NLG: నల్గొండ పట్టణంలోని పానగల్లు ఛాయా సోమేశ్వర ఆలయంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రత్యేకమైన పూజలను నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకమైన అభిషేకాన్ని నిర్వహించారు. పట్టణంలోని ఆలయాలను మరింత అభివృద్ధి చేయాలని భూపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
MHBD: మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా కురవి ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కెనాన్ పోలీస్ సిబ్బందికి సూచించారు. కురవి జాతరలో బందోబస్తు ఏర్పాట్లు ఎస్పీ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు.
నిజామాబాద్: గోకుల్ గో సేవా సమితి ఆధ్వర్యంలో మహా శివరాత్రి పర్వదినంను పురస్కరించుకుని అంబికా సహిత నగరేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో గోపూజ నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు, సహకరించిన సభ్యులకు ఆ గోమాత ఆశీస్సులు, ఆ అంబికా సహిత నగరేశ్వరుడి ఆశీస్సులు మరియు వాసవి మాత కృపా కటాక్షాలు ఉండాలని పురోహితులు ప్రత్యేకంగా ఆశిర్వధించారు.
MNCL: శివరాత్రి పండుగ పూట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కోటపల్లి మండలంలోని ఎర్రాయిపేట గోదావరిలో స్నానానికి వెళ్లి పారుపల్లికి చెందిన రాజేశ్(50) నీటిలో గల్లంతయినట్లు గ్రామస్థులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ములుగు: వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ములుగు జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి, ఈనెల 28 సాయంత్రం నాలుగు గంటల వరకు బహిరంగ సభలు, సమావేశాలపై నిషేధం అమలు చేస్తూ కలెక్టర్ దివాకర ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల పేర్కొన్న ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై బీఎన్ఎస్ సెక్షన్ 153 ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
NLG: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని DMHO డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అన్నారు. పట్టణ కార్యాలయంలోని సమావేశ మందిరంలో PHC, అర్బన్ హెల్త్ సెంటర్లలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.రోజు PHC లకు వచ్చే రోగుల నమూనాలను సేకరించి హబ్కు పంపాలన్నారు.
NZB: కన్న తల్లిని కొడుకు చంపిన ఘటన పిట్లంలో జరిగింది. SI రాజు వివరాలిలా.. సాబేర బేగం (60)కు నలుగురు కొడుకులు, కూతురు ఉన్నారు. రెండో కొడుకైన శాదుల్ నాలుగేళ్ల క్రితం తన తమ్ముడైన ముజిబ్ను కత్తితో పొడిచి చంపాడు. ఈ కేసులో రాజీపడాలని తల్లిని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో రోకలి బండతో తలపై దాడి చేయగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ వెల్లడించారు
NZB: బిచ్కుంద మండల కేంద్రంలోని కాశీ విశ్వనాథ మందిరం వద్ద మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. స్వామి వారిని వరుస క్రమంలో దర్శించుకుంటూ పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను పూజారులు వివరించారు. సాయంత్రం వరకు స్వామివారి దర్శనానికి అనుమతి ఇస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు.
SRPT: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో స్వామి వారిని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులుదర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జడల రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలన్నారు. ఆయన వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
KNR: హుజూరాబాద్లో 2రోజుల క్రితం భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. ACP శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. అప్పులు ఎక్కువై ఎలా తీర్చాలో తెలియక నాగరాజు అనే వ్యక్తి తన తల్లిదండ్రులపై దాడి చేయించాడు. దొంగల ముఠాతో చేయి కలిపి ఇంట్లో నుంచి 70తులాల బంగారం, రూ.5లక్షలు చోరీ చేయించ్చినట్లు విచారణలో తేలింది. ఘటనపై కేసు నమోదుచేసి, ఐదుగురిని రిమాండ్కు తరలించామని ACP తెలిపారు.
JGL: మల్లాపూర్(M) వెంకట్రావుపేట్ శివారులో ఈనెల 20న స్వాధీనం చేసుకున్న ఇసుకకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ వీర్ సింగ్ తెలిపారు. ఎలాంటి అనుమతి లేకుండా నిల్వఉంచిన 15 ట్రిప్పుల ఇసుక డంపులకు 28వ తేదీ శుక్రవారం ఉ.11 గంటలకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేలంలో అధికంగా పాటపాడిన వ్యక్తులకు ఇసుక రవాణా చేసుకోడానికి అనుమతి ఇస్తామన్నారు.
SRPT: టీబీ(క్షయ) వ్యాధి నిర్మూలన లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని జిల్లా వైద్యాధికారి కోటా చలం కోరారు. కలెక్టరేట్లో జిల్లా వైద్యాధికారులు, వైద్యసిబ్బందితో అవగాహన సమావేశం నిర్వహించారు. నిక్షయ శిబిర్(వంద రోజుల్లో టీబీ నిర్మూలన)లో భాగంగా రోగులను గుర్తించి, అవగాహన కల్పించాలని సూచించారు. తెమడతో కూడిన దగ్గు రెండు వారాలకు మించి ఉంటే పరీక్షలు చేయించాలన్నారు.
NLG: దేవరకొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద ఈనెల 27న వేలం పాట నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ద్విచక్ర వాహనానికి రూ.10 వేలు, ఫోర్ వీలర్ వాహనాలకు రూ.30 వేలు డిపాజిట్ చేసి 27న ఉదయం 10 గంటల లోపు పేరు నమోదు చేసుకోవాలని కోరారు.
NLG: వలిగొండ మండల కేంద్రంలోని వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ సెంటర్ నంబర్ 140లో ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాటులను మంగళవారం కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వలిగొండ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.