ELR: రాజధాని పునఃనిర్మాణానికి విచ్చేయుచున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు వెళ్లే బస్సులను శుక్రవారం ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. చింతలపూడి నియోజకవర్గం నుంచి 25 బస్సులు, 200లకు పైగా కార్లలలో 2,500 మందికి పైగా కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్తున్నట్లు తెలిపారు.
నెల్లూరు జిల్లాలో 7.87లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో చాలా మందికి ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు. మార్చి 30వ తేదీ వరకు మొదటి సిలిండర్ బుక్ చేసుకున్న వారికి ఖాతాలో నగదు జమచేశారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రెండో ఉచిత సిలిండర్ బుకింగ్ మొదలు కాగా.. ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. సిలిండర్ డెలివరీ చేసిన రెండు రోజుల్లోనే లబ్ధిదారుల అకౌంట్లో నగదు జమచేస్తోంది.
కడప: జమ్మలమడుగు, మైలవరం ప్రభుత్వ ఐటిఐలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ నవరూప్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 8వ తరగతి పాస్ 10 తరగతి ఫెయిల్ అయినా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈనెల 24వ తేదీలోగా ఆన్లైన్ లేదా కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
BPT: మార్టూరు జాతీయ రహదారిపై రెస్ట్ ఏరియా వద్ద శుక్రవారం వేకువ జామున ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న 38 మంది ప్రయాణికుల్లో 18 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108, హైవే అంబులెన్స్ల ద్వారా మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కడప: ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో కడప నగరం, శివార్లలో కడప కమాండ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. బ్లూకోల్ట్స్, స్పెషల్ పార్టీ సిబ్బందితో వాహనాల తనిఖీలు, నైట్ పెట్రోలింగ్ చేశారు. వాహనదారులు తమ వెంట వాహనపత్రాలను ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో రిమ్స్ ఇన్స్పెక్టర్ సీతారామి రెడ్డి, సుభాష్ పాల్గొన్నారు.
KDP: కాశినాయన మండలంలో గురువారం భారీ ఈదురు గాలులు బీభత్సం సృష్టించింది. గ్రామాలలో పెద్ద పెద్ద వృక్షాలు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఆరు కాలం కుటుంబం మొత్తం శ్రమించి, చేతికంది వచ్చిన అరటి తోటలు నేలమట్టం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు కోరారు.
కృష్ణా: నేడు అమరావతి రాజధాని పునర్నిర్మాణ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో హాజరయ్యే ప్రజల కోసం కృష్ణా జిల్లా నుంచి ప్రైవేటు, ఆర్టీసీ 850 బస్సులను సిద్ధం చేశారు. ప్రయాణికులకు తాగునీరు, భోజన ఏర్పాట్లు కూడా చేశారు. సుమారుగా జిల్లా నుంచి 51వేల మంది తరలి వెళ్లనున్నట్లు సమాచారం.
GNTR: అమరావతి రాజధాని పునఃప్రారంభ సభ నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. సుమారు 6,500మందిపైగా వివిధ విభాగాల పోలీస్ అధికారులు సిబ్బందితో బందోబస్తు చేశామన్నారు. 250సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. ‘అస్త్రం’ అనే ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ టెక్నాలజీతో ట్రాఫిక్, ప్రజల రద్దీని పర్యవేక్షిస్తున్నామన్నారు.
చిత్తూరు: నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి శుక్రవారం పర్యటిస్తారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 11కు జీడి నెల్లూరు మండలం బుగ్గపట్నం కుప్పమ్మ దేవస్థానంలో ఎంపీపీ అనిత, సర్పంచ్ ముని రాజారెడ్డి ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారని తెలిపారు. 12 గంటలకు పెనుమూరు మండలం కండిగ గ్రామంలో పర్యటిస్తారని వెల్లడించారు.
ప్రకాశం: జిల్లాలో ఇంటర్, డిప్లమో, డిగ్రీ, పీజీ అర్హత కలిగిన నిరుద్యోగులకు శ్రీ హర్షిని డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో రేపు అనగా ఆదివారం మెగా క్యాంపస్ డ్రైవ్ నిర్వహించుచున్నారు. కావున నిరుద్యోగులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా శ్రీహర్షిని విద్యాసంస్థల ఛైర్మన్ గోరంట్ల రవికుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
తిరుపతి: ప్రత్యేక ఆర్థిక మండలిలో ఎలీ కంపెనీ కోసం ఏపీఐఐసీ నిర్వహిస్తున్న భూసేకరణ సర్వేను సత్యవేడు నియోజకవర్గం కొల్లడం గ్రామస్తులు అడ్డుకున్నారు. భూసేకరణను నిలిపివేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ప్రధాన రహదారిలో బైఠాయించి పెట్రోల్ బాటిళ్లతో సర్వేయర్ల ఎదుట నిరసన తెలిపారు. తమ భూములను కాపాడుకునేందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
PPM: చినమరికి గ్రామంలో గల రెండు బావులలో చెత్తా, చెదారం పిచ్చి మొక్కలు దట్టంగా, పేరుకుపోవడంతో ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకుండా ఉన్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ మేరకు ఆ రెండు బావులు పూడ్చాలని, వాటి స్థానంలో రెండు చేతి బోర్లు వేయాలన్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.
VSP: సింహాచలం చందనోత్సవంలో గోడకూలిన ఘటన తనను ఎంతగానో కాలచివేసిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ గురువారం అన్నారు. మద్దిలపాలెం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. కొంతమంది అవినీతి అధికారులు సింహాచల దేవస్థానంలో తిష్టవేసుకుని ఉన్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.
SKLM: ఇటీవల జీడీ ఉత్పత్తిదారుల సంఘము పారిశ్రామికవాడ కార్యవర్గమంలో ఒకరైన కోశాధికారి శాసనపురి శ్రీనివాసరావు అకాల మరణము చెందిన విషయం తెలిసిందే. నూతన కోశాధికారి ఎంపిక నిమిత్తం సర్వ్యసభ్య సమావేశంను గురువారం ఏర్పాటు చేశారు. సంఘ సభ్యులు యువకులు కొంచడా వినయ్ని ఏకగ్రీవంగా ఎంపికచేయడం జరిగినది. ఈ సందర్భంగా నూతన కోశాధికారి వినయ్ను సంఘ సభ్యుల అభినందించారు.
ప్రకాశం: అద్దంకి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఉదయం 6 గంటల నుంచి పింఛన్ పంపిణీ చేసినట్లు అద్దంకి ఎంపీడీవో సింగయ్య తెలిపారు. గురువారం అద్దంకిలో ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఇప్పటివరకు 6,915 పింఛన్లకు 6,325 మందికి పింఛన్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. గురువారం తీసుకోని వారికి శుక్రవారం పింఛను అందజేస్తామన్నారు.