HYD: మార్చి 8 నుంచి 14 వరకు గచ్చిబౌలి స్టేడియంలో మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ జరగనున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనేందుకు వస్తున్న 8 దేశాల క్రీడాకారిణులకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో హాకీ వరల్డ్ కప్ ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది.
కోనసీమ: యానాంలో శ్రీ భూ సమేత మీసాల వేంకటేశ్వర స్వామి రథోత్సవం సోమవారం అత్యంత వేడుకగా జరగనుంది. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ఆలయం నుంచి న్యూ బస్టాండ్ వరకు స్వామివారి రథయాత్ర సాగనుంది. మీసాలతో దర్శనమిచ్చే స్వామివారిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు
TG: పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా మారుతుండటంతో గల్ఫ్ దేశాల్లోని తెలుగువారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. టెహ్రాన్లో చదువుతున్న పాతబస్తీ విద్యార్థులు, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న కరీంనగర్, నిజామాబాద్ కార్మికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇజ్రాయెల్లోని తెలుగువారు బంకర్లలో తలదాచుకుంటుండగా, వారి భద్రతపై ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
SDPT: బెజ్జంకి మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాల దరఖాస్తుల గడువును మార్చి 10 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ మలోత్ సంగీత తెలిపారు. సంచాలకులు సున్నం శ్రీనివాస్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19, 2026న జరగనుంది. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ₹2000 నగదు బహుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
KMM: మత సామరస్యానికి, సోదరభావానికి ఇఫ్తార్ విందులు వేదికలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం కూసుమంచి మండల కేంద్రంలోని శివాలయం రోడ్డులో కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి మంత్రి విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కార్యకర్తలు ఉన్నారు.
KRNL: పెద్దకడబూరులో ఆదివారం ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధమై సుమారు రూ. 50,000 మేర నష్టం సంభవించింది. గ్రామానికి చెందిన కోటేకల్లు రాజన్న రైతు ZPHS పాఠశాల సమీపంలో తన వృషభాల కోసం నిల్వ ఉంచిన గడ్డికి అకస్మాత్తుగా మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది. ఏఎస్ఐ శివరాములు పోలీసు సిబ్బందితో ఇతర గడ్డివాములకు మంటలు వ్యాపించకుండా మంటలను ఆర్పేశారు.
ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ప్రజా దర్భార్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఏమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. ప్రజా సమస్యలను స్వయంగా ఎమ్మెల్యే తెలుసుకొని అర్జీలను స్వీకరిస్తారు. కావున గిద్దలూరు నియోజకవర్గంలోని ప్రజలు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు.
PLD: అంగన్వాడీలకు న్యాయం చేసింది చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వమేనని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. అంగన్వాడీల 9 ప్రధాన డిమాండ్లను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని గుర్తు చేశారు. రూ. 75 కోట్లతో 58 వేలకు పైగా సిబ్బందికి 5G స్మార్ట్ఫోన్లు అందజేసి, వారిని స్మార్ట్ వర్క్ వైపు మళ్లించామని ఆయన పేర్కొన్నారు.
TPT: చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుపతి జిల్లాలోని అన్ని ఆలయాలు మూసివేయనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు TTDకి చెందిన కపిలతీర్థం, శ్రీనివాసమంగాపురం, తిరుచానూరు, అప్పలాయగుంట, సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయాలను మంగళవారం ఉదయం 9 గంటలకు క్లోజ్ చేస్తారు. రాత్రి 7:30కి తెరిచి శుద్ధి చేస్తారు. శ్రీకాళహస్తి ఆలయం ఒక్కటే తెరిచి ఉంచుతారు.
AKP: భవన నిర్మాణ కార్మికులకు ఈనెల 9వ తేదీ నుంచి కొత్త రేట్లు అమలులోకి రానున్నట్లు పాయకరావుపేట తాపీ మేస్త్రీల సంఘం అధ్యక్షుడు ఎం నారాయణ రావు తెలిపారు. ఆదివారం స్థానిక సంఘం కార్యాలయంలో కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి కరపత్రాలను విడుదల చేశారు. తాపీ మేస్త్రికి రోజుకు రూ.900, మగ కూలికి రూ.750, పడ కూలికి రూ.600 చెల్లించాలన్నారు.
CTR: చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు.
BDK: ప్రతిరోజు లక్షన్నర లడ్లు, భక్తులకు అందించేలా చర్యలు తీసుకావాలని, ఈ సంవత్సరం భక్తులకు తలంబ్రాలు, ప్రసాదాలు కొరత లేకుండా చూడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి స్వామివారి తలంబ్రాలు పంపిణీకి 80 కౌంటర్లు, లడ్డూలు సరఫరాకు 20 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి పొంగులేటి అన్నారు.
BHPL: కాటారం మండలం చింతకాని పరిధిలోని రోటీపొదాల వాగులో ఆదివారం సాయంత్రం పురాతన స్వామి విగ్రహం లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు. విష్ణుమూర్తి అవతారాన్ని పోలిన ఈ విగ్రహాన్ని స్థానికులు గుర్తించి జాగ్రత్తగా బయటకు తీశారు. ఈ విషయం తెలిసిన వెంటనే గ్రామస్థులు పెద్ద సంఖ్యలో వాగు వద్దకు చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
AP: అమరావతిని ఆధునిక న్యాయనగరంగా అభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో కోర్టులు, న్యాయశిక్షణ అకాడమీ, మధ్యవర్తిత్వ కేంద్రాలు, లీగల్ సర్వీసెస్ సంస్థలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ రాక అమరావతికి కీలక అడుగు అని పేర్కొన్నారు. అమరావతిలో న్యాయ, మౌలికవసతుల బలోపేతానికి ఇది మైలురాయని చెప్పారు.
JGL: ఈనెల 3న రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉన్నందున ఆ రోజు ప్రసిద్ద పుణ్యక్షేత్రం కొండగట్టులో నిర్వహించే గిరి ప్రదక్షిణను గ్రహణానికి ముందే పూర్తి చేసుకుందామని గిరి ప్రదక్షిణ ప్రారంభికులు సురేష్ ఆత్మారాం పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం 6 గంటలకు గిరి ప్రదక్షిణ ప్రారంభించి, 07:30 లోపు పూర్తి చేసుకుందామన్నారు. కావున గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తుల సహకరించాలన్నారు.