W.G: రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభ్యులకు కేటాయించిన రూ.100,000 విలువైన కూపను పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి తిరస్కరించారు. ఆ కూపన్ను మండలి జాయింట్ సెక్రటరీ విజయరాజుకు తిరిగి అందజేశారు. సభలో ప్రజా సమస్యలు, బడ్జెట్ పై అర్థవంతమైన చర్చ జరగడం లేదని.. కేవలం రాజకీయ అంశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ASR: అంగన్వాడీల వేతనాలు పెంచాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం CITU ఆధ్వర్యంలో అరకులోయ ఐసీడీఎస్ ఆఫీసు వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అంగన్వాడీ వ్యవస్థను పటిష్ట పరచడానికి సీఎం చంద్రబాబు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఇచ్ఛిన హామీలను నెరవేర్చాలని పేర్కొన్నారు.
తూ.గో: రాజమండ్రిలో కల్తీ పాల వల్ల నలుగురు మృతి చెందడంపై సోమవారం పీసీసీ అధ్యక్షురాలు YS షర్మిల రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కల్తీ పాల సరఫరా వెనుక ఉన్న వాస్తవాలను బయటకు తీయాలని కోరారు. ఈ ఘటన తీవ్ర భయాందోళనలకు గురిచేసిందని ఆమె పేర్కొన్నారు.
NDL: దివ్యాంగుల కోసం పెండింగ్లో ఉన్న బ్యాక్ లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని వైసీపీ పులివెందుల దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పులివెందుల ఆర్డీవో చిన్నయ్యకు వినతి పత్రం ఇచ్చారు. అర్హులైన దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలు, ఉచిత లైసెన్స్ మేళా, అలాగే సీఎం ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు.
KRNL: కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 122 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ విక్రంత్ పాటిల్ తెలిపారు. ఉద్యోగాల పేరుతో లక్షలు వసూలు చేసి మోసం చేసిన ఘటనలు ప్రధానంగా నమోదయ్యాయి. ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
SKLM: పలాసలో ఈనెల 26న జరగనున్న ఎల్లమ్మతల్లి జామి యాత్ర ఏర్పాట్లను ఏపీటీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు, డీఎస్పీ షేక్ షాహ బజ్ అహ్మద్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన ఆలయ కమిటీ సభ్యులకు తగు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు పాల్గొన్నారు.
VZM : జిల్లాలో నిర్వహిస్తున్న బోద వ్యాధి నివారణ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అదేశించారు. జాతీయ ఆరోగ్య మిషన్ అడిషనల్ సెక్రటరీ ఆరాధన పట్నాయక్ సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. గుర్లలో ఇప్పటివరకు 5,516 మందికి మాత్రలు పంపిణీ చేసినట్లు తెలిపారు.
TPT: శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్మారకార్థం జాతీయ సీనియర్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ పోటీలు ఫిబ్రవరి 21 నుంచి 27 వరకు కొనసాగనున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి సీనియర్ క్రీడాకారులు పాల్గొని పోటీలు రసవత్తరంగా సాగిస్తున్నాయి. ముఖ్య అతిథిగా హాజరైన బొజ్జల బృందమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి టోర్నమెంట్ను ప్రారంభించారు.
ప్రకాశం: ఈ నెల 25న సీఎం వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది. సోమవారం హెలిప్యాడ్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై అధికారులు సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ పర్యటనను విజయవంతం చేయాలని చర్యలు చేపడుతున్నాయి.
BPT: ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కృషితో పర్చూరు-ఇంకొల్లు ఆర్అండ్బీ రోడ్డు అభివృద్ధి పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. అధికారులతో నిరంతర సమీక్షలు జరిపి, అడ్డంకులను తొలగించడంతో పనులు పట్టాలెక్కాయి. నాణ్యతతో పనులను వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఏళ్ల నాటి రోడ్డు సమస్య పరిష్కారం అవుతుండటంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
CTR: అంగన్వాడీ వర్కర్ల జీతాలను రూ.23 వేలుకు పెంచాలని డిమాండ్ చేస్తూ పులిచెర్ల ఐసీడిఎస్ ప్రాజెక్టు వద్ద టీచర్లు, హెల్పర్లు ధర్నా చేశారు. యూనియన్ నాయకులు సరస్వతి, అలివేలు, మొబీనా మాట్లాడుతూ.. బడ్జెట్లో జీతాల పెంపు చేయాలని కోరారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, పని భారం ఎక్కువగా ఉండటంతో తగిన జీతాలు లేవని తెలిపారు.
కృష్ణా: సత్య సాయి సేవా సంస్థలు యువజన విభాగం ఆధ్వర్యంలో ప్రతి సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయంలో సుమారు 300 మందికి పైగా అర్జీదారులకు సాయి ప్రోటీన్ ఫుడ్ను పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సత్య సాయి సేవా సంస్థలు స్వచ్ఛందంగా, నిస్వార్థ భావంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. సమాజ సేవలో యువత ముందుండటం అభినందనీయమన్నారు.
AKP: నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో 168 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. హరిబాబు అనే పాత నేరస్థుడు రెండు బొలెరో వాహనాలలో ప్రత్యేక అరలు అమర్చి గంజాయి రవాణా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్సైలు తారకేశ్వరరావు, రిషికేశ్వరరావు ఆధ్వర్యంలో ఐదుగురు నిందితులను పట్టుకున్నారన్నారు.
SKLM: రైతు కన్నీరు ఆగాలంటే వంశధార నీరు రావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి హెచ్ ఈశ్వరరావు అన్నారు. కోటబొమ్మాలి మండలం జగన్నాథపురం గ్రామ యువజన సంఘం కార్యాలయంలో సోమవారం కొండపేట లిఫ్టు ఇరిగేషన్ జల సాధన కమిటీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. మార్చి 4న జల దీక్షలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
కోనసీమ: అమలాపురం పట్టణంలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా బ్యాగ్ లిప్టింగ్ దొంగను అరెస్టు చేసినట్లు ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. సోమవారం అమలాపురం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గత నెలలో పట్టణంలో మహిళ నుంచి బంగారు ఆభరణాలు కాజేసిన కేసులో తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంకి చెందిన బండి శివ పార్వతిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.