BHPL: భారత సైన్యంలో అగ్నివీర్ నియామకాల కోసం 2027 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైనట్లు జిల్లా SP సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఈ సందర్భంగా SP మాట్లాడుతూ.. ఆసక్తి కలిగిన యువత వెబ్సైట్లో ఏప్రిల్ 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేశ సేవ చేయాలని ఎస్పీ సూచించారు.
KNR: నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయని కరీంనగర్ అదనపు డీసీపీ (అడ్మిన్) వెంకటరమణ పేర్కొన్నారు. మంగళవారం చల్లూరులో గ్రామస్థుల సహకారంతో ఏర్పాటు చేసిన కెమెరాలను ఏసీపీ మాధవితో కలిసి ఆయన ప్రారంభించారు. పదిమంది చేసే పనిని ఒక కెమెరా చేస్తుందని, శాంతిభద్రతల పరిరక్షణలో ఇవి కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ASR: సహకార సంఘాల బలోపేతానికి, పారదర్శక పాలనకు సహకార చట్టాలపై పూర్తి అవగాహన ఉండాలని జిల్లా సహకార అధికారి రామకృష్ణంరాజు అన్నారు. జిల్లా సహకార శాఖ సిబ్బంది, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈవోలు, గిరిజన కో-ఆపరేటివ్ సహకార సంస్థల సిబ్బందికి మంగళవారం పాడేరులో శిక్షణ నిర్వహించారు. చట్టపరమైన నిబంధనలను పాటిస్తూ రైతులకు, సంఘ సభ్యులకు మెరుగైన సేవలు అందించాలన్నారు.
ADB: తెలంగాణ రాష్ట్ర అర్ధిక వ్యవస్థ అతలాకుతలం అయ్యిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మంగళవారం ఎమ్మెల్యే మాట్లాడారు. రోజూ అప్పు చేస్తే కానీ గడవని ఆర్థిక పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్పై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్ కేవలం మాటలకే పరిమితం అయిందని ఎద్దేవా చేశారు.
BDK: యువత ర్యాష్ డ్రైవింగ్తో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, క్రమశిక్షణతో వాహనాలు నడపాలని మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి సూచించారు. మంగళవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
నెల్లూరు: CM చంద్రబాబు ఏప్రిల్ 1న (బుధవారం) వింజమూరు పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. వింజమూరులోని పలు ప్రాంతాలను కలెక్టర్, ఎస్పీ, జేసీ పరిశీలించి భద్రత ఏర్పాట్లపై ఆరా తీశారు. అధికారులంతా బాధ్యతగా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందులో భాగంగా పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
NLR: కలిగిరి మండలం కుమ్మర కుండూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాపర్ల సుబ్బలక్ష్మి రాణి స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఆమె ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాతో పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. గత 37 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహించారు.
AP: రాజధాని కోసం అమరావతి రైతులు 30 వేల ఎకరాలు ఇచ్చారని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ‘రాజధానికి భూములిచ్చిన రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూశాం. ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేసే బాధ్యత మాదే. వైసీపీ నేతలు వ్యాఖ్యలు, వైఖరి సరికాదు. చట్టసభలు ఆమోదించిన చట్టాలను గౌరవించబోమని ఎలా అంటారు? చట్టం చేశాక దాన్ని అందరూ అనుసరించాల్సిందే’ అని చెప్పారు.
MBNR: మహబూబ్ నగర్ మండలం ధర్మపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న ఎఫ్ఎల్ఎస్ సర్వేను జిల్లా విద్యా శాఖాధికారి ప్రవీణ్ మంగళవారం పరిశీలించారు. విద్యార్థుల ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా సామర్థ్యాల అంచనాకు ఈ సర్వే కీలకమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంవో శ్రీనివాస్, ఉపాధ్యాయులు, డైట్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
WGL: కమిషనరేట్ పరిధిలో అక్రమ ఇసుక రవాణాతో పాటు, గుట్కా విక్రయాలు, రేషన్ బియ్యం,పేకాటను కట్టడి చేసేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ ద్వారా నియంత్రించాలని CP సన్ప్రీత్ సింగ్ తెలిపారు. పోలీస్ అధికారుల నేర సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యంతో కాలనీలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు.
NDL: డోన్ మండలం గోసానిపల్లెలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఏడీ ఆర్. నాగరాజు మాట్లాడుతూ.. 4 నెలలు పైబడిన పశువులకు గాలికుంటు టీకాలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. పాడి రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అనంతరం రైతులకు మందులు పంపిణీ చేశారు.
SKLM: పోలీసు శాఖలో సుదీర్ఘ సేవలు అందించి మంగళవారం ఉద్యోగ విరమణ పొందుతున్న స్పెషల్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్.వి. రమణను జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మహేశ్వర రెడ్డి మంగళవారం సత్కరించారు. ఆయనకు దుశ్శాలువ కప్పి, జ్ఞాపికను అందజేశారు. ఎస్.వి. రమణ దీర్ఘకాలం పాటు నిబద్ధతతో, అంకితభావంతో విధులు నిర్వర్తించి చేసిన సేవలను కొనియాడారు.
PPM: కొమరాడ మండల కేంద్రంలో మంగళవారం ఉదయం పశువులతో వస్తున్న వ్యాన్ టూ వీలర్ను ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రాథమిక చికిత్స అనంతరం 108 ద్వారా పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. తరచూ జరిగే ప్రమాదాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
GDWL: రాజకీయాలకు అతీతంగా కౌన్సిల్ సభ్యులందరూ మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం జరిగిన బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో పట్టణ ప్రగతికి రూ.18 కోట్లు ఖర్చు చేశామని, భవిష్యత్తులో మరిన్ని నిధులు తెస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
SRD: నారాయణఖేడ్ ఆర్టీసీ బస్టాండ్లో డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మహిళా ప్రయాణికులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 290 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని, తద్వారా వారు దాదాపు 10 వేల కోట్ల రూపాయలను ఆదా చేసుకున్నారని వెల్లడించారు.