Kishan Reddy comments KCR habit of not implementing promises and cheating
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ(BJP) ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీపై దూకుడుగా వ్యవహరిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంది. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రెండు చోట్ల ఓడిపోతారని పేర్కొన్నారు. డబ్బుతో కేసీఆర్ నాయకులను కొంటారు కానీ ప్రజల ఆవేదన, కోపాన్ని మాత్రం కొనలేరని అన్నారు.
హుజురాబాద్ ఉపఎన్నికల్లో వచ్చిన ఫలితాలే వచ్చే తెలంగాణ ఎన్నికల్లో(telangana assembly election 2023) మళ్లీ వస్తాయని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో యువత తీసుకునే నిర్ణయానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అడ్రస్ లేకుండా పోతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇన్నాళ్లు సీఎం కేసీఆర్ ను ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కలిసే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్నారు. కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయాలేదని గుర్తు చేశారు. ప్రతి సారి కేసీఆర్ కు హామీలు ప్రకటించడం, మోసం చేయడం అలవాటేనని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
అయితే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా రాష్ట్రంలో రోడ్లు ఎలా అభివృద్ధి చెందుతున్నాయని కిషన్ రెడ్డి(kishan reddy) బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీతో కలిసి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతోపాటు రాష్ట్రంలో బీసీలకు సీఎం పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. మరో రెండు రోజుల్లో మిగతా అభ్యర్థుల జాబితా కూడా ప్రకటిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు ఇప్పటికే కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై ఐదు నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని బీజేపీ నేత ఆరోపించారు. అక్కడి ప్రభుత్వం పథకాలను అమలు చేసేందుకు పన్నులు వసూలు చేస్తున్నట్లు గుర్తు చేసింది.
ఇది కూడా చూడండి: Breaking News : మంత్రి సబిత ఇంద్రారెడ్డి గన్మన్ ఆత్మహత్య

