KNR: జిల్లాలో HPV వ్యాక్సిన్ కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతంగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సూచించారు. విద్య, ఆరోగ్య, మహిళా సంక్షేమ, డీఆర్డీఏ, ఎస్సీ-ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు పరస్పర సహకారంతో పనిచేస్తే కార్యక్రమం మరింత సమర్థవంతంగా సాగుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ADB: ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో NREGS మెటీరియల్ వ్యయం, వివిధ పెండింగ్ పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి మండలం, విభాగం వారీగా మెటీరియల్ కాంపోనెంట్ నిధులను వినియోగించుకుంటూ పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు.
ADB: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్లో కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని CPM జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ శుక్రవారం అన్నారు. అంగన్వాడీ, ఆశా, గ్రామపంచాయితీ, మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. వారి జీతాల పెంపుదల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు.
KNR: కరీంనగర్లో బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన చేపట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని నేతలు విమర్శించారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అదనపు కలెక్టర్ కె. లక్ష్మీ కిరణ్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
NRML: ప్రభుత్వ వసతి గృహాలకు గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా పకడ్బందీగా కొనసాగాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. వసతి గృహాల్లో విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన సిలిండర్ల నిల్వ ఉండాలని, గ్యాస్ ఏజెన్సీలు సమయానికి సరఫరా చేయాలని సూచించారు. సరఫరాలో లోపాలు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని శుక్రవారం పేర్కొన్నారు.
HYD: విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని టెలి-మానస్ సేవలు అందుబాటులో ఉన్నాయి. HYD పరిధిలో విద్యార్ధులు ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలు ఎదురైతే వెంటనే సహాయం పొందేందుకు 14416, 1800 891 4416 నంబర్లకు కాల్ చేయవచ్చు. ఈ సేవలు పూర్తిగా ఉచితంగా, గోప్యంగా నిపుణుల ద్వారా అందించబడుతున్నాయి. మాట్లాడటం ద్వారా మనసుకు ఊరట లభిస్తుందని నిపుణులు వెల్లడించారు.
KMM: విద్యుత్ క్షేత్రస్థాయి సిబ్బంది ప్రాణరక్షణ కోసం ప్రవేశపెట్టిన ‘ఎల్సీ యాప్’ విప్లవాత్మక మార్పు అని ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి కొనియాడారు. శుక్రవారం ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. లైన్ క్లియర్ (ఎల్సీ) అనుమతులు ఇకపై పూర్తిగా డిజిటల్ పద్ధతిలోనే జారీ అవుతాయన్నారు. దీనివల్ల పొరపాటున తప్పుడు ఫీడర్లను ఎంపిక చేసే అవకాశం ఉండదని ప్రమాదాలకు తావుండదని పేర్కొన్నారు.
WNP: చిన్నంబావి మండల పరిధిలోని కొప్పునూరు గ్రామంలో శుక్రవారం రంజాన్ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున రంజాన్ తోఫాను స్థానిక మసీదు వద్ద సర్పంచ్ వడ్డేమాన్ బిచ్చన్న పంపిణీ చేశారు. మసీదు కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముస్లిం కుటుంబాలకు దుస్తులు, ఇతర కానుకలను అందజేశారు. కలిసికట్టుగా పండగలు జరుపుకోవాలని సర్పంచ్ పేర్కొన్నారు.
NLG: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దాత ఆమంచి రాజలింగం గ్రామపంచాయతీ కార్యాలయంకు గోడ గడియారం బహుకరించారు. స్థానిక సర్పంచ్ జిల్లపల్లి రేణుక రాజుకు ఆయన కార్యాలయం ఆవరణలో శుక్రవారం గడియారాన్ని అందించారు. గ్రామ అభివృద్ధిలో తన సహకారం ఉంటుందన్నారు. దాతకు సర్పంచ్ పంచాయతీ కార్యాలయంకు గడియారం అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
SRD: జిల్లాలో పదవ తరగతి పరీక్షలు పారదర్శకంగా జరిగేలా చూడాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎంఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్స్ అనుమతి లేదని చెప్పారు. పరీక్షా కేంద్రంలో ఏ సంఘటన జరిగిన చీఫ్ సూపరింటెండ్లు, ఎంఈవోలే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు.
GDWL: ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన యాప్ ద్వారా రైతులు ఎరువులు కొనుగోలు చేసే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. శుక్రవారం అయిజ పట్టణంలోని ఆగ్రోస్ రైతుసేవా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈనెల 25లోగా రైతులు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
NZB: ఎర్రజొన్నల విత్తనం ఇచ్చిన వ్యాపారులే రూ.4వేల క్వింటాల చొప్పున కొనుగోలు చేయాలని ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కమిటీ ప్రతినిధులలు ప్రభాకర్, మంథని గంగారాం, జక్కలింగారెడ్డి, దేవారంలు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. పసుపు ధరను కృత్రిమంగా తగ్గించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కమిటీ నాయకులు డిమాండ్ చేశారు.
SDPT: వర్గల్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. సాయిబాబా ఆలయం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు పడటంతో స్వల్ప వర్షానికే చెరువును తలపిస్తోంది. నిత్యం వేలాది మంది ప్రయాణించే ఈ మార్గంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరారు.
NRPT: కృష్ణ మండలం ఖాన్రెదొడ్డిలో శుక్రవారం జరిగిన నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ వేడుకల్లో మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి లలిత పాల్గొన్నారు. గ్రామానికి చెందిన జి.ఆంజనేయులు, ఏ.తాయప్ప, వై.శ్రీనివాస్ల ఇళ్లను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల నెరవేరుతోందని పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం నగరంలోని బాలల సదనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సదనంలోని వసతులు, పరిశుభ్రత, పిల్లలకు అందుతున్న ఆహార నాణ్యతను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం శిశు సంరక్షణ కేంద్రంలోని చిన్నారుల ఆరోగ్యంపై ఆరా తీస్తూ, వారిపై నిరంతర వైద్య పర్యవేక్షణ ఉండాలని సిబ్బందిని ఆదేశించారు.