• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మంత్రి నేటి పర్యటన వివరాలు

NRPT: రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యకార, క్రీడలు, యువజన సేవల శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి ఇవాళ పట్టణంలో పర్యటించనున్నారని మున్సిపల్ కమిషనర్ మురళి ఒక ప్రకటనలో తెలియజేశారు. మక్తల్ మండలంలో వివిధ అభివృద్ధి పనులకు ఉదయం 11 గంటలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. పార్టీ నేతలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

February 21, 2026 / 08:01 AM IST

14 మంది ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు పదోన్నతి

నల్గొండ ఐదవ జోన్ పరిధిలో ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు పదోన్నతులు కల్పించారు. నల్గొండ, జనగాం, సూర్యాపేట జిల్లాలో ఎక్సైజ్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న 14 మందికి ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం రాత్రి పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు. పదోన్నతి పొందిన సిబ్బంది అంకితభావంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన సూచించారు.

February 21, 2026 / 07:54 AM IST

అంతర్జాతీయ సెమినార్‌కు ఎంపిక

NLG: అంతర్జాతీయ సదస్సుకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ డాక్టర్ అలీ బేగ్ ఎంపికయ్యారు. టర్కీలో జూన్ 24 నుంచి నిర్వహించే ఈ సదస్సులో పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ అల్తాఫ్ హుస్సేన్, రిజిస్టర్ ఆల్వాల్ రవి, అధ్యాపకులు అలీ బేగ్‌ను అభినందించారు.

February 21, 2026 / 07:52 AM IST

విద్యాశాఖలో ప్రక్షాళన.. ప్రైవేట్ స్కూల్ సెక్షన్ల మార్పుజజ1

NZB: జిల్లా విద్యాశాఖలో ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బందిపై వేటు పడనుంది. ప్రైవేట్ పాఠశాలల విభాగాల్లో ఏడాది కంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న వారిని తక్షణమే మార్చాలని విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. జిల్లాలో 9 మంది సిబ్బంది ప్రైవేట్ స్కూల్ పనులు చూస్తుండగా, ఐదుగురు మూడేళ్లుగా అక్కడే ఉండటంతో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి.

February 21, 2026 / 07:51 AM IST

పాత కలెక్టరేట్ స్థలంపై ‘వివాదం’..!

NLG: జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ స్థలం చుట్టూ రాజకీయ, న్యాయ వివాదం ముదిరింది. 2005లో అప్పటి CM YSR జీవో నెంబర్ 324 ప్రకారం ఈ స్థలాన్ని స్వర్ణకారుల సంక్షేమానికి కేటాయించారు. గతంలో స్వర్ణకారుల కోసం కేటాయించిన ఈ స్థలాన్ని ఇప్పుడు చిరువ్యాపారుల మార్కెట్ కోసం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించడం ‘హాట్ టాపిక్’గా మారింది.

February 21, 2026 / 07:50 AM IST

ఉపాధి హామీ పనులపై తనిఖీ

SRPT: నిరుపేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించాలని మునగాల మండల ప్రత్యేక అధికారి శిరీష అన్నారు. మునగాల ఎంపీడీవో కార్యాలయంలో నిన్న జరిగిన 16వ సామాజిక తనిఖీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తనిఖీల్లో గుర్తించిన లోపాలపై రూ.85,951 రికవరీ, పెనాల్టీ మొత్తాన్ని ఉపాధి హామీ ఖాతాలో జమ చేయాలని అధికారులను ఆదేశించారు.

February 21, 2026 / 07:50 AM IST

తైక్వాండోలో సంతోశ్‌కు సిల్వర్ మెడల్

SRD: హైదరాబాద్ గచ్చిబౌలిలో ఫిబ్రవరి 16 నుంచి 21 వరకు జరిగిన 4వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్-2026లో, సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయం ఐటీ కోర్ టీంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న గంగేరి సంతోశ్ కుమార్ తైక్వాండో 74-80 విభాగంలో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించి సిల్వర్ మెడల్ సాధించారు.

February 21, 2026 / 07:49 AM IST

మహిళా సంఘ భవనానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

KNR: తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో నూతన మహిళా స్వయం సహాయక సంఘం భవనానికి మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాలను బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, మహిళా సాధికారత సమాజాభివృద్ధికి ఈ సంఘాలు చాలా ముఖ్యమైనవని తెలిపారు.

