NLG: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పరుగులు పెడుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన ప్రగతి నివేదిక’ 99 రోజుల లక్ష్యంలో భాగంగా, జూన్ 12 నాటికి 6,409 గృహాలను పూర్తి చేయాలని అధికారులు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో అత్యధిక ఇళ్లను నిర్మించిన జిల్లాల్లో రెండో స్థానాన్ని దక్కించుకుని NLG రికార్డు సృష్టించింది.
NZB: జక్రాన్పల్లి మండలంలోని మునిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ప్రతి ఏటా ఉగాది పర్వదినం సందర్భంగా ఇక్కడ జాతర వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది ఉత్సవాల కోసం గ్రామస్తులు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గురువారం జరగనున్న ఈ వేడుకకు భారీగా భక్తులు తరలిరానున్నారు. గ్రామమంతా భక్తి భావంతో పులకించిపోతోంది.
MBNR: TGRJC CET-2026కు దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్, బీచుపల్లి గురుకుల ప్రిన్సిపల్ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. ఏప్రిల్ 15 చివరి తేదీ అని, మే 3న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ల ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు 7842991708, 18002452428 నంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.
MHBD: జిల్లాలో కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (DAO) B. సరిత తెలిపారు. ఈనెల 25వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని DAO సూచించారు. జిల్లాలో కొత్తగా పుస్తకాలు వచ్చిన 2,387 మంది రైతులు తమ సంబంధిత AEOలకు దరఖాస్తులు సమర్పించాలని DAO పేర్కొన్నారు.
MHBD: జిల్లా కంబాలపల్లి ఫారెస్ట్ కార్యాలయం సమీపంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నేరడ మంచ తండాకు చెందిన తావుర్యకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన వాహనాదారులు అంబులెన్స్లో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLG: కొత్త పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని శాలిగౌరారం ఏవో ఎన్.సౌమ్య శృతి కోరారు. శాలిగౌరారం మండలంలోని రైతు వేదికల వద్ద ఏఈవోలు అందుబాటులో ఉంటారని, ఫిబ్రవరి 2026 వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
NRPT: రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది మన వారసత్వపు పండుగగా నిలుస్తుందని, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు జాతిని సజీవంగా ఉంచుతాయన్నారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల అభివృద్ధి వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడిందని పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం కొత్తపల్లిలో కూర్మ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప కామరాతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 6వ రోజు నాగవెల్లి బోనాలు సమర్పించారు. బీరప్ప కామరాతి, మహంకాళి వేషధారణలతో ఒగ్గు కళాకారులు ఆటపాటలతో భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
MHBD: తెలంగాణ నుంచి ఇటీవల వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వేం నరేందర్కి ప్రియాంక శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి సిద్ధంగా తీసుకెళ్లాలని ఆమె సూచించారు.
MNCL: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్ర క్షన్ (NAC)ఆధ్వర్యంలో నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు NAC అసిస్టెంట్ డైరెక్టర్ స్వప్నరాణి ఓ ప్రకటనలో తెలిపారు. ఉచిత శిక్షణ కాలంలో భోజనంతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. 18 నుంచి 35 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. మెకానికల్, ఎలక్రికల్, ప్లంబింగ్ శిక్షణ ఉంటుందన్నారు.
NLG: ప్రముఖ పుణ్య క్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. స్టాక్ నిలిచిపోవడంతో భక్తులకు అందించే ప్రసాదాల తయారీతో పాటు, నిత్యాన్నదాన కార్యక్రమం నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. నిన్నటి పరిస్థితిని గమనిస్తే, దేవస్థానంలో ఉన్న సిలిండర్లు కేవలం ఒక్క రోజుకు మాత్రమే సరిపోనున్నాయి.
ADB: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ దీక్షాపరుల మహా సంకల్ప పాదయాత్ర గురువారం ప్రారంభం కానుంది. శంకర్ లొద్దిలో కొత్తపల్లి పీఠాధిపతి ప్రేమ్ సింగ్ మహారాజ్, మహారాష్ట్ర మంత్రి సంజయ్ రాథోడ్లు ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభిస్తారు. ఏటా మూడు నుంచి ఐదు వేల మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారన్నారు.
KNR: తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామంలో బుధవారం మాల సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉపవాస దీక్షలతో నెత్తిన బోనం ఎత్తుకుని శివసత్తుల పూనకాలతో, డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా పోచమ్మ ఆలయం చేరుకున్నారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సర్పంచ్ అసోద శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.
MDK: రామాయంపేట మండలం ఆర్. వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ వెంకు గారి ఉమా సంజీవరెడ్డి తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు. గ్రామంలోని ప్రయాణ ప్రాంగణం (బస్టాండ్) గత కొంతకాలంగా శిథిలావస్థకు చేరి, పైకప్పు కృంగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. ఈ విషయాన్ని గమనించిన సర్పంచ్ వెంటనే స్పందించి, ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా తన సొంత ఖర్చులతో బస్టాండ్ మరమ్మతులు చేశారు.
JGL: గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఏడాది బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ గల్ఫ్ అడ్వైజరీ కమిటీ సభ్యులు మంద భీం రెడ్డి (జగిత్యాల) ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వినతి పత్రం సమర్పించారు. గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.