మార్చి 9న జరిగిన 12వ తరగతి మ్యాథమెటిక్స్ పరీక్షా పత్రంలో వింత క్యూఆర్ కోడ్ వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై CBSE అధికారులు తక్షణమే స్పందిస్తూ బహిరంగ క్షమాపణలు కోరారు. ఇది కేవలం ప్రింటింగ్ ఎర్రర్ మాత్రమేనని, ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదని బోర్డు స్పష్టం చేసింది. అయితే, ఈ తప్పు వల్ల లీకేజీ జరిగినట్లు కాదని, ఇలాంటి పొరపాట్లు పునరావృతం కావని పేర్కొన్నారు.
NZB: అన్ని వర్గాల ప్రజలు ఐక్యమత్యంతో ముందుకు సాగాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆకాంక్షించారు. మంగళవారం సాయంత్రం బోధన్ పరిధిలోని ఆచన్పల్లిలో ముఫీ అతిక్ అహ్మద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. రంజాన్ పవిత్రతను కొనియాడుతూ, ఇది ఆత్మపరిశీలన చేసుకునే సమయమని పేర్కొన్నారు.
KDP: ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తూ కడప RDO కార్యాలయం వద్ద AITUC ఆధ్వర్యంలో నిరసన జరిగింది. అమెరికా,ఇజ్రాయిల్ దాడుల వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లుతుందన్నారు. దౌత్య మార్గాల ద్వారా శాంతి నెలకొల్పాలని డిమాండ్ చేశారు.
TPT: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి నివాసంలో గూడూరు జడ్పీటీసీ ఊటుకూరు యామిని మహేందర్ రెడ్డి, జగనన్న సేవా సమితి అధ్యక్షులు మహేందర్ రెడ్డిలు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా పార్టీ స్థితిగతులపై జగన్ వారితో చర్చించినట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ బలోపేతమై విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
GDWL: అయిజ మండలం చిన్నతాండ్రపాడు యువకుడు భరత్ కుమార్ పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. సోమవారం రాత్రి అందరూ నిద్రిస్తుండగా భరత్ కుమార్ పురుగుమందు తాగాడు. ఆ విషయాన్ని గుర్తించిన వెంటనే అతడిని కర్నూలు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందాడని పేర్కొన్నారు.
BDK: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణపై నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులకు ఈనెల 12న నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమం కోసం కొత్తగూడెం క్లబ్లో జరగనుంది. ఈ ఏర్పాట్లను కలెక్టర్ అంకిత్ మంగళవారం పరిశీలించారు. శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులకు అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.
TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సృష్టి సరోగసీ కేసులో ED దూకుడు పెంచింది. డా. నమ్రత కుటుంబానికి చెందిన రూ.29.76 కోట్ల విలువైన స్థిరాస్తులను జప్తు చేసింది. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.50 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. 2014 నుంచి అక్రమ సరోగసీకి పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
TPT: వడమాలపేట మండలంలో 20 కేజీల గంజాయి పట్టుకొని, నలుగురిని అరెస్టు చేసినట్లు పుత్తూరు DSP రవికుమార్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఫ్లయింగ్ స్క్వాడ్, ఇతర సిబ్బంది వడమాలపేట మండలంలోని టీటీడీ స్థలాల సమీపంలో ఒక మోటార్ సైకిల్, స్కూటీని తనిఖీ చేయగా వారి వద్ద 20 కేజీల గంజాయి పట్టుబడినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లు తెలియజేశారు.
MHBD: నర్సింహులపేట మండలంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్బంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆమె ఆకస్మికంగా తనిఖీచేసారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాల గురించి ఆరా తీశారు. అలాగే పలువురు విద్యార్థుల ప్రతిభను కలెక్టర్ పరీక్షించారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించేలా ప్రతి ఒక్కరు కృషిచేయాలన్నారు.
E.G: నన్నయ యూనివర్సిటీ డీన్ అకడమిక్ అఫైర్స్ ఆధ్వర్యంలో మంగళవారం డిగ్రీ బోర్డు ఆఫ్ స్టడీస్(BOS) సమావేశం నిర్వహించారు. VC ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ హాజరై BOS చైర్మన్లు, సభ్యులకు దిశానిర్దేశం చేశారు. యూనివర్సిటీలో విద్యా ప్రమాణాలు పెంచుతూ అన్ని డిగ్రీ కోర్సుల్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020, రాష్ట్ర ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలన్నారు.
నల్లగొండలోని తులసీనగర్ దేవాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న శేఖర్ ఈవోగా పదోన్నతి పొందాడు. హైదరాబాద్లో మంగళవారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ చేతుల మీదుగా ఆయన పదోన్నతి ఉత్తర్వులు అందుకున్నాడు. ఆ శాఖ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ భాస్కర్ తోపాటు పలువురు అభినందించారు.
SRPT: ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరాను తనిఖీ చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్కు గురై సైదులు అనే యువ రైతు మృతి చెందాడు. మంగళవారం చివ్యెంల మండలం వట్టిఖమ్మం పహాడ్ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లిన సైదులు, కరెంట్ సరఫరాను సరిచేసే క్రమంలో ప్రాణాలు వదలడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
HYD: మహిళా సాధికారతలో భాగంగా ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్లో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవనానికి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ భూమిపూజ చేశారు. నగరంలో మంజూరైన 4 హాస్టళ్లలో భాగంగా దీనిని నిర్మిస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులు, ఉద్యోగినులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.
SRD: నారాయణఖేడ్ మండలంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం షెడ్యూల్ వారీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం గ్రామపంచాయతీలో రోడ్లు శుభ్రత, మురికి కాలువల్లో పూడిక, చెత్తాచెదారం తొలగింపు పనులు ముమ్మరంగా కొనసాగాయి. మండలంలోని లింగాపూర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి పనులను పర్యవేక్షించారు. గ్రామ స్వచ్ఛత కోసం ప్రజలు సహకరించాలని కోరారు.
CTR: కుప్పం మండలం కృష్ణదాసన పల్లెకు చెందిన షణ్ముగం భార్య సునీత(40) బైక్ నుంచి జారిపడి మృతి చెందింది. సోమవారం భార్యాభర్తలు తమిళనాడు రాష్ట్రం వేపనపల్లికి వెళుతుండగా గుడిపల్లి మండలం శ్రీనివాసపురం సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద ప్రమాదవశాత్తు సునీత బైక్ నుంచి జారీ కింద పడింది. ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతిచెందారు.