ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి ఊహించని షాక్ తగిలింది. గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల నేపథ్యంలో… అన్ని పార్టీల నేతలు ఇప్పటి నుంచే ప్రచారం మొదలుపెట్టారు. ఈ క్రమంలో… ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కేజ్రీవాల్ కి ఊహించని షాక్ ఎదురైంది.
రాష్ట్రంలోని పంచ్మహల్ జిల్లాలోని హలోల్ లో ఆదివారం కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఒకచోట ప్రజలను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడుతున్నారు. ఓవైపు ఆయన మాట్లాడుతుంటే కొంతమంది జనం ‘మోదీ, మోదీ’ అంటూ నినాదాలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. కేజ్రీవాల్ వారిని ఆపేశారు. వారికి ఇష్టమైన నేతలకు జైకొట్టనివ్వాలని సూచించారు.
నినాదాలు చేసేవారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఇక్కడ కొంతమంది మిత్రులు ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. కానీ వారి పిల్లలకు స్కూళ్లు నిర్మించి ఇచ్చేది మాత్రం ఈ కేజ్రీవాలే. మీరు ఎవరికి జైకొట్టినా మీకు ఉచిత విద్యుత్తు ఇచ్చేది ఈ కేజ్రీవాలే’ అని చెప్పారు. మీకు నచ్చిన నేతకు జైకొట్టండి.. మాకు ఎవరిపైనా శత్రుత్వం లేదు. ఏదో ఒకరోజు మీ మనసులను మేం గెల్చుకుంటాం. ఇప్పుడు మోదీ మోదీ అన్నట్లుగానే భవిష్యత్తులో ఒకరోజు కేజ్రీవాల్, కేజ్రీవాల్ అనిపించుకుంటామని ఆప్ చీఫ్ పేర్కొన్నారు.