27 సంవత్సరాల తర్వాత 71వ ప్రపంచ సుందరి పోటీలకు భారత్ (India) ఆతిథ్యమిస్తోంది. ఫ్యాషన్ ప్రియులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మిస్ వరల్డ్ (Miss World 2023) పోటీలు నవంబర్ లో జరగనున్నాయని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ సీఈవో జూలియా మోర్లీ (Julia Morley) తెలిపారు. ఎన్నో ప్రత్యేకతలు, విభిన్న సంస్కృతులకు నిలయంగా ఉన్న భారత్లో ఈ పోటీలు నిర్వహించేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’ అని జూలియా వెల్లడించారు. దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ ప్రపంచ సుందరి పోటీల్లో 130కిపైగా దేశాల నుంచి అభ్యర్థులు పాల్గొంటారు. భారత్లో చివరిగా 1996లో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు మన దేశంలో ప్రపంచ సుందరి పోటీలు జరగనుండటం విశేషం. కాగా, భారత్ ఇప్పటి వరకూ ఆరుసార్లు మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. 1966 ఏడాదిలో రీటా ఫరియా (Rita Faria) మొదటి సారి భారత్ నుంచి మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకుంది. ఆ తర్వాత ఐశ్వర్యా రాయ్ (Aishwarya Rai) బచ్చన్ (1994), డయానా హైడెన్ (1997), యుక్తాముఖి (1999), ప్రియాంక చోప్రా(2000), మానుషి చిల్లర్ (2017) విశ్వ సుందరి కిరీటాలను దక్కించుకున్నారు.ఈ పోటీలు భారత్ లో జరుగనున్న క్రమంలో 130 దేశాల జాతీయ ఛాంపియన్లు భారతదేశంలో నెల రోజులు విడిది చేయనున్నారు. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ (Miss Universe) పోటీలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. తమ అందంతో పాటు ప్రతిభను చాటేందుకు ప్రపంచ వ్యాప్తంగా సుందరీమణులు ఎదురు చూస్తుంటారు ఈ పోటీల కోసం. ఈ పోటీలు జరిగే దేశం, వేదికపై ప్రపంచ వ్యాప్తంతో ఎంతోమంది దృష్టి పెడుతుంటారు.