అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల ఉద్యోగాలను ఒప్పంద ప్రతిపాదికన దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ ఓ డాక్టర్ దేవి పేర్కొన్నారు. క్లినికల్ సైకాలజిస్ట్-1, ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్-1, ఆప్టోమెట్రిస్ట్-1, ఫార్మసిస్ట్-1, డీఈవో-1, లాస్ట్ గ్రేట్ సర్వీస్-1 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
NTR: విజయవాడకు చెందిన 2 ఏళ్ల చిన్నారి క్యాన్సర్తో బాధపడుతూ HCG క్యాన్సర్ సెంటర్లో చికిత్స పొందుతోంది. ఆర్థికంగా వెనుకబడిన ఈ కుటుంబానికి పటాన్ చెరుకి “సింహ వాహిని ఫౌండేషన్” రూ. 37,050 సహాయం అందించింది.ఈ ఫౌండేషన్ అధ్యక్షుడు వంశీ రెడ్డి, సభ్యులతో కలిసి కుటుంబాన్ని కలిసి పరామర్శించి, ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రతి ఒక్కరూ వీరికి తోడుగా నిలవాలని వంశీ రెడ్డి కోరారు.
SKLM: మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని రణస్థలం సర్పంచ్ భానోజీ నాయుడు పేర్కొన్నారు. శనివారం ఉదయం రణస్థలం గ్రామంలోని కరిమజ్జి వీధిలో సర్పంచ్ నేతృత్వంలో పంచాయతీ అధికారులు సమక్షంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. వీధుల్లో కాలువలను శుభ్రం చేయించారు. తడి-పొడి చెత్తను వేరువేరుగా ఉంచి, పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని సూచించారు.
ATP: ధర్మవరంలోని ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ను మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ శనివారం పరిశీలించారు. అనంతరం క్యాంటీన్లో ఉదయం కమిషనర్ టిఫిన్ చేశారు. క్యాంటీన్కు వచ్చిన వారిని టిఫిన్ ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు.
మన్యం: జియ్యమ్మవలస మండలం సుభద్రమ్మవలస గ్రామంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు శనివారం తెలిపారు. ఎవరూ ఏనుగుల వద్దకు వెళ్లొద్దని, కవ్వింపు చర్యలకు పాల్పడొద్దని సూచించారు. రోడ్లపైకి ఏనుగులు వచ్చేటప్పుడు వాహనదారులు చూసుకుని వెళ్లాలని కోరారు. గ్రామాలలో ఏనుగులు తిరుగుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
KDP: సింహాద్రిపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 7 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయని ప్రిన్సిపల్ స్వర్ణలత తెలిపారు. పదవ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు అడ్మిషన్లు పొందవచ్చు అన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఆధ్వర్యంలో సీబీఎస్ఈ సిలబస్ బోధన ఉంటుందన్నారు.
ప్రకాశం: వేర్వేరు కారణాలతో శుక్రవారం ఐదుగురు మృతి చెందారు. పెద్ద దోర్నాల మండలంలోని గుంటవానిపల్లె సమీపంలో బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా, పెద్దారవీడు మండలంలో తోకపల్లి సమీపంలో ఢీకొనటంతో రైతు మృతి చెందాడు. సంతనూతలపాడు మండలం గుమ్మలంపాడు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. మార్కాపురం, గిద్దలూరులో వేరువేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.
KRNL: పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే నామినేటెడ్ పదవులు ఉంటాయని TDP ఆలూరు ఇన్ ఛార్జ్ వీరభద్రగౌడ్ అన్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబును శుక్రవారం రాత్రి కలిసి నియోజకవర్గ పరిస్థితిని వివరించారు. వెనుకబడిన ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, వేదవతి ప్రాజెక్టు పూర్తి చేస్తే నియోజకవర్గంలో తాగు, సాగు నీటికష్టాలను తీర్చాలని సీఎంను కోరారు.
కోనసీమ: శ్రీరామనవమి సందర్భంగా అమలాపురం నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ చల్లా సత్యనారాయణ మూర్తి శుక్రవారం తెలిపారు. 5వ తేదీ శనివారం ఉదయం 8:30 నుంచి రాత్రి 8:30 వరకు భధ్రాచలంకు ప్రత్యేక బస్సులు తిరుగుతాయన్నారు. తిరిగి 6వ తేదీ స్వామి వారి కళ్యాణం అనంతరం మధ్యాహ్నం 1:00 గంట నుండి అందుబాటులో ఉంటాయన్నారు.
KDP: పులివెందుల పట్టణంలోని చిన్న రంగాపురం గ్రామ సమీపంలోని కోతి సమాధి వద్ద శుక్రవారం గంజాయి విక్రయిస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నామని అర్బన్ సీఐ నరసింహులు తెలిపారు. స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో ఆయన పట్టుబడిన యువకుడు మల్లికార్జున మీడియా ఎదుట హాజరు పరిచారు. మల్లికార్జున జల్సాలకు అలవాటు పడి గంజాయి విక్రయిస్తూ జీవనం గడుపుతున్నాడన్నారు.
E.G: గోపాలపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్గా గోపాలపురం నియోజకవర్గానికి చెందిన యుద్దనపూడి బ్రహ్మరాజు నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారి చేసింది. బ్రహ్మరాజు మాట్లాడుతూ.. పార్టీలో తన కష్టం గుర్తించిన సీఎం చంద్రబాబుకు, నారా లోకేశ్కు కృతజ్ఞతలు తెలిపారు.
VZM: VT అగ్రహారంలో ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ను ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వితేజ్ శుక్రవారం ప్రారంభించారు. ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా రీఛార్జ్ చేసేందుకు ఈ స్టేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వాహనదారులంతా రీఛార్జ్ స్టేషన్ను సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆయనతోపాటు ఈపీడీసీఎల్ జిల్లా అధికారులు ఉన్నారు.
GNTR: గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో పశ్చిమ నియోజకవర్గంలో గల శానిటేషన్ సిబ్బందితో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ MLA గళ్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పశ్చిమ నియోజకవర్గాలలోని అన్ని డివిజన్లో ప్రజారోగ్య రక్షణలో పారిశుద్ధ్యం మెరుగుదలకు కార్మికులు, అధికారులు అంకిత భావంతో ఉండాలన్నారు.
PLD: అప్పులు బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెల్దుర్తి మండలం మిట్టమీద పల్లె గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన కోటేశ్వరరావు (43) పది ఎకరాల్లో మిర్చి పంటను సాగుచేశాడు. మొత్తం సుమారు రూ.30లక్షలు అప్పు అవటంతో మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో మనోవేదనకు గురై గ్రామ సమీపంలోని కుంటలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
మన్యం: పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రను శుక్రవారం UTF రాష్ట్ర కార్యదర్శి మురళీమోహన్ రావు కలసి పాఠశాల విద్యారంగ సంస్కరణలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు. ప్రాథమిక పాఠశాలల్లో 3,4,5 తరగతులను ఇతర పాఠశాలల్లో విలీనం చేయవద్దని.. 6,7,8 తరగతులను ఎత్తివేయకూడదని కోరారు. ముఖ్యంగా తెలుగు-ఇంగ్లీష్ మాధ్యమాలను కొనసాగించాలని కోరారు.