హైదరాబాద్ (Hyderabad) గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరో వివాదంలో చిక్కున్నారు. ఆయన పై మరో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయాత్రలో(Shobhayatra) ఓ వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ షాహినాత్ గంజ్ పోలీసులు రాజా సింగ్ పై ఈ కేసు నమోదు చేశారు. శోభాయాత్రలో రాజా సింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఎస్ఐ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. తన కొడుకుని పరిచయం చేస్తూ.. ఇతర వర్గాలపై రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు (Controversial comments) చేసినట్లు ఫిర్యాదు పేర్కొన్నారు. దీంతో రాజాసింగ్పై ఐపీసీ153-ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తాజాగా శోభాయాత్రలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దీంతో పోలీసులు (Police) ఆయనపై కేసు నమోదు చేశారు. ఇతర కమ్యూనిటీలను కించపరిచేలా రాజాసింగ్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అయితే, ఈ కేసును రాజాసింగ్ తప్పుబట్టారు.
శోభాయాత్రలో తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదన్నారు. ధర్మం గురించి, హిందూ రాష్ట్రం గురించి మాట్లాడితే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణ (Telangana) భారతదేశంలో ఉందా లేదా పాకిస్థాన్లో ఉందా అని రాజాసింగ్ ప్రశ్నించారు. తనపై కొట్టేసిన పీడీ యాక్ట్ తిరిగి తెరిచి తనను మళ్లీ జైలుకు పంపే కుట్ర జరుగుతోందని ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ను గత ఏడాది ఆగస్టులో అరెస్టు చేశారు. దీంతో హైదరాబాద్ పోలీసులు అతడిపై పీడీ యాక్ట్ (PD Act) కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యాఖ్యల కారణంగా బీజేపీ రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ కేసులో రాజాసింగ్ కు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.