February 21, 2026 / 07:47 AM IST

ఉమ్మడి జిల్లాల్లో ‘షట్టర్ గ్యాంగ్’ హల్చల్..!

NZB: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రధానంగా కామారెడ్డి పట్టణంలో నెల రోజుల్లోనే 5 భారీ చోరీలు జరగడంతో ప్రజలు వణుకుతున్నారు. తాళం వేసిన ఇళ్లు, షట్టర్లే లక్ష్యంగా నలుగురు సభ్యుల ముఠా మారణాయుధాలతో తిరుగుతూ నగదు, బంగారం దోచుకెళ్తాంది. జనవరి 10న ఏకకాలంలో 5 దుకాణాల్లో చోరీకి పాల్పడటం సంచలనం రేపింది.

February 21, 2026 / 07:45 AM IST

మానవతా దృక్పథంతో ఆలోచించాలి: ఎమ్మెల్యే

BDK: కూంబింగ్ పేరుతో బలగాలు ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, అదే సమయంలో అటవీ సంపద నాశనమవుతోందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. కర్రెగుట్ట పరిసర ప్రాంతాల్లో కేంద్ర బలగాలు నిర్వహిస్తున్న కూంబింగ్‌ను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మానవతా దృక్పథంతో ఆలోచించాలని తెలిపారు.

February 21, 2026 / 07:36 AM IST

ఏకలవ్య పాఠశాల దరఖాస్తు గడువు పొడిగింపు..!

MBNR: బాలానగర్ మండలం పెద్దాయపల్లి పరిధిలోని ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రవేశాల దరఖాస్తు గడువును ఈనెల 25 వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ సుభాష్ శుక్ల తెలిపారు. శుక్రవారంతో గడువు ముగియడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని 5వ తరగతి చదువుతున్న ST విద్యార్థిని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

February 21, 2026 / 07:33 AM IST

పరీక్షలు రాయనున్న 504 మంది విద్యార్థులు

NZB: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ 5వ తరగతి ప్రవేశ పరీక్ష రేపు ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ చంద్రిక తెలిపారు. ఆర్మూర్ కేంద్రంలో 504 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులు హాల్ టికెట్, పెన్ను, గుర్తింపు కార్డుతో ఉదయం 9:30 గంటలకే కేంద్రానికి చేరుకోవాలని ఆమె సూచించారు.

February 21, 2026 / 07:32 AM IST

ప్రణాళికతో చదివితేనే ఉన్నత శిఖరాలు: కలెక్టర్

WNP: విద్యార్థులు తమ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలంటే ప్రణాళికాబద్ధమైన చదువు అవసరమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం పెద్దమందడి మండలంలో గురుకుల విద్యార్థులకు ఆయన మోటివేషన్ తరగతులు నిర్వహించారు. చదువును భారం కాకుండా ఇష్టపడి చదవాలని, లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు.

February 21, 2026 / 07:31 AM IST

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు ఇవే..!

BDK: గార్ల మండలంలో ఇల్లందు నియోజకవర్గ కోరం కనకయ్య పర్యటిస్తారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధనియాకుల రామారావు శుక్రవారం ప్రకటించారు. ముందుగా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎమ్మెల్యే పంపిణీ చేస్తారని అన్నారు. అలాగే ITDA నుంచి గిరిజనులకు మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్ల ప్రాసెసింగ్‌ను ప్రవేశ పెట్టనున్నట్లు వెల్లడించారు.

February 21, 2026 / 07:30 AM IST

హుస్సేన్‌ సాగర్‌లో గుర్తుతెలియని మృతదేహం

HYD: హుస్సేన్ సాగర్‌లో ఈరోజు ఉదయం తేలియాడుతున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని లేక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా మృతదేహం తేలియాడుతుందన్న సమాచారం మేరకు పోలీసులు వెళ్లి వెలికితీశారు. మృతుడి దగ్గర ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదని, మృతదేహాన్ని గుర్తింపు నిమిత్తం గాంధీ మార్చురీలో భద్రపరిచామని పోలీసులు తెలిపారు.

February 21, 2026 / 07:29 AM IST