CTR: ఏపీ రాష్ట్ర రెడ్డి సంఘం ఐటీ విభాగ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కార్వేటినగరం(M) ముక్కురానిపల్లికి చెందిన మహేశ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. రెడ్డి సామాజిక వర్గ అభివృద్ధికి ఆయన చేసిన కృషి, సమాజం పట్ల చూపిన అంకిత భావాన్ని గుర్తిస్తూ ఈ నియామకాన్ని ప్రకటించినట్లు రెడ్డి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని గోపాల్ రెడ్డి తెలిపారు.
KDP: వల్లూరు(మం) పుష్పగిరి సంతాన మల్లేశ్వర స్వామి ఆలయం ఎదుట ఒకే విగ్రహంలో వృషభం, నందికేశ్వరుని మానవ రూపాలు దర్శనమివ్వడం విశేషం. ఈ అరుదైన శిల్పాన్ని రచయిత బొమ్మిశెట్టి రమేష్ పరిశీలించి వివరాలు వెల్లడించారు. పశుత్వం నుంచి దైవత్వానికి మార్పును సూచించేలా నంది పాదాల మధ్య నందికేశ్వరుడు అర్ధపద్మాసనంలో ఉండటం ప్రత్యేకతగా పేర్కొన్నారు.
MHBD: ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరోల్ మండలంలోని కాంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మురళికృష్ణ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఈ ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
BPT: అద్దంకి సమీపంలోని శ్రీనివాస నగర్ వద్ద శనివారం జరిగిన బైక్ ప్రమాదంలో గోవాడ గ్రామానికి చెందిన గెల్లా యేసు రాజు (20) గాయపడ్డాడు. గోవాడ నుంచి అద్దంకి వైపు వెళ్తుండగా, రోడ్డు అంచున బైక్ అదుపుతప్పి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
MNCL: మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా పనిచేసిన పి.చంద్రయ్య పదోన్నతిపై జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా విధులు నిర్వహిస్తున్నారు.
KNR: చొప్పదండి మున్సిపల్ సర్వసభ్య సమావేశం శనివారం ఛైర్ పర్సన్ వడ్లూరి సరిత, కమిషనర్ మనోహర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణంలో జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులు, అమృత్ 2.0 పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు. పారిశుద్యం పనులు, మంచినీటి సరఫరా, పన్ను వసూళ్లపై సమీక్ష చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ మానస పాల్గొన్నారు.
KMR: గాంధారి మండలం నేరేల్ తండా గ్రామపంచాయతీ ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ఛైర్మన్ బండారు రమేశ్ శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కందులకు క్వింటాలుకు రూ. 8,000 మద్దతు ధర నిర్ణయించిందని తెలిపారు. రైతులకు మేలు చేసేందుకే ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్, ఉప సర్పంచ్ నెహ్రూ ఉన్నారు.
GNTR: చంద్రగ్రహణం కారణంగా తెనాలిలోని వైకుంటపురం ఆలయాన్ని మార్చి 3వ తేదీన మూసివేస్తున్నట్లు శనివారం ఆలయ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం స్వామి, అమ్మవార్లకు పూజా కార్యక్రమాలు, మహా నివేదన నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారాలను మూసివేస్తారు. తిరిగి మార్చి 4వ తేదీ బుధవారం ఉదయం 6 గంటలకు ఆలయ శుద్ధి కార్యక్రమాలు చేపట్టి, ఉదయం 8 గంటల నుంచి ఆలయం తెరవనున్నారు.
JGL: కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ఈవో శ్రీకాంత్ రావును మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి బదిలీ, నియామకం చేస్తునట్లు దేవదాయ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గత సంవత్సరం జనవరి 18న కొండగట్టు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్ రావు ఆలయానికి అందించిన సేవలు, నిర్వహణ అద్భుతమని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
ADB: నార్నూర్ మహాగావ్ శివారులో శనివారం పోలీస్ సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. అనంతరం వాహనదారులకు రోడ్డు భద్రతపై పలు సూచనలు చేశారు. పోలీసుల ట్రాఫిక్ నియమాలను పాటించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసు నమోదు చేయడమే కాకుండా వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని పోలీసులు సూచించారు.
ASF: కెరమెరి మండలం పరంధోలి, ముకదంగూడా గ్రామపంచాయతీల్లో NHRC జిల్లా ఛైర్మన్ రాథోడ్ రమేష్ చొరవతో శనివారం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. గ్రామీణ ప్రజలకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు. చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని, ముందస్తు పరీక్షల ద్వారా వ్యాధులను గుర్తించవచ్చన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలు పొందారు.
ASR: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గుమ్మకోట పంచాయతీ తుమ్మలవలసలోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్(బాయ్స్)లో విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. విద్యార్థులు తమ మెదడుకు పదునుపెట్టి పలు వినూత్న ప్రయోగాలు ప్రదర్శించారు. ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సియ్యారి దొన్ను దొర ఈ ప్రదర్శనను వీక్షించి, విద్యార్థులను అభినందించారు.
సత్యసాయి: జిల్లాలోని 25 మండలాలను రాష్ట్ర ప్రభుత్వం కరవు ప్రాంతాలుగా ప్రకటించింది. వర్షపాతం, సాగు విస్తీర్ణం, తేమ తదితర అంశాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కరువు సహాయక చర్యలతో పాటు రైతులకు రుణాల మంజూరుపై దృష్టి సారించాలని కలెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది. ఆగలి, హిందూపురం, మడకశిర, కదిరి, పుట్టపర్తి సహా పలు మండలాల్లో మధ్యస్థ కరువు ఉన్నట్లు గుర్తించారు.
TG: శారదాపీఠం భూములపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోకాపేటలో భూములు పీఠానికే కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జలమండలికి చేసిన భూముల కేటాయింపులను రద్దు చేసింది. పీఠం భూముల్లో నిర్మాణాలపై CM రేవంత్ సమీక్ష నిర్వహించారు. సరైన సమాచారం ఇవ్వలేదని అధికారులపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు కలిసి వివరాలు అందించాలని పీఠం ప్రతినిధులకు సూచించారు.