KNR: రామడుగు గ్రామంలో కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం గ్రామ పంచాయతీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. గ్రామస్తులకు ఇబ్బందులు కలగకుండా పంచాయతీ సిబ్బంది ప్రత్యేక వేషధారణతో గ్రామంలో తిరుగుతూ కోతులను తరిమివేస్తున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మొయిజ్, ఉపసర్పంచ్ పెందోట రాజుతో పాటు వార్డ్ సభ్యులు పాల్గొన్నారు. గ్రామస్తులు భయపడకుండా సహకరించాలని కోరారు.
NLG: చంద్రగ్రహణం కారణంగా రేపు నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడాల రామలింగేశ్వర స్వామి దేవాలయం, గోపాలయపల్లి సమీపంలోని వారిజాల వేణుగోపాల స్వామి దేవాలయాలను మూసివేస్తున్నట్లు ఆయా ఆలయాల ఈవోలు సల్వాది మోహన్ బాబు, వెంకట్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణంలో పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి. పలు కాలనీల్లో నిండిన డ్రైనేజీలను శుభ్రం చేశారు. ప్రధాన రోడ్లపై ఉన్న చెత్తాచెదారం మట్టిని తొలగించారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించి డంపింగ్ యార్డ్కు తరలించారు. ప్రజలు చెత్త రోడ్లపై పారవేయకుండా మున్సిపల్ వాహనాలకు అందివాలని కమిషనర్ కోరారు.
SRPT: మునగాల మండలం రేపాల గ్రామంలోని స్వయంభు లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం నేడు రాత్రి 10 గంటలకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కళ్యాణాన్ని దర్శించుకోవడం వల్ల ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. కళ్యాణ మహోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఛైర్మన్ సారిక చిన్న రామయ్య యాదవ్ తెలియజేశారు.
HYD: నగరాల్లో మారుతున్న జీవనశైలితో చాలామంది రోజుకు కనీసం 200 గ్రాముల కూరగాయలు, ఆకుకూరలు కూడా తీసుకోవడం లేదని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల రక్తహీనత, మధుమేహం సమస్యలు పెరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు. రోజుకు కనీసం 400–500 గ్రాముల వరకు కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడంతో విటమిన్లు, ఖనిజాలు అందుతాయని HYD NIN మాజీ శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మయ్య సూచించారు.
NZB: సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు మహారాష్ట్రలోని బాబ్లీ గేట్లను నిన్న ఎత్తారు. ఈ కార్యక్రమంలో TG, MH, కేంద్ర జలవనరులశాఖ అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జూలై 1 నుంచి అక్టోబరు 29 వరకు నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయాల్సి ఉంటుంది. అదనంగా మార్చి 1న ఒకరోజు 0.6 టీఎంసీల నీటిని కూడా విడుదల చేస్తారు.
మహబూబ్నగర్ జిల్లా వాసులు దుబాయ్లో ఇరుక్కుపోయారు. ఓ గోల్డ్ లోన్ సంస్థ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 360 మందిని టూర్కు తీసుకెళ్లింది. తిరుగు ప్రయాణానికి విమానాశ్రయానికి చేరుకున్న వేళ యుద్ధ పరిస్థితుల కారణంగా ఫ్లైట్లు రద్దయ్యాయి. దీంతో వారు అక్కడే నిలిచిపోయారు. అధికారుల జోక్యం కోరుతున్నారు.
BHPL: గోరికొత్తపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుని రైతులు వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని AO సారయ్య హెచ్చరించారు. AO మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ చేయకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు అర్హత కోల్పోతారని స్పష్టం చేశారు. స్థానిక AEOల వద్ద త్వరగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలన్నారు.
KMM: రఘునాధపాలెం మండలం మంచుకొండ శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురిని సోమవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం మంచుకొండ-పంగిడి దారిలోని ఒక తోటలో దాడులు నిర్వహించి రూ.3వేల నగదుతో పాటు 6 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారవ్వగా మొత్తం తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
JN: తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా కలకలం ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
KMR: మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భక్తులకు ముఖ్య ప్రకటన విడుదల చేసింది. రేపు చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆలయాన్ని మూసివేస్తామని ఆలయ అభివృద్ధి కమిటీ తెలిపింది. మంగళవారం ఆలయంలో సాధారణ దర్శనాలు ఉండవని స్పష్టం చేశారు. బుధవారం ఉదయం సంప్రోక్షణ, అభిషేక కార్యక్రమాల అనంతరం భక్తులకు తిరిగి దర్శనం కల్పించనున్నారు.
MDCL: ఉప్పల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో యాంటీబయోటిక్స్ను వైద్యుల సలహా లేకుండా వాడటం ఆరోగ్యానికి ముప్పు అని డా.సౌశీల్య హెచ్చరించారు. చిన్న జ్వరం, దగ్గు వచ్చినప్పుడే స్వయంగా మందులు కొనుగోలు చేయడం వల్ల యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ పెరిగే ప్రమాదం ఉందన్నారు. అవసరమైనప్పుడు మాత్రమే, పూర్తి కోర్స్ పాటిస్తేనే ప్రయోజనం ఉంటుందని సూచించారు.
BDK: జూలూరుపాడు మండలం పెద్ద హరిజన వాడ గ్రామస్తులు భక్తిభావంతో రామనామ స్మరణతో భద్రాచలం వైపు తమ పవిత్ర పాదయాత్రను సోమవారం ప్రారంభించారు. భక్తులు గత నెల రోజులుగా అత్యంత నియమ నిష్టలతో, కఠిన ఉపవాసాలతో సిద్ధం చేసుకున్న ఒలిచిన గోటి తలంబ్రాలను భద్రాద్రి రామయ్య చెంతకు సమర్పించనున్నారు. భక్తులు సంప్రదాయక నారింజ, పసుపు రంగు దుస్తులు ధరించి వెళ్లారు.
KMR: జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా అమలు చేస్తున్న ‘ఆపరేషన్ కవచ్’ సత్ఫలితాలను ఇస్తోంది. రామారెడ్డి (M) పోసానిపేట వాసి పెంటయ్య ట్రాక్టర్ను నిందితులు దొంగిలించి బాన్సువాడలో విక్రయించేందుకు తరలిస్తుండగా ఆదివారం పద్మాజీవాడి X రోడ్డు వద్ద ‘ఆపరేషన్ కవచ్’ తనిఖీల్లో భాగంగా గాంధారి SI ఆంజనేయులు అడ్డుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
VKB: హోలీ పండుగ సమీపిస్తున్న వేళ వికారాబాద్ జిల్లాలో ప్రకృతి రంగుల విందు చేస్తోంది. పెద్దేముల్ మండల పరిధిలోని జనగాం, మారేపల్లి, మంబాపూర్, తట్టేపల్లి, అడికిచెర్ల, ఇందూర్ సహా పలు గ్రామాల్లోని పొలాల గట్లు, అటవీ ప్రాంతం మోదుగ పూలతో ఎర్రగా మెరిసిపోతోంది. రోడ్డుకు ఇరువైపులా విరబూసిన ఈ పూలు అగ్ని కీలల్లా కనిపిస్తూ బాటసారులను కట్టిపడేస్తున్నాయి.