NRML: శనివారం ఖానాపూర్ మున్సిపాలిటీలో నిర్వహించిన “ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు వార్డులలో పర్యటించి, చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ప్రత్యేక ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రజలంతా తమ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన తెలిపారు.
WGL:యువకులు డ్రగ్స్ మత్తులో పడకుండా భవిష్యత్తును కాపాడుకోవాలని WGL పోలీస్ కమిషనరేట్ సూచించింది. కమిషనరేట్ అధికార ఫేస్బుక్ అకౌంట్లో “Your Future Matters..Stay Drug-Free.. Be Strong..Be Smart. Say No to Drugs..One Decision Can Save Your Life” అనే పోస్టర్ రూపొందించి అవగాహన కల్పిస్తోంది. డ్రగ్స్ వినియోగం, విక్రయం గమనిస్తే 1908కు సమాచారం ఇవ్వాలన్నారు.
ADB: రైతులకు రైతుబంధు అందించాలని కోరుతూ జైనథ్ మండలంలో బీఆర్ఎస్ నాయకులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిర్వహిస్తూ నాయకులు అర్థనగ్న ప్రదర్శనతో రైతుల నుంచి సంతకాలు సేకరణ కార్యక్రమం చేపట్టారు. పెట్టుబడికి సరిపోను పంటలు పండక రైతులు తీవ్ర ఇబ్బందులలో ఉన్నారన్నారు. రైతు భరోసాను వారి ఖాతాలో జమ చేయాలని నాయకుడు పిడుగు స్వామి డిమాండ్ చేశారు.
MHBD: ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్న నేపథ్యంలో గంగారం ఎస్సై రవికుమార్ మండల ప్రజలకు పలు సూచనలు చేశారు. వేసవి తాపం పెరుగుతున్న దృష్ట్యా, చిన్నారులు ఈత కోసం సమీపంలోని నీటి కుంటలు, చెరువుల వద్దకు వెళ్లే అవకాశం ఉందన్నారు. అలాంటి సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున, తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టాలన్నారు.
RR: చేవెళ్ల మున్సిపాలిటీ, మొయినాబాద్ కార్యాలయాలలో నిర్వహించిన బడ్జెట్ సమావేశలలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటి 2026-27కు బడ్జెట్ అంచనాను ఆమోదించారు. అభివృద్ధి పనులు, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయల కల్పనకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
NLG: ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం నూతన ఆసరా పెన్షన్లను వెంటనే అమలు చేయాలని KVR దివ్యాంగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరమేష్ విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుల పెన్షన్లను పెంచుతామనడం హర్షించదగ్గ విషయమన్నారు. ఆసరా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసి రెండేళ్లు పూర్తవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, వెంటనే కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని ఆయన కోరారు.
PDPL: పెద్దపల్లి పట్టణంలోని ఆర్.కే గార్డెన్స్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన 238 మంది లబ్ధిదారులకు మొత్తం 75.88 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పంపిణీ చేశారు. పేద ప్రజల వైద్య ఖర్చులకు సీఎం సహాయనిధి ఎంతో ఊరటనిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
WGL: హంటర్ రోడ్డులోని గోల్డెన్ గార్డెన్లో తూనికల కొలతల శాఖ ఆధ్వర్యంలో బంగారం, వెండి వ్యాపారులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. అడిషనల్ కంట్రోలర్ రాజేశ్వరరావు మాట్లాడుతూ.. వ్యాపారాల్లో నాణ్యత పాటించాలని, తూకాల్లో మోసాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వినియోగదారుల హక్కులు కాపాడేందుకు నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.
NGKL: కల్వకుర్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో మహిళలకు ఉచిత మరుగుదొడ్ల సౌకర్యాన్ని కల్పించారు. ఈ మేరకు ఆర్టీసీ డిపో మేనేజర్ సుభాషిని ఉచిత మరుగుదొడ్లను శనివారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తున్న మహిళలు ఉచితంగా మరుగుదొడ్లు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అందుకే ఈ సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు.
JGL: వేసవికాలం దృష్ట్యా ఎండలు ముదురుతున్న నేపథ్యంలో పెగడపల్లి మండల వ్యాప్తంగా ఈనెల 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు పెగడపల్లి ఎంఈవో సులోచన తెలిపారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలాస్ ఉత్తర్వుల మేరకు, విద్యాశాఖ నిర్ణయం ప్రకారం ఈ విద్యా సంవత్సరం చివరి వర్కింగ్ ఏప్రిల్ 21 వరకు, ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాల నిర్వహించాలన్నారు.
KNR: ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు. శనివారం తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామంలో పార్నంది శ్రీలత-శ్రీనివాస్ దంపతులు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
NLG: మార్చి 16 నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిరుద్యోగుల పక్షాన నిలబడి ఉద్యోగాల ప్రకటనపై ప్రస్తావించాలని బీసీ JAC ఆధ్వర్యంలో నిరుద్యోగులు స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిరుద్యోగులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
WNP: రైతులు కష్టపడి పండించిన ధాన్యంపై రైస్ మిల్లుల వద్ద ఏ విధమైన అక్రమాలు, నిర్లక్ష్యం జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి హెచ్చరించారు. శనివారం పోలీస్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై సీఎంఆర్ కేసులపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా విచారించి త్వరగా పూర్తి చేయాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశించారు.
SRD: బొల్లారం డివిజన్లో పేద ముస్లింలకు ఇశాళ రంజాన్ తోఫాలు పంపిణీ చేశారు. శనివారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రంజాన్ పండుగను పేద ముస్లింలు ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తోఫాలు అందజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జయపాల్ రెడ్డి, మహేందర్ రెడ్డి ఉన్నారు.
MBNR: జిల్లాకు చెందిన బీసీ కార్పొరేటర్లు, సర్పంచులను బీసీ టీచర్స్ అసోసియేషన్ మహబూబ్ నగర్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు కృష్ణుడు మాట్లాడుతూ.. బీసీ ప్రజా ప్రతినిధులను సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. రాబోయే రోజులలో జనరల్ స్థానాల్లో కూడా బీసీలు పెద్ద ఎత్తున విజయం సాధించాలని ఆకాంక్షించారు.