CTR: అంగన్వాడీ వర్కర్ల జీతాలను రూ.23 వేలుకు పెంచాలని డిమాండ్ చేస్తూ పులిచెర్ల ఐసీడిఎస్ ప్రాజెక్టు వద్ద టీచర్లు, హెల్పర్లు ధర్నా చేశారు. యూనియన్ నాయకులు సరస్వతి, అలివేలు, మొబీనా మాట్లాడుతూ.. బడ్జెట్లో జీతాల పెంపు చేయాలని కోరారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, పని భారం ఎక్కువగా ఉండటంతో తగిన జీతాలు లేవని తెలిపారు.
కృష్ణా: సత్య సాయి సేవా సంస్థలు యువజన విభాగం ఆధ్వర్యంలో ప్రతి సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయంలో సుమారు 300 మందికి పైగా అర్జీదారులకు సాయి ప్రోటీన్ ఫుడ్ను పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సత్య సాయి సేవా సంస్థలు స్వచ్ఛందంగా, నిస్వార్థ భావంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. సమాజ సేవలో యువత ముందుండటం అభినందనీయమన్నారు.
AKP: నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో 168 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. హరిబాబు అనే పాత నేరస్థుడు రెండు బొలెరో వాహనాలలో ప్రత్యేక అరలు అమర్చి గంజాయి రవాణా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్సైలు తారకేశ్వరరావు, రిషికేశ్వరరావు ఆధ్వర్యంలో ఐదుగురు నిందితులను పట్టుకున్నారన్నారు.
SKLM: రైతు కన్నీరు ఆగాలంటే వంశధార నీరు రావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి హెచ్ ఈశ్వరరావు అన్నారు. కోటబొమ్మాలి మండలం జగన్నాథపురం గ్రామ యువజన సంఘం కార్యాలయంలో సోమవారం కొండపేట లిఫ్టు ఇరిగేషన్ జల సాధన కమిటీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. మార్చి 4న జల దీక్షలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
కోనసీమ: అమలాపురం పట్టణంలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా బ్యాగ్ లిప్టింగ్ దొంగను అరెస్టు చేసినట్లు ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. సోమవారం అమలాపురం ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గత నెలలో పట్టణంలో మహిళ నుంచి బంగారు ఆభరణాలు కాజేసిన కేసులో తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంకి చెందిన బండి శివ పార్వతిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
అన్నమయ్య: పరీక్ష రాయాల్సిన విద్యార్థి ఆసుపత్రి పాలైన ఘటన ఇది. రాజంపేట పిచ్చిగుంట్లపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థికి వీరబల్లిలో పరీక్షా కేంద్రం కేటాయించారు. ఇవాళ ఉదయం తన ఇంటి నుంచి బైకుపై పరీక్షా కేంద్రానికి బయల్దేరాడు. నీలవాండ్లపల్లి సమీపంలో ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టి వెళ్లిపోయింది. రోడ్డుపై తీవ్ర గాయాలతో ఉన్న విద్యార్థిని స్థానికులు గుర్తించి రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ASR: విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా క్రమశిక్షణతో తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని బ్రహ్మ కుమారీస్ ప్రతినిధులు అన్నారు. సోమవారం అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన నషాముక్తా అభియాన్ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఉన్నత స్థాయికి ఎదగడానికి విలువలతో కూడిన విద్య, మంచి ఆలోచన పనులు, ప్రవర్తనకు ధ్యానం ఉపయోగకరమని ప్రిన్సిపాల్ డా. నాయక్ అన్నారు.
కర్నూలు: న్యాయవాది పవన్ కుమార్పై జరిగిన పోలీస్ దాడిని ఖండిస్తూ ఎమ్మిగనూరు న్యాయవాదులు విధులను బహిష్కరించి సోమవారం నిరసన తెలిపారు. స్థానిక కోర్టు నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రషీదుల్లా మాట్లాడుతూ, సంబంధిత సిఐపై వెంటనే సస్పెన్షన్ విధించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
TPT: సత్యవేడు ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కేంద్రాల్లో పిల్లలకు అందిస్తున్న భోజనానికి ప్రభుత్వం చెల్లిస్తున్న మెనూ చార్జీలు సరిపోవడం లేదని CITU నాయకుడు రమేష్ పేర్కొన్నారు. వేతనాలు పెంపు, ఖాళీ పోస్టుల భర్తీ, ఉచిత గ్యాస్ సరఫరా తదితర డిమాండ్లు నెరవేర్చాలని కోరారు.
AKP: దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన, విధి నిర్వహణలో గాయపడిన మాజీ సైనికులు కుటుంబాల సంక్షేమానికి ఉద్దేశించిన సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ విజయ కృష్ణన్ పిలుపునిచ్చారు. జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ దీనికి రూ.2.42 లక్షల విరాళాన్ని కలెక్టర్కు మెప్మా పీడీ సరోజినీ సోమవారం అందజేశారు.
AKP: నర్సీపట్నం ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కిల్లాడ వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో సంత్ గాడ్గే బాబా జయంతి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాలకొండయ్య మాట్లాడుతూ.. సంత్ గడ్గే బాబా అణగారిన వర్గం రజక కులం నుంచి వచ్చిన మహోన్నత పురుషుడు అని కొనియాడారు. భారతదేశంలో రాజకీయపార్టీలు స్వచ్ఛంద సంస్థలు ఆయన్ను స్ఫూర్తిగా తీసుకున్నాయన్నారు.
కృష్ణా: చల్లపల్లి అభివృద్ధికి ఎంపీ విజయేంద్ర ప్రసాద్ సహకారం అభినందనీయం అని స్వచ్ఛ చల్లపల్లి కన్వీనర్ డాక్టర్ డీ.ఆర్.కే.ప్రసాద్ అన్నారు. గ్రామంలో స్వచ్ఛ సుందర చల్లపల్లి గురించి తెలుసుకుని చల్లపల్లి అభివృద్ధికి ఆయన తమ ఎంపీ లాడ్స్ ద్వారా రూ.50 లక్షలు కేటాయించారు. ఈ మేరకు సోమవారం హైదరాబాదులో డా.డి.ఆర్.కె.ప్రసాదు, డాక్టర్ పద్మావతి కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రకాశం: పెద్దారవీడు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరించే స్వర్ణ రథాలను స్థానిక టీడీపీ ఇంఛార్జ్ గూడూరి ఎరీక్షన్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. గ్రామాల పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని, తడి చెత్త-పొడి చెత్త విడివిడిగా సేకరించి తమ ఇండ్ల వద్దకే వస్తున్న స్వచ్ఛ రథాలలో వేసి పరిశుభ్రతకు సహకరించాలన్నారు.
GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత డిసెంబర్లో నిర్వహించిన 2/2 బీపీఈడీ (మూడో సెమిస్టర్) రెగ్యులర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి శివప్రసాదరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ ఫలితాలను, రీవాల్యుయేషన్ మరియు ఫీజు చెల్లింపు వంటి ఇతర పూర్తి వివరాలను యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో చూడొచ్చన్నారు.
CTR: విభిన్న ప్రతిభ వంతులకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ల్యాప్టాప్ పంపిణీ చేశారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అనంతరం జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో శాంతిపురం మండలం, బెల్లకోగిల గ్రామనికి చెందిన పాలిటెక్నిక్ కళాశాల నందు మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆర్. విజయరాజ్కి ల్యాప్టాప్ అందజేశారు.