MBNR: పాలమూరు యూనివర్సిటీలో ‘గ్రాన్ టూరిస్మో 2.0’ కార్యక్రమాన్ని వీసీ ప్రొఫెసర్ ఎన్.శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు ప్రారంభించారు. వీసీ మాట్లాడుతూ.. సైన్స్, మేనేజ్మెంట్ విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్ల వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి వేదికలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.
HNK: జిల్లా నూతన కలెక్టర్గా చాహత్ బాజ్పాయ్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు వరంగల్ మహానగర పాలక సంస్థ (GWMC) కమిషనర్గా సేవలు అందించిన ఆమెను ప్రభుత్వం కలెక్టర్గా నియమించింది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లా సమగ్ర అభివృద్ధికి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వెల్లడించారు.
MBNR: TGSC స్టడీ సర్కిల్లో 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://www.tsstudycircle.co.in వెబ్ సైట్లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని NTR ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మార్చి 1న 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
VKB: కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిన్న ఇంగ్లీష్, కంప్యూటర్ సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థులకు టాస్క్ ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ITCE డిస్టిక్ మేనేజర్ సిరాజుద్దీన్ మాట్లాడారు. విద్యార్థులకు బేసిక్ మ్యాథమెటిక్స్, పోటీ పరీక్షలకు అవసరమైన ఆప్టిట్యూడ్ మూర్తిమత్వ అభివృద్ధి, కోడింగ్, డీకోడింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
SRCL: మద్యం సేవించి వాహనాలు నడపరాదని వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి అన్నారు. గురువారం వేములవాడ పట్టణంలోని మూలవాగు వంతెన వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు చోటుచేసుకుని జీవితాలు కోల్పోతున్నారని అన్నారు. పట్టణ సీఐ వీరప్రసాద్, జిల్లా ట్రాఫిక్ సీఐ సురేష్ పాల్గొన్నారు.
KNR: కరీంనగర్ రూరల్ పరిధిలో దుర్షేడ్ వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టరును పోలీసులు గురువారం పట్టుకున్నారు. గోపాలపూర్ ఎక్స్ రోడ్డు వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా తనిఖీలు చేపట్టగా, అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న పొన్నం లక్ష్మణ్, బిజిలి చందులను అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి నిందితులను కోర్టుకు తరలించినట్లు సీఐ తెలిపారు
MNCL: మంచిర్యాలలో నిబంధనలకు విరుద్ధంగా ఒకే భవనంలో నిర్వహిస్తున్న సూర్యతేజ పారామెడికల్ ఇన్స్టిట్యూట్, లక్ష్మీ నర్సింగ్ స్కూల్ విద్యా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని DMHOకు VJS జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ వినతిపత్రాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. కోర్సులకు సంబంధించిన మౌలిక సదుపాయాలు లేకుండా ఒకే భవనంలో 2 విద్యా సంస్థల నిర్వహణ ఆందోళకరమన్నారు.
KMM: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించే జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఇవాళ ఖమ్మం కలెక్టరేట్లో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. ఈ సమావేశానికి అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు.
HNK: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని వినియోగదారులకు విద్యుత్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని NPDCL సీఎండీ వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఓవర్లోడ్ ఉన్న ట్రాన్స్ ఫార్మర్లను గుర్తించి వాటి సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు.
MHBD: తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాలు, మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులకు చెందిన 87 మంది లబ్ధిదారులకు రూ.43,50,000 విలువ గల సీఎం సహాయనిధి చెక్కులను ఇవాళ పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అందజేశారు. సీఎం సహాయనిధి ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలు వైద్య చికిత్సల కోసం అప్పుల పాలు కాకుండా ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు.
MLG: పట్టణ కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట గురువారం ఆర్టీసీ బస్సు పార్క్ చేసి ఉన్న కారును ఢీకొట్టింది. ఎస్సీ కాలనీ నుంచి బస్టాండ్ వైపు వెళ్తున్న బస్సు, ఎదురుగా వస్తున్న మరో బస్సును తప్పించే క్రమంలో నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన నిలిపిన కారును ఢీకొట్టినట్లు సమాచారం. ఘటనలో కారుకు నష్టం వాటిల్లగా, ఎవరికి గాయాలు కాలేదు.
RR: దిల్సుఖ్నగర్లోని శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్లో నిర్వహించిన శ్రీ సాయి నామ శతకోటి (వంద కోట్లు) జప మహాయజ్ఞం ముగింపు ఉత్సవం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఛైర్మన్, ఆలయ ట్రస్ట్ సభ్యులు స్పీకర్ను శాలువాతో ఘనంగా సన్మానించి మెమొంటో అందజేశారు.
WGL: నగరంలో పదవీవిరమణ చేసి 6నెలలు గడిచినా తన భర్తకు రావాల్సిన ప్రయోజనాలు అందలేదని విజయలక్ష్మి నేడు సామాజిక మాధ్యమాల్లో సీఎం రేవంత్ను వేడుకున్నారు. ఏఎస్ఐగా రిటైర్ అయిన వీవీఎల్ఎన్ మూర్తి గుండెసమస్యతో సికింద్రాబాద్లో చికిత్స పొందుతున్నారు. అప్పులు, వైద్య ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని కోరారు.
HYD: హెచ్-సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనుల నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్ నం. 2, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఈ నెల 27 నుంచి ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి రానున్నాయి. స్టీల్ ఫ్లైఓవర్, అండర్పాస్ నిర్మాణ పనుల కారణంగా రద్దీ ఏర్పడే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు.
NZB: TU పరిధిలోని M.Ed మూడో సెమిస్టర్ రెగ్యులర్ విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లింపునకు నేడు చివరి తేదీ అని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు.నేడు సాయంత్రం లోపు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా రూ.1210 ఫీజు చెల్లించవచ్చన్నారు.రూ.100 అపరాధ రుసుంతో మార్చి 2 వరకు అవకాశముందని పేర్కొన్నారు.పరీక్షలను మార్చి నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు