SRPT: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇవాళ ఎస్పీ నరసింహ ఐపీఎస్ నెలవారీ సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా శాంతిభద్రతలు, మహిళా భద్రత, సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన పెంచాలని సిబ్బందిని ఆదేశించారు. అక్రమ రవాణాపై నిఘా ఉంచాలని, పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.
MDK: సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16న ధర్నాలో పాల్గొన్న అంగన్వాడీలకు మెమో జారీచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం అన్నారు. నర్సాపూర్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.. అంగన్వాడి ఉద్యోగులకు ప్రభుత్వం మెమో జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
KNR: జమ్మికుంట మండలంలో దళితబంధు రెండో విడత నిధులను తక్షణమే విడుదల చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఎంపీడీవో పద్మకు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల కోడ్ వల్ల నిలిచిపోయిన నిధుల జాప్యంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కార్యదర్శి చిలివేరు శ్రీకాంత్ పాల్గొన్నారు.
MDK: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేయాలని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కాజీపేట రాజేందర్ డిమాండ్ చేశారు. కౌడిపల్లి మండల కేంద్రంలో బుధవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వికలాంగులకు రూ. 6000 పెన్షన్, మహిళలకు రూ.2500 పెన్షన్, వ్యవసాయ కూలీలకు రూ. 12000 అమలు చేయాలన్నారు.
MHBD: మున్సిపాలిటీ 36వ వార్డ్ కౌన్సిలర్ ముత్యం వెంకన్నగౌడ్ ఉదారతను చాటుకున్నారు. వార్డులోని పారిశుధ్య కార్మికులకు తన సొంత ఖర్చుతో నూతన వస్త్రాలు అందజేసారు. ఈ వస్త్రాలను మున్సిపల్ చైర్మన్ జ్యోతిరమేష్, కమీషనర్ రాజశేఖర్లతో కలసి కౌన్సిలర్ సిబ్బందికి బుధవారం పంపిణీచేశారు. ఉగాది పండుగ కానుకగా ఈ నూతన వస్త్రాలను అందజేసిన కౌన్సిలర్కు ధన్యవాదాలు తెలిపారు.
ASF: పాఠశాల విద్యార్థులకు ఒంటిపూట బడులు ప్రారంభమైన నేపథ్యంలో పిల్లలు ఈతకు వెళ్లే విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నితిక పంత్ బుధవారం సూచించారు. పిల్లలకు ఈత నేర్పించాలనుకుంటే తల్లిదండ్రులు లేదా పెద్దల పర్యవేక్షణలోనే నేర్పించాలన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యమని అన్నారు.
SDPT: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా బుధవారం ఆకునూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై అపూర్వ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండాలని, అతివేగం వల్ల కలిగే ప్రమాదాలను వివరించారు.
BDK: ప్రాధాన్యతా రంగాల రుణాల లక్ష్యాలు, సాధనపై కలెక్టర్ అంకిత్ బుధవారం సమగ్ర సమీక్ష జరిపారు. జిల్లాలో ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచేందుకు బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. 31-12-2025 నాటికి జిల్లాలో మొత్తం ప్రాధాన్యతా రంగంలో 4945.28 కోట్ల లక్ష్యానికి గాను 4010.50 కోట్లు మంజూరు చేయబడిందని అన్నారు.
WNP: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఆస్తి, నీటి పన్ను బకాయిల వసూలులో వేగం పెంచాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ తన ఛాంబర్లో ఐదు మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పెండింగ్లో ఉన్న బకాయిదారుల జాబితాను సిద్ధం చేసి వారికి నోటీసులు పంపించాలన్నారు.
KMR: జిల్లాలోని 9 మండలాల్లో 12 శనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మార్క్ఫెడ్ జిల్లా అధికారి చందు తెలిపారు. జిల్లాలోని బిచ్కుంద, సదాశివ్ నగర్, తాడ్వాయి మండలాల్లో రెండు కేంద్రాల చొప్పున, మద్నూర్, డోంగ్లి, జుక్కల్, రాజంపేట, గాంధారి, పెద్ద కొడపగల్ మండలాల్లో ఒక్కటి చొప్పున కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు బుధవారం వెల్లడించారు.
BHNG: జానకిపురం గ్రామంలో ఇవాళ పశువులకు ఉచిత గాలి కుంటు నివారణ టీకాలు Dr. అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ అనిత – సమ్మయ్య యాదవ్ హాజరై మాట్లాడుతూ.. ఇది పశువుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం అందిస్తున్న గొప్ప అవకాశం అన్నారు. పశు వైద్య సిబ్బంది VA ఈశ్వరయ్య, గోపాలమిత్రలు శ్రీనివాసులు, మల్లేష్ గ్రామ రైతులు పాల్గొన్నారు.
MNCL: సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం, 4 లేబర్ కోడ్స్ రద్దుపై కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని TNTUC నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం బెల్లంపల్లిలో ప్రధాన కార్యదర్శి మనీరామ్ సింగ్ మాట్లాడుతూ.. సింగరేణిలో ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో గుర్తింపు సంఘాలు విఫలమయ్యాయని విమర్శించారు. కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని కోరారు.
JGL: మల్లాపూర్ మండలం వెంకట్రావుపేట్ నుంచి నర్సపురం, హనుమాన్ గొర్రెపల్లి, వాల్గొండ వరకు లింక్ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరుట్ల కాంగ్రెస్ ఇంఛార్జ్ నర్సింగ రావుకి 3 గ్రామాల సర్పంచ్లు వినతిపత్రం అందజేశారు. నర్సింగరావు సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావుపేట సర్పంచ్ వెంకటేశ్, గొర్రెపల్లి సర్పంచ్ వెంకటరెడ్డి పాల్గొన్నారు.
JN: చిల్పూరు ఎంపీడీవో రఘురామకృష్ణను బీజేపీ మండల అధ్యక్షుడు ఉపేందర్ యాదవ్, నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. మండలంలో నెలకొన్న సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేలా చూడాలని, వీబీ రామ్ జీ పథకంలో భాగంగా ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశం కల్పించాలని ఉపేందర్ యాదవ్ కోరారు.
HNK: గిరిజనులకు హామీల అమలుకై బడ్జెట్లో 25 వేల కోట్లు కేటాయించాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు వీరన్ననాయక్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. హనుమకొండలో వారు మాట్లాడుతూ… గిరిజనులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుపై బడ్జెట్లో నిధులు కేటాయించాలని, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దళితులు, గిరిజనుల ఓట్లే ప్రధానమన్నారు.