నల్గొండ జిల్లాలో అనధికార వడ్డీ వ్యాపారులు బరితెగిస్తున్నారు. నూటికి పది రూపాయల వరకు అడ్డగోలు వడ్డీలు వసూలు చేస్తూ సామాన్యులను వేధిస్తున్నారు. అప్పు తీర్చలేదన్న నెపంతో దాడులకు తెగబడుతుండటంతో పేదలు, చిరు వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఎల్లారెడ్డిగూడెంలో వడ్డీ డబ్బుల విషయంలో ఫైనాన్సర్లు జరిపిన దాడిలో ఒక వ్యక్తి మృతి చెందడం సంచలనం సృష్టించింది.