MHBD: తొర్రూరు పట్టణంలోని విజయ లక్ష్మి హాస్పిటల్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. రవి రాథోడ్ నేడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చేపట్టిన ఈ తనిఖీ సమయంలో ఆసుపత్రి మూసివేసి ఉండటం గమనార్హం. దీంతో సంబంధిత సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఘటనపై నివేదిక సిద్ధం చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
HNK: శాయంపేట కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తహాసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయ పరిసర ప్రాంతాలు, స్టోర్ రూమ్లను పరిశీలించి పలు సూచనలను చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని, విద్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. GPO వంగేటి సత్యం ఉన్నారు.
BDK: భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న ఈ శిబిరంలో అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సుమారు 200 మంది సందర్శించగా, 100 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు.
ADB: రాష్ట్ర బడ్జెట్లో ఆర్టీసీకి నిధులు కేటాయించాలని SWF రీజనల్ అధ్యక్షుడు ఎస్. భీమ్ రావు అన్నారు. బుధవారం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజలు కార్మికులతో కలిసి సంతకాల సేకరణ చేపట్టారు. వేతన సవరణ అలవెన్స్, ఆర్టీసీలో యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలన్నారు. విద్యుత్తు బస్సులను ఆర్టీసీకి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
SRCL: చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గురువారం ముందస్తు ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా ఉగాది పచ్చడిని వేపపువ్వు, బెల్లం, మామిడికాయ, చింతపండు, కారం, ఉప్పు మిశ్రమంతో పచ్చడి పాటు బూరెలు తయారుచేసి చిన్నారులకు పంపిణీ చేశారు.
PDPL: పెద్దపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఏర్పాటుచేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇవాళ సందర్శించారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశించారు.
SDPT: చారిత్రక నేపథ్యం ఉన్న బైరాన్ పల్లి గ్రామం పేరును ‘వీర బైరాన్ పల్లి’గా మార్చాలని కోరుతూ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు. ఈ అంశంపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అలుపెరగని పోరాటం చేసిన ఈ గ్రామానికి పర్యాటక కేంద్రంగా మార్చాలన్నారు.
NGKL: కల్వకుర్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో బుధవారం మధ్యాహ్నం అమావాస్య సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల ఆకలి తీర్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.
MBNR: పాలమూరు యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీలో బుధవారం ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీసీ ప్రో జీఎన్ శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ.. ఉగాది పండుగ తెలుగు సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. పరాభవ నామ కొత్త సంవత్సరంలో విద్యార్థులు చదువులో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రో. పీ. రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
GDWL: ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని అందులో భాగంగా పశువులకు ఉచితంగా గాలికుంటు టీకాలు వేస్తున్నట్లు గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ ప్రాంగణంలో గాలికుంటు టీకాల ప్రచార వాహనాన్ని పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. జిల్లాలో సుమారు 1.08 లక్షల పాడి పశువులు ఉన్నాయన్నారు.
JGL: రాయికల్, సారంగాపూర్ మండలాల్లో బస్సు సౌకర్యం కల్పించి సమయాల్లో మార్పులు చేయాలని సర్పంచులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల RTC DMను కలిసి వినతిపత్రం అందజేశారు. వడ్డెర కాలనీ, ధావన్పల్లి, వస్తాపూర్, ఇటిక్యాల ,మూటపల్లి, కిష్టంపేట, తాట్లవాయి, బోర్నపల్లి, బట్టపల్లి, పోతారం గ్రామాల్లో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
MNCL: జిల్లాలో పదవ తరగతి వార్షిక పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి. బుధవారం జరిగిన సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 9,685 మందికి గాను 9662 మంది, గతంలో ఫెయిలైన ముగ్గురు విద్యార్థులకు ఒక్కరూ హాజరయ్యారు. మొత్తం 9688 మంది విద్యార్థులకు 9663 హాజరు కాగా 25 మంది గైర్హాజరయ్యారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు.
KMR: పాల్వంచ మండలం ఫరీద్ పేట్లో యూరియా కొరత సమస్యను పరిష్కరించేందుకు సర్పంచ్ జీడిపల్లి నర్సింహా రెడ్డి ఇటీవల ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సమస్యపై స్పందించిన షబ్బీర్ అలీ చర్యలు తీసుకుని బుధవారం గ్రామానికి 444 బస్తాల యూరియా బస్తాలను పంపిణీ చేయించారు. రైతులు యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకుని వాటిని పొందవచ్చన్నారు.
SDPT: ధూళిమిట్ట మండలం బైరాన్ పల్లిలో ప్రజలకు వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు నూతన గేట్వాల్ నిర్మాణం చేసినట్లు సర్పంచ్ బర్మా రాజమల్లయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ప్రజలకు తాగునీరు సరఫరా చేసే గేట్వాల్ రిపేర్ కావడంతో దానిని తీసి వేయించి కొత్త గేట్వాల్ వేసినట్లు వెల్లడించారు. ప్రజలకు తాగునీరు ఎద్దడి లేకుండా చూడడమే లక్ష్యమని అన్నారు.
NGKL: అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును బీజేపీ అధిష్ఠానం తమిళనాడు ఎన్నికల ఇంఛార్జ్గా నియమించింది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా బాధ్యతలను ఆయనకు అప్పగించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఆయన పనిచేయనున్నారు. తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అధిష్టానానికి బాలరాజు ధన్యవాదాలు తెలిపారు.