TG: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు మరమ్మతులు చేయాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థలదే అని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది. నిర్మాణ సమయంలోనే జరిగిన లోపాల వల్లే బ్యారేజీ దెబ్బతిందని తెలిపింది. వాటి మరమ్మతులు చేయకపోతే క్రిమినల్ కేసులతో సహా నిర్మాణ సంస్థలను బ్లాక్ లిస్టులో పెడతామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
విశాఖ: ఏయూలో ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహణపై అభ్యంతరాలతో పరిస్థితి వేడెక్కింది. పీస్ కమిటీ చర్చలతో తాత్కాలిక శాంతి నెలకొనగా, రెండు వర్గాలు వీసీకి ఆధారాలు సమర్పించాయి. శతాబ్ది వేళ ఈ పరిణామాలు చర్చనీయాంశమయ్యాయి.
కోనసీమ: యానాంలో మంగళవారం ఎంపీ వి. వైధిలింగం ఆధ్వర్యంలో ‘వాక్ ఫర్ యానాం’ కార్యక్రమం జరగనుంది. ఈ పాదయాత్రలో మాజీ సీఎం నారాయణసామి, సీఎల్పీ నేత వైద్యనాథన్ పాల్గొంటారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధాని దినేశ్ సోమవారం తెలిపారు. మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 10 వరకు సాగే ఈ యాత్ర ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుని, కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తారు
కృష్ణా: పామర్రు మండలం బలిపర్రు సెంటర్లో హెల్మెట్ ధరించడంపై ఎస్సై రాజేంద్రప్రసాద్ నిన్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటించాలని తెలిపారు.
ATP: అనంతపురం జేఎన్టీయూ పరిధిలో నిర్వహించిన పలు బీఫార్మసీ పరీక్షా ఫలితాలను అధికారులు విడుదల చేశారు. తృతీయ ఏడాది మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీతో పాటు రెండో సంవత్సరం ఆర్15, ఆర్19 ఫలితాలు వెల్లడయ్యాయి. వీసీ, రిజిస్ట్రార్ ఆదేశాల మేరకు పరీక్షల విభాగం అధికారులు నాగప్రసాదానాయుడు ఫలితాలు ప్రకటించారు.
అన్నమయ్య: పోలీస్ భవన నిర్మాణాల కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త, రియల్టర్ టి.కృష్ణప్ప నాయుడు రూ.10 లక్షల భారీ విరాళాన్ని అందజేశారు. సోమవారం మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రికి చెక్కును అందజేశారు. జిల్లా కేంద్రంలో జరుగుతున్న పోలీస్ భవన నిర్మాణాలు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు సామాజిక బాధ్యతగా ఈ మొత్తం అందజేసినట్లు ఆయన తెలిపారు.
NDL: బలగం సినిమా దర్శకుడు వేణు సోమవారం మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ కామేశ్వరి దేవి సహిత శ్రీ మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకుని అభిషేకం కుంకుమార్చన పూజలు చేపట్టారు. ఉత్తమ అవార్డు గ్రహీత పెద్ద మురళి బుక్కాపురం గ్రామ జ్యోతి యువజన సంఘం అధ్యక్షుడు నాగ చందు అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాద్ ఆయన వెంట పాల్గొని దర్శనం చేయించారు.
SRPT: ఇమాంపేట శుద్ధి కేంద్రంలో అత్యవసర మరమ్మతుల దృష్ట్యా ఫిబ్రవరి 24 ఉదయం నుండి 27వ తేదీ వరకు సూర్యాపేట, కోదాడ మున్సిపాలిటీలు చిలుకూరు, కోదాడ, అనంతగిరి, మునగాల, నడిగూడెం, పెన్పహాడ్ మండలాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు నీటిని నిల్వ చేసుకుని, పొదుపుగా వాడుకోవాలని మిషన్ భగీరథ EE విజ్ఞప్తి చేశారు.
సత్యసాయి జిల్లా కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పర్యవేక్షణలో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ పారదర్శకంగా ముగిసింది. ఎక్సైజ్ అధికారులు, దరఖాస్తుదారుల సమక్షంలో నిబంధనల ప్రకారం కేటాయింపులు చేపట్టారు. చెన్నేకొత్తపల్లి దుకాణానికి ఒకే దరఖాస్తు రావడంతో గంగాధర్ నాయుడు పేరును ఖరారు చేశారు.
WGL: కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదు స్వీకరించినట్లు వెల్లడించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులపై జిల్లా ఉన్నత అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అధికారుల ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.
KMM: ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య చొరవతో చిమ్మపూడి ప్రభుత్వ పాఠశాలకు చెందిన 200 మంది విద్యార్థులకు ఉచితంగా పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు అందించే చిన్న ప్రోత్సాహం వారి పెద్ద కలలను నిజం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.
KNR: క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు మార్చి 1 నుంచి 7 వరకు ‘సంసద్ ఖేల్ మహోత్సవ్’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. మార్చి 1-3 తేదీల్లో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రాథమిక పోటీలు, 5-7 తేదీల్లో KNR కేంద్రంలో ఫైనల్స్ ఉంటాయన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 25 నుంచి 27 వరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
VKB: జిల్లాలో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా నోడల్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. నిన్న జిల్లాలోని పరీక్షా కేంద్రాలను ఆయన స్వయంగా పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.
KDP: జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు కాలనీలు, గ్రామాల్లో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర హెల్ప్లైన్ నంబర్లను గుర్తు చేశారు. సోషల్ మీడియా, ఆన్లైన్ మోసాల విషయంలో జాగ్రత్తలు పాటించాలని అవగాహన కల్పించారు.
అన్నమయ్య: నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చడమే ‘ఉల్లాస్-అక్షర ఆంధ్ర కార్యక్రమం లక్ష్యమని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. మదనపల్లి కలెక్టరేట్లో గోడ పత్రికలను విడుదల చేసిన ఆయన, 2029 నాటికి వయోజనులందరికీ అక్షరాస్యతతో పాటు డిజిటల్, ఆర్థిక నైపుణ్యాలు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.