NTR: విజయవాడ పోలీస్ కమిషనరేట్ రాజశేఖర బాబు నిర్వహిస్తున్న డ్రగ్స్ పై దండయాత్ర ప్రజా అవగాహన సైకిల్ యాత్ర తిరువూరు సర్కిల్ను దాటి జగ్గయ్యపేట సర్కిల్ పరిధిలోని వత్సవాయి పోలీస్ స్టేషన్ వద్దకు ఈరోజు ప్రవేశించింది. ఈ యాత్ర కంభంపాడు గ్రామం నుండి ప్రారంభమై వత్సవాయి వరకు కొనసాగింది. డ్రగ్స్ వలన కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని కమిషనర్ తెలిపారు.
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారి మూలమూర్తికి పవిత్ర గంగాజలాలతో అభిషేకలు నిర్వహించి, బంగారు,వెండి ఆభరణాలతో పాటు ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. స్వామి వారికి సింధూరం, ఆకు, తులసితో పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణంలో నిత్య హోమం చేశారు.
NLR: అక్కడ జనసేన సైలెంట్ అయ్యిందా?.. ఎన్నికల ముందు హడావుడి చేసిన జన సైనికులు ఇప్పుడు ఏమయ్యారు. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న టాపిక్ ఇదే.. నాయకులను సమన్వయం చేసే నాయకుడు లేకపోవడంతోనే జనసేనకు ఈ కష్టం వచ్చిందని పలువురు మాట్లాడుతున్నారు. అది కాక రెండేళ్లుగా జిల్లా అధ్యక్షుడు నియమించకపోవడం కూడా పార్టీ క్యాడర్లో నిరుత్సాహాన్ని నింపిందట.
SKLM: నరసన్నపేట మండలం ఉర్లాం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని యువనేత, జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య శనివారం దర్శించుకున్నారు. ఆయనకి ఆలయ అర్చకులు సాధన స్వాగతం పలుకుతూ, ప్రత్యేక పూజలు చేపట్టి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆయనతోపాటు పలువురు వైసీపీ నాయకులు, తదితరులు ఉన్నారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలో శనివారం “స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రగా, పట్టణాలను స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. పట్టణ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
SKLM: ఎచ్చెర్ల మండలం కేంద్రంలో ఉన్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో ఈ నెల 27 నుంచి 31 రోజుల పాటు మగ్గం, బ్యూటీ పార్లర్ ,టైలరింగ్లో యువతకు ఉచిత శిక్షణా తరగతులు ప్రారంభం కానున్నాయని సంస్థ డైరెక్టర్ రామ్ జీ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. శిక్షణా కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించబడును అని తెలిపారు.
W.G: భీమవరం మండలం యనమదుర్రులోని ఫ్యాక్టరీ వద్ద శనివారం ప్రమాదం జరిగింది. సదరు ఫ్యాక్టరీకి చెందిన బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఓ ఫ్యాక్టరీ బస్సుగా దీన్ని గుర్తించినట్లు వారు తెలిపారు.
కృష్ణా: మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధి ఈడేపల్లిలో గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు సాయి గణేష్ అనే వ్యక్తిపై ట్యూబ్ లైట్తో దాడికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం.. సాయి గణేష్ బాగా చదువుకుంటున్నాడనే అక్కసుతో ఈ దాడి జరిగింది. గతంలో స్నేహితులుగా ఉన్న సాయి గణేష్, సోమశేఖర్, కన్నా మధ్య గొడవలు తలెత్తడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
సత్యసాయి: సోమందేపల్లి మండలంలోని జామియా మజీద్లో శనివారం రంజాన్ మాసం సందర్భంగా 3వ ఉపవాస దీక్షను ముస్లిం సోదరులు నిర్వహించారు. నమాజ్ అనంతరం మౌలానా మహమ్మద్ ఇలియాజ్ ప్రసంగిస్తూ రోజుకు ఐదు పూటలా నమాజ్ చేయాలని, అది శారీరక-మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని తెలిపారు. మండల ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక దువా నిర్వహించారు.
AKP: మానవాళికి హాని కలిగించే ప్లాస్టిక్కు ప్రజలు దూరంగా ఉండాలని ఎస్ రాయవరం మండలం తిమ్మాపురం సర్పంచ్ కర్రి సత్యనారాయణ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి ప్లాస్టిక్కు వ్యతిరేకంగా శనివారం తిమ్మాపురం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని సూచించారు.
GNTR: పొన్నూరులో శనివారం ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు ఆధ్వర్యంలో ‘ఈ-వేస్ట్’ నియంత్రణపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిబిసి రోడ్డు వద్ద ప్రతిజ్ఞ చేసిన అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ పొన్నూరు లక్ష్యంగా ప్రజలను చైతన్యపరచాలని సిబ్బందిని కోరారు.
కడప: దేశవ్యాప్తంగా వైట్ రేషన్ కార్డుల ద్వారా పేద కుటుంబాలకు సరుకులు అందుతాయి. అయితే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఉచిత రేషన్ పొందాలంటే కుటుంబ సభ్యులందరూ ఈ -కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఫుడ్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ ఈ మేరకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ -కేవైసీని ఫిబ్రవరి 28వ తేదీ లోపు పూర్తి చేయకపోతే ఉచిత రేషన్ నిలిపివేయబడుతుంది.
E.G: కడియం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికలు శనివారం ఏకగ్రీవం అయ్యాయి. అధ్యక్షునిగా చిక్కాల సూరిబాబు ఎంపికయ్యారు. ఉపాధ్యక్షునిగా యండమూరి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా పాలగుమ్మి శేషగిరి, బొమ్మిరెడ్డి బ్రహ్మాజీ లు, కార్యదర్శిగా అన్నందేవుల సూర్యచంద్రరావు, కోశాధికారిగా కొప్పిశెట్టి సుబ్రహ్మణ్యం, సలహాదారుడిగా పళ్ళ వెంకటగిరిను ఎన్నుకున్నారు.
KRNL: మద్దికేర మండల ప్రజలకు శనివారం ఎస్సై హరిత ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశారు. జిల్లా పరిసరాల్లో ఇళ్ల దొంగతనాలు, వాహనాల చోరీలు, చైన్ స్నాచింగ్ ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. పత్తికొండ ఆర్టీసీ బస్టాండ్లో చైన్ దొంగతనం జరిగినట్లు పేర్కొని.. ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందజేయాలని సూచించారు.
అన్నమయ్య: రాజంపేట మండల పరిధి బోయినపల్లిలోని శాన్వి ఇంటర్నేషనల్ పాఠశాలలో ఆదివారం ఉచిత వైద్య మెగా శిబిరం నిర్వహిస్తున్నట్లు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్ కుమార్ రాజు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కంటి, బీపీ, షుగర్ వంటి పరీక్షలు చేస్తారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.