SDPT: హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గుట్టల్లో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల 78వ వర్ధంతి సభ ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి హాజరయ్యారు. అమరవీరుల ఘాట్ వద్ద నివాళులర్పించారు. అమరవీరుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి భవిష్యత్ తరాలకు అందించాలని కోరారు.
SDPT: మార్చి నెలలోనే ఎండలు 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఎండాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి ప్రజలకు సూచనలు చేశారు. ఎండలకు ఎక్కువ నీటిని తాగాలని.. దీంతో శరీరంలో నీటి శాతం పెరుగుతుందన్నారు. అవసరమైతే తప్ప బయటికి రాకూడదని సూచించారు.
WGL: యుద్ధం కారణంగా ఉమ్మడి జిల్లాలో LPG సిలిండర్ల బుకింగ్లు భారీగా పెరిగాయి. ముఖ్యంగా WGL జిల్లాలోని 16 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో జనవరి నెలలో రోజుకు సుమారు 16 వేల బుకింగ్లు ఉండగా.. నిన్న ఒక్క రోజే 59,200 బుకింగ్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో అత్యవసర అవసరం ఉన్నవారికి సిలిండర్లు ఆలస్యంగా అందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
NLG: దేవరకొండ నియోజకవర్గం నేరేడుగోమ్ము మండలం, పెద్ద మునిగల్ గ్రామానికి చెందిన దాచేపల్లి చెన్నయ్య గత రెండు రోజులుగా కనిపించడం లేదు. ఆయన మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎవరైనా ఆయనను ఎక్కడైనా చూసినా లేదా ఆచూకీ తెలిసినా దయచేసి వెంటనే 8008823448, 9989437017 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
WNP: రైతులు కష్టపడి పండించిన ధాన్యం ప్రభుత్వం రైస్ మిల్లులకు ఉపయోగించిన తర్వాత దానిపై ఏ విధమైన అక్రమాలు, నిర్లక్ష్యం జరిగినా కఠిన చర్యలు తప్పవని జిల్లా SP సునీత రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం పోలీస్ కార్యాలయంలో అధికారులతో విచారణ సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న సీఎంఆర్ పడ్డీ కేసులను వేగవంతంగా విచారించి త్వరగా పూర్తి చేయాలని తెలియజేశారు.
PDPL: గోదావరిఖని వన్ టౌన్ పోలీసుల తీరుకు నిరసనగా గత నెల రోజులుగా న్యాయవాదులు చేపట్టిన నిరసనలు ముగిశాయి. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధుల బహిష్కరణతో పాటు పలు విభిన్న నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇద్దరు న్యాయమూర్తులు, పోలీసు ఉన్నతాధికారులు న్యాయవాదులతో జరిపిన చర్చలతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది. ఇకనుంచి విధులకు హాజరు కానున్నారు.
ADB: సాత్నాల మండలం న్యూ టెమ్రిగూడలో కోలం తెగ కుల పెద్దలు శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. కోలం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సోనేరావు, జిల్లాధ్యక్షుడు గోవింద్ రావు మాట్లాడుతూ.. తమ తెగలోని ప్రతి ఒక్కరు వరకట్నానికి దూరంగా ఉండి పలు తీర్మానాలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. మద్యం, మాంసానికి దూరంగా ఉండి సాంప్రదాయ బద్ధంగా వివాహాలు చేసుకోవాలని కోరారు.
BHPL: జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా సమస్యలు తలెత్తకుండా వినియోగదారులకు నిరంతరంగా అందుబాటులో ఉండేలా చూడటానికి జిల్లా స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధ్యక్షతన ఈ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ గ్యాస్ సిలిండర్ల సరఫరాను డిస్ట్రిబ్యూటర్ల గోదాముల నిల్వలు రోజువారీగా పరిశీలిస్తుందని కలెక్టర్ తెలిపారు.
JGL: జగిత్యాల పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో జరగనున్న శ్రీరామనవమి వేడుకల సందర్భంగా నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆహ్వాన పత్రికను జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రావాలని పద్మశాలి సేవా సంఘం కార్యవర్గ సభ్యులు ఆహ్వానించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని నందయ్య కోరారు.
BDK: దమ్మపేట మండలం గడుగులపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురైన విద్యార్థులను శనివారం మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజనశాలను పరిశీలించి విద్యార్థులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని వర్కర్లను ఆదేశించారు.
హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాకలో విషాదం చోటుచేసుకుంది. ఈనెల 4న అదృశ్యమైన గౌతమ్ కుమార్(20) అనే యువకుడు, రాజన్న బావి సమీపంలోని పులమ్మ బావిలో శవమై తేలాడు. ట్యాంక్ బండ్ శివ టీమ్ సాయంతో మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
MNCL: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 55వ డివిజన్లో చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ప్రజలకు ఆరోగ్యకర వాతావరణం కల్పించేందుకు పారిశుద్ధ్య పనులను నిరంతరం కొనసాగించాలన్నారు.
KNR: జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా సాగేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. శనివారం మొదటిరోజు కరీంనగర్లో ఓల్డ్ హై స్కూల్, ధన్గర్ వాడి పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు.
HYD: RRR చుట్టూ ప్రతిపాదిత రింగ్ రైల్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు DPR సిద్ధం చేసేందుకు రైల్వే శాఖ అనుమతించినట్లు ఆయన తెలిపారు. ఇది పూర్తయితే నగర శివార్ల రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఆయన పేర్కొన్నారు.
KMM: రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని పెన్షన్ దారుల సంఘం జిల్లా కన్వీనర్ యలమద్ది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శనివారం బోనకల్లో నిర్వహించిన పీఆర్పీఏ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 మార్చి తర్వాత పదవీ విరమణ పొందిన వారికి గ్రాట్యువిటీ, ఇతర ప్రయోజనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.