W.G: వీరవాసరం ZPH స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వేణుగోపాల్ తమపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, చెప్పలేని మాటలు మాట్లాడుతున్నారంటూ 7వ తరగతి విద్యార్థినులు హెచ్.యం ప్రసాద్కు నిన్న ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గతంలోనే వేణుగోపాల్ 10వ తరగతి విద్యార్థినిలపై అసభ్యంగా ప్రవర్తించడంతో అప్పట్లోనే ఈ విషయం హెచ్.యంకు ఫిర్యాదు చేసినా ఆయనపై చర్యలు లేకపోవడం గమనార్హం.
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని మున్సిపల్ ఛైర్పర్సన్ మిడిదొడ్డి మాధవి అన్నారు. ఈ అంశంపై శనివారం మున్సిపల్ కార్యాలయంలో వార్డు అధికారులు, ఆర్పీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మార్చి 31లోగా పన్ను వసూళ్లు పూర్తిచేయాలని, అవసరమైతే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి లక్ష్యాన్ని సాధించాలని సూచించారు.
ELR: జీలుగుమిల్లి మండల పరిధిలో వజ్ర ప్రహర్ ప్రోగ్రాంలో భాగంగా పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. వివిధ గ్రామాల్లో ఉన్న పాతబడిన భవనాలు, నిర్మానుష్య ప్రాంతాలు, బస్ షెల్టర్లను తనిఖీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు.
నంద్యాల: జిల్లాలో ఆదివారం కావడంతో మాంసం దుకాణాల వద్ద రద్దీ అధికంగా కనిపించింది. నంద్యాల, వెలుగోడు, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో వినియోగదారులు పెద్ద సంఖ్యలో కొనుగోళ్లు చేశారు. ఈరోజు కేజీ మటన్ రూ.1000, స్కిన్లెస్ చికెన్ రూ.250, విత్ స్కిన్ రూ.230, లైవ్ చికెన్ రూ.195గా ఉన్నాయి. చేపలు కేజీ రూ.180, గుడ్లు డజను రూ.70గా విక్రయిస్తున్నారు.
KNR: వీణవంక మండలం పరిధిలోని చల్లూరు గ్రామంలో అక్రమంగా ఇసుక రవాణా కేసులో పరారీలో ఉన్న నిందితుడు శివరాత్రి మహేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 25న అనుమతి పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేస్తూ కానిస్టేబుల్ను ట్రాక్టర్తో ఢీకొట్టి గాయపరిచి పరారయ్యాడు. గాలింపు అనంతరం అరెస్ట్ చేసి హుజూరాబాద్ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు.
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం భూమిరెడ్డిపల్లి పంచాయతీలోని జన్నావాలామిట్ట, వెంకటాపురం గ్రామాలలో వీధి దీపాలు పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో చీకటిలో ప్రయాణించాల్సి వస్తోంది. మెయిన్ రోడ్డు నుంచి గ్రామం వరకు చీకటిగా ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
KMM: చింతకాని మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. చిన్న మండవ మున్నేరు వాగు నుంచి ఇసుకను తరలిస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
VZM: సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనలో భాగంగా శనివారం రావివలసలో ప్రజా వేదిక మీద మెరకముడిదాం మండలం గోపన్నవలస ఉన్నత పాఠశాల తెలుగు టీచర్ మరడాన సత్యారావును అభినందించారు. ఈయన స్దానిక సింగారపు సంతోషి కుటుంబాన్ని P-4లో భాగంగా బంగారపు కుటుంబంగా దత్తత తీసుకున్నారు. గత ఏడాది టెన్త్ విద్యార్థులకు విమానం ప్రయాణం, తదితర సేవా కార్యక్రమాలకు ఆయనను సీఎం అభినందించారు.
కృష్ణా: పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే దిశగా కలెక్టర్ బాలాజీ శనివారం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి శనివారం సైకిల్పై తన నివాసం నుంచి కలెక్టరేట్కు వచ్చి విధులకు హాజరవుతున్నారు. వాహనాల వినియోగం తగ్గించడం ద్వారా వాయు కాలుష్యాన్ని నియంత్రించవచ్చని కలెక్టర్ తెలిపారు.
MLG: మల్లూరులోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఈనెల 3న చంద్రగ్రహణం సందర్భంగా మూసివేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు ఇవాళ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి ఆలయం మూసివేసి, గ్రహణానంతరం మార్చి 4న సంప్రోక్షణ పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. గ్రహణ సమయంలో ఎలాంటి పూజలు ఉండవని, భక్తులు గమనించాలని నిర్వాహకులు కోరారు.
BPT: బొడ్డువానిపాలెం రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఒక భారీ కంటైనర్ లారీ బోల్తా కొట్టింది. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, క్రేన్ సహాయంతో కంటైనర్ను పక్కకు తొలగిస్తున్నారు.
KNR: వీణవంక మండలం ఎలబాక గ్రామానికి చెందిన బావు వేదశ్విని(18) కాలేయ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి కన్నుమూసింది. వేదశ్విని అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
శ్రీకాకుళం: నరసన్నపేట ఎల్వీఆర్ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి సాయికుమార్ తెలిపారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈనెల 5వ తేదీన జరుగుతుందని, 11 పరిశ్రమలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొనడం జరుగుతుందన్నారు. ఉదయం 9:30 గంటల నుంచి జాబ్ మేళా కొనసాగుతుందని, పదో తరగతి నుండి ఇంజనీరింగ్ విద్యార్థులు అర్హులన్నారు.
TPT: హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే సహా భారతీయ రైల్వేలు పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించాయి. మార్చి 1, 2, 3, 5, 9, 12 తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
BHPL: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ కోర్సుల్లో ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా పరిశ్రమల శాఖ GM సిద్ధార్థ తెలిపారు. DEET, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సహకారంతో వైఎస్కే ఇన్ఫోటెక్ ఈ శిక్షణను అందిస్తుంది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగ గ్యారంటీ ఉంటుందని ఆయన వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.