుపతి పరిసర ప్రాంతాల్లో రవాణా శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పన్నులు చెల్లించకుండా నడుస్తున్న రెండు టూరిస్ట్ బస్సులను గుర్తించారు. నాగాలాండ్ రిజిస్ట్రేషన్ బస్సుకు రూ. 3.60 లక్షలు, తెలంగాణ బస్సుకు రూ.70 వేల జరిమానా విధించారు. జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీ మోహన్ పన్నులు చెల్లించని వాహనాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
ELR: బుట్టాయగూడెం మండలం దొరమామిడి జలాశయంలో ఆదివారం ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన తుమ్మల నాగరాజు (30), తుమ్మల రమణ (35) గుబ్బల మంగమ్మ గుడికి వెళ్లారు. అనంతరం వారు జలాశయం వద్దకు వచ్చారు. స్నానం చేస్తుండగా వారు గల్లంతయ్యారు. పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు.
KKD: పిఠాపురం 24వ వార్డులో మస్తాన్ నవాబ్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేసిన ఆయన, ముస్లిం సోదరుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పవిత్ర రంజాన్ మాసం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
TPT: జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల సందర్భంగా 165 కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉండగా, మాస్ కాపీయింగ్ వంటి అవకతవకలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉంటారని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కోరారు.
PLD: నకరికల్లు మండలంలోని కండ్లగుంట సబ్ స్టేషన్లో కొత్త బ్రేకర్ ఏర్పాటు పనులు సోమవారం జరగనున్నాయి. దీంతో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కండ్లగుంట, చాగల్లు, చీమలమర్రి, దేచవరం, రూపేనగుంట గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈఈ జీ. సుచరిత తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
PLD: నేర ప్రవృత్తిని విడనాడి సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని ఎస్పీ బీ. కృష్ణారావు సూచించారు. ఆయన ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవిస్తూ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.
KKD: శంఖవరం మండలం మండపం నూకాలమ్మ ఆలయ సమీపంలో పులి పొంచి ఉన్నట్లు అటవీ శాఖ ప్రకటించింది. తాళ్లపాలెం గ్రామానికి అర కిలోమీటర్ దూరంలో పులి ఉండటంతో రైతులు అప్రమత్తమయ్యారు. పులిని పట్టుకునేందుకు 70 మంది సిబ్బంది రంగంలోకి దిగారు. అయితే సిగ్నల్స్ లేని దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో పులి కదలికలను గుర్తించడం కష్టమవుతోందని అధికారులు తెలిపారు.
E.G: ముస్లింల పవిత్ర రంజాన్ మాసంలో సోదరభావం వెల్లివిరుస్తుందని మండపేట పుర పాలక సంఘం ఛైర్పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి పేర్కొన్నారు. మండపేట వైసీపీ మైనార్టీ విభాగం అధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఛైర్పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హిందూ ముస్లింలు ఇక్కడ అన్యోన్యంగా ఉంటారని పేర్కొన్నారు.
W.G: అత్తిలిలో రంజాన్ మాసం సందర్భంగా ఆదివారం ముస్లిం జమాత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో ప్రత్యేక ప్రార్ధనలు చేపట్టి వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. రంజాన్ మాసపు ఆధ్యాత్మికత, ఉపవాసం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడటం జరిగింది. సమాజంలో సౌహార్థం, ఐక్యత మరింత బలపడాలన్నారు.
ATP: బెలుగుప్ప మండలం తగ్గుపర్తి గ్రామంలో నిర్వహించిన సుంకలమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేసిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రకాశం: పొదిలిలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంస్థ అనుమతించినట్లు డిపో మేనేజర్ శంకర్రావు తెలిపారు. రేపటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో, ఇంటి నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. కండక్టర్కు హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుందని తెలిపారు.