PDPL: అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, సుల్తానాబాద్ మున్సిపాల్టీ పరిధి రెండో వార్డు కౌన్సిలర్ గాజుల రాజమల్లు పేర్కొన్నారు. రెండో వార్డు పరిధిలోని పలువురు ఇందిరమ్మ లబ్ధిదారులు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు ఆయన భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేసి సకాలంలో బిల్లులు పొందాలని లబ్ధిదారులకు సూచించారు.
NLG: మిర్యాలగూడ మండలం, గూడూరులో ఆదివారం ఘోరం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను భర్త అతికిరాతకంగా హత్య చేశాడు. ఒరిస్సాకు చెందిన మనీషా తారు, తవీర్ మూడు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. జీవనోపాధి కోసం గూడూరులోని ఇటుక బట్టీలో పనికి చేరిన ఈ దంపతుల మధ్య గొడవ జరగడంతో, తవీర్ భార్యను చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
SRPT: మహిళల హక్కుల పరిరక్షణకు సమస్యల పరిష్కారానికి ఐద్వా అండగా ఉంటుందని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు జూలకంటి విజయలక్ష్మి పేర్కొన్నారు. ఆదివారం మునగాల మండలం నర్సింహులగూడెంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నా ప్రభుత్వం నియంత్రించలేకపోతోందని విమర్శించారు.
JGL: పెగడపల్లి మండలం దేవి కొండ లేగలమర్రి గ్రామాల మధ్య రోడ్డు సమస్య జటిలంగా మారింది భూవివాదంలో కొత్త రోడ్డు ప్రాజెక్టు నిర్మాణంలో పాత రోడ్డు మునిగిపోగా, కొత్త రహదారి పనులు భూవివాదంతో నిలిచిపోయాయి. సమీప పట్టాదారులు అడ్డుకోవడంతో నిర్మాణం ముందుకు సాగడం లేదు. ఫలితంగా రెండు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆసిఫాబాద్ పట్టణంలోని మినరల్ వాటర్ ప్లాంట్లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలో 13 మినరల్ వాటర్ ప్లాంట్లను CI బాలాజీ వరప్రసాద్ ఆదివారం పరిశీలించారు. ప్రతి ప్లాంట్లో లైసెన్స్లు, నాణ్యత ప్రమాణాలు, పరిశుభ్రత పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించినట్లు పేర్కొన్నారు. లైసెన్స్ లేకుండా ప్లాంట్ నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
NRML: పెంబి మండల కేంద్రంలోని శివారులో ఎస్సై హనుమాన్లు నాకాబంది చేపట్టారు. ఇందులో భాగంగా పలు ద్విచక్ర వాహనాలు, కార్లు, గూడ్స్ వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం పలువురిని ఫింగర్ ప్రింట్ ద్వారా తనిఖీలు నిర్వహించారు. సరైన అనుమతి పత్రాలు లేని పలు వాహనాలకు చలానాలు విధించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది ఉన్నారు.
RR: శంషాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్, పహాడీషరీఫ్ పోలీసుల దాడిలో జల్ పల్లిలో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సింథటిక్ రంగులు, నాసిరకం పదార్ధాలతో పేస్ట్ తయారు చేసి విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. సుమారు రూ.10 లక్షల విలువైన 340 కిలోల పేస్ట్, ముడిసరుకు,యంత్రాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
KMM: మార్చి 15 నాటికి వెలుగుమట్ల బాధితులలో అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలం ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వెలుగుమట్ల అంశాన్ని కొందరు రాజకీయాలకు వాడుతున్నారని, తాము ఈ అంశాన్ని కేవలం పేదల కోణంలోనే చూస్తున్నట్లు చెప్పారు. ఇంటి స్థలం కోసం ఎవరికి డబ్బులు ఇచ్చారో నిర్భయంగా పోలీసులకు చెప్పాలని సూచించారు.
MHBD: గార్ల మండల కేంద్రంలోని వర్తక సంఘ భవనంలో ఆదివారం మున్నేరు జల దోపిడి వ్యతిరేక రైతు సదస్సు నిర్వహించారు. మున్నేరు జలసాధన కమిటీ కన్వీనర్ గంగావత్ లక్ష్మణ్ నాయక్ మాట్లాడుతూ.. పాత పద్ధతి ప్రకారమే మున్నేరు ప్రాజెక్టును నిర్మించాలని డిమాండ్ చేశారు. స్థానిక రైతులకు అన్యాయం జరిగేలా ప్రాజెక్టు అమలు చేయకూడదని, రైతులు ఉద్యమం ద్వారా అడ్డుకోవాలన్నారు.
MLG: రామప్ప ఆలయాన్ని చత్తీస్గఢ్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ గుజ్జు వెంకటేశ్వర్ సందర్శించారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టూరిజం గైడ్ విజయ్, వారికి ఆలయ విశిష్టత, శిల్పకళ ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన వెంట ఎస్సై చల్ల రాజు పాల్గొన్నారు.
KMR: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కారం చేస్తారన్నారు. ప్రజావాణిలో అన్ని శాఖల అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు.
NZB: 2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ఆధారంగా హైకోర్టు తీర్పును అమలు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. దేశంలోని సగం రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ మెమోను అనుసరిస్తూ పాత పెన్షన్ విధానాన్ని తమ ఉద్యోగులకు వర్తింపజేశారన్నారు. మార్చి 7న చలో HYD ఇందిరా పార్క్ను విజయవంతం చేయాలన్నారు.
BHNG: స్వర్ణకారులు అన్ని రంగాలలో ఎదగాలని స్వర్ణకార సంఘం యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కొండపర్తి బాలా చారి అన్నారు . మోత్కూరు మండల స్వర్ణకార సంఘం ఎన్నికలను స్థానిక ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏకగ్రీవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్వర్ణకారులు ఐక్యమత్యంతో రాజకీయ, విద్యా,సామాజిక ఆర్థిక రంగాలలో ఎదగాలని సూచించారు.
NLG: సీఐటీయూ జిల్లా 13వ మహాసభలు ఈనెల 14,15 తేదీల్లో నల్గొండ పట్టణంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి తెలిపారు. జిల్లా విస్తృతస్థాయి సమావేశం ఆదివారం నల్గొండలోని దొడ్డి కొమరయ్య భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 33 మండలాల నుండి వివిధ యూనియన్ల నుండి 500 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.