అనంతపురం: ధర్మవరంలో బీజేపీ నాయకుడు డోలా రాజారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన 40 కుటుంబాలు శుక్రవారం బీజేపీలో చేరాయి. జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డోలా రాజారెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఆశయాలు, మంత్రి సత్యకుమార్ యాదవ్ పట్టణంలో చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారని అన్నారు.
NLG: నార్కట్పల్లి మండలం గోపలాయిపల్లి శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం రాత్రి 7గంటలకు స్వామి వారి రధోత్సవం నిర్వహించనున్నట్లు దేవాలయ వ్యవస్థాపక ఛైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
KMR: జిల్లా మద్నూర్ మండలం సుల్తాన్పేట్ గ్రామానికి చెందిన యువకుడు అమృత్వార్ యోగేశ్ 2, 700 కిలో మీటర్లు బైక్పై ప్రయాణించి, ప్రయాగరాజ్, అయోధ్య, వారణాసి పుణ్య క్షేత్రాలను దర్శించుకున్నారు. బైక్పై రాముడి ఆలయానికి వెళ్లడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.
SKLM: నందిగం మండలం కొత్తఅగ్రహారం జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వృద్ధుని వివరాలు తెలియాల్సి ఉంది. నందిగాం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
SRD: పదవ తరగతిలో 100% ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డి నుంచి శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు 10 జీపీఏ సాధించేలా అధికారులు కృషి చేయాలని చెప్పారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
SRD: మునిపల్లి మండలం చిలపల్లిలో జరిగిన భూ వివాదంలో అన్న తమ్ముడిని చంపాడని ఎస్సై రాజేష్ తెలిపారు. గ్రామానికి చెందిన యాదయ్య తమ్ముడు శివయ్య (37)ను బండరాయితో కొట్టి చంపినట్లు తెలిపారు. శివయ్య తండ్రి పేరున ఉన్న భూమిని తండ్రి చనిపోగానే అన్నయాదయ్య తన పేరుపై చేసుకొని తమ్ముడికి డబ్బులు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. తమ్ముడు పైసలు అడుగుతున్నాడని చంపేశాడన్నారు.
NLG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి శనివారం నల్గొండకు వస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ పట్టణంలోని ఒక హోటల్లో ఓటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొంటారని పేర్కొన్నారు.
KMR: బాన్సువాడ మండలం బోర్లంలో గ్రామ యువకుల ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో వీరమరణం పొందిన సైనికులకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ జై జవాన్ అంటూ గ్రామ వీధులలో తిరిగి అంబేద్కర్ విగ్రహం, గాంధీ చౌక్ వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు పాల్గొన్నారు.
MNCL: భీమారం సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. ఇందుకు సబ్ స్టేషన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
TG: మోదీని ఉద్దేశించి CM రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే రేవంత్ వ్యాఖ్యలు చేశారన్నారు. ఎవరు మతం మార్చుకున్నారో చర్చ చేయాలంటే రేవంత్ టెన్ జనపథ్ నుంచి ప్రారంభించాలని తెలిపారు. ఎంత ప్రయత్నించినా దృష్టి మళ్లించడం పనిచేయదని చెప్పారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఉండవని బీజేపీ తేల్చిచెప్పిందని గుర్తు చేశారు.
HNK: జిల్లా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో నేడు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సీఈవో, డిప్యూటీ సీఈఓ ల నూతన సంవత్సర డైరీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డైరీలను అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం. విద్యాలత, మేన శ్రీనివాస్, భూక్య రవి తదితరులు పాల్గొన్నారు.
NTR: కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో నవంబర్ 2024లో నిర్వహించిన బీటెక్ 3,5,7వ సెమిస్టర్ (2023-24విద్యా సంవత్సరం) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఫిబ్రవరి 17వ తేదీలోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000చెల్లించాల్సి ఉంటుందని పరీక్షల విభాగ కంట్రోలర్ తెలిపారు.
కర్నూలు జిల్లా ఆస్పరికి చెందిన బంత్రోతి నాగరాజు(50) మృతిచెందారు. రాజమహేంద్రవరంలో సీఐడీ ప్రాంతీయ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయన.. కొంతకాలంగా కాలేయం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ.. గతేడాది డిసెంబర్ వరకు మెడికల్ లీవ్లో ఉన్నారు. ఈనెల 2న తిరిగి విధుల్లో చేరారు. ఈ క్రమంలో గురువారం గాంధీపురం-3లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.
CTR: కొలమాసనపల్లి అయ్యాంరెడ్డి పల్లికి చెందిన మోహన్ తన తల్లిదండ్రులపై శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి వివరాల మేరకు.. మోహను వీకోట మండలానికి చెందిన ప్రేమతో నాలుగు సంవత్సరాల కిందట వివాహమైంది. మోహన్ తన భార్యకు విడాకులు ఇస్తే ఆస్తిలో వాటా ఇస్తామని అతని తల్లిదండ్రులు బెదిరిస్తున్నారు. చేసేదేమి లేక తన తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
MHBD: ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటనపై శుక్రవారం దంతాలపల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. మండల పరిధిలోని తూర్పు తండాకు చెందిన మాలోత్ దంజా అనే వ్యక్తి గత మూడు రోజులుగా కనిపించడం లేదు. శుక్రవారం బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు దంతాలపల్లి ఎస్సై రాజు తెలిపారు.