BDK: పదవి విరమణ పొందిన పాల్వంచ నవభారత్ కర్మాగారం విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై కృషి చేస్తామని DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన కొత్వాల సతీమణి, 46వ డివిజన్ కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి ని నవభారత్ విశ్రాంత కార్మికులు సోమవారం ఘనంగా సన్మానించారు.
MBNR: ఉదండాపూర్ ప్రాజెక్టు ముంపు బాధితులు మరోసారి ఆందోళన బాట పట్టారు. నష్టపరిహారం ఆరు నెలల్లో ఇప్పిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, తొమ్మిది నెలలు గడిచినా స్పందించకపోవడంతో నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల్లో భారీ ధర్నా చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు అనుమతి కోరుతూ సీఐ కమలాకర్కు ఇవాళ వినతి పత్రం అందజేశారు.
AKP: పాయకరావుపేట మండల సర్వసభ్య సమావేశం ఈనెల 7వ తేదీన నిర్వహించనున్నట్లు ఎంపీడీవో విజయలక్ష్మి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక మండల పరిషత్ సర్వసభ్య సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందన్నారు. ఈ మేరకు సర్పంచులు ఎంపీటీసీలకు ఆహ్వానాలు పంపించామన్నారు. అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలన్నారు.
PPM : పార్వతీపురం, కృష్ణపల్లి పంచాయతీలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ ప్రజలు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకు విజ్ఞప్తి చేశారు. సోమవారం కృష్ణపల్లి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యేకు అక్రమ కట్టడాలకు సంబంధించిన వివరాలను ప్రజలు వివరించారు. వెంటనే నోటీసులు ఇప్పించి తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
AKP: గొలుగొండ మండలం సిహెచ్. ఎర్రవరంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నూకరాజు పాల్గొని రైతులకు పాస్ పుస్తకాలు అందజేశారు. సర్వేయర్ సత్యనారాయణ, వీఆర్వో శ్రీనివాస్ భూరికార్డుల వివరాలు రైతులకు వివరించారు. ప్రభుత్వం రైతుల భూహక్కులను పరిరక్షించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు.
KDP: ప్రస్తుత రబీ సీజన్లో వేముల మండలంలో 1,875 మంది రైతులు సుమారు 7,500 ఎకరాల్లో శనగ పంట సాగు చేసినట్లు వేముల ఏవో ఓబులేసు తెలిపారు. ఈ-క్రాప్ నమోదు ప్రక్రియ పూర్తయిందని, ఇంకా నమోదు చేసుకోని రైతులు వెంటనే రైతు సేవా కేంద్రాల్లో ఈ-క్రాప్, ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. రైతులకు ప్రభుత్వం ద్వారా సబ్సిడీలు అందుతాయన్నారు.
HNK: కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ప్రశాంతంగా ముగిసింది. టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు మాజీ కుడా ఛైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ బహుమతులను ప్రధానం చేశారు. విద్యార్థులు కాలంతో పాటు పరిగెత్తుతూ భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని మాజీఛైర్మన్ అన్నారు. ABSF ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నరేష్, తదితరులు పాల్గొన్నారు.
అన్నమయ్య: వాయల్పాడు మండలం చింతపర్తి ప్రభుత్వ డాక్టర్ సాయిశ్రీ, ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కల్పించేందుకు సోమవారం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. మొదటి సంతానం ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగినప్పటికీ, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అత్యాధునిక సదుపాయాలను స్వయంగా చాటిచెప్పాలనే ఉద్దేశ్యంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.
E.G: జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, తదితరులు సోమవారం పి.గన్నవరం నియోజకవర్గ నాయకులతో సమావేశం అయ్యారు. నియోజకవర్గంలో అధిక సంఖ్యలో వేగవంతంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగేలా చూడాలని పార్టీ నాయకులకు సూచించారు. ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ పార్టీని క్షేత్రస్థాయిలో బలంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.
KKD: చంద్రగ్రహణం కారణంగా మంగళవారం సామర్లకోట పంచరామ భీమేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఈవో బల్ల నీలకంఠం సోమవారం తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ఆలయ ద్వారాలు మూసివేస్తామని, బుధవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతిస్తామన్నారు. భక్తులు గమనించాలని కోరారు
NLR: కొండాపురం మండలంలోని ఆదిమూర్తిపురం నుంచి తూర్పు ఎర్రబల్లి వెళ్లే ఆర్అండ్బీ రహదారి గత కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచుకోక గుంతలమయంగా మారిందని బీజేపీ నేతలు, స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. రాళ్లు తేలి ప్రయాణానికి వీలులేకుండా ఉన్న ఈ దారి వల్ల విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారని అన్నారు.
AP: గుంటూరు జిల్లా కలెక్టరేట్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తన ఇంటిని అక్రమంగా ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేస్తూ దాసరి పాపయ్య అనే వృద్ధుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అక్కడే ఉన్న పోలీసులు, స్థానికులు అప్రమత్తమై పాపయ్య చేతిలోని పెట్రోల్ సీసాను లాక్కోవడంతో పెను ప్రమాదం తప్పింది.
BHNG: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చన 62 అర్జీలను స్వీకరించారు. వాటిని పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
AKP: గొలుగొండ మండలం లింగంపేట నూకాలమ్మ అమ్మవారి కొత్త అమావాస్య జాతర సందర్భంగా తలనీలాలు, కొబ్బరి ముక్కలు పోగు చేసుకునే హక్కుకు సంబంధించి సోమవారం బహిరంగ వేలం నిర్వహించారు. దేవాదాయశాఖ పర్యవేక్షణ అధికారి డి ఉమాదేవి, ఈవో సాంబశివరావు సమక్షంలో ఈ బహిరంగ పాట జరిగింది. సిహెచ్. శ్రీను రూ.66వేలకు పాటను ఖరారు చేసుకున్నారు.
SDPT: రసాయనిక రంగుల వల్ల కలిగే హానిని నివారించేందుకు గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రసాయన శాస్త్ర విభాగం, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో విద్యార్థులు వివిధ రకాల పూలతో సహజ సిద్ధమైన రంగులను తయారు చేసి ప్రదర్శించారు. వైస్ ప్రిన్సిపాల్ గణపతిరావు మాట్లాడుతూ.. చర్మవ్యాధులకు కారణమయ్యే రసాయనాలకు దూరంగా ఉండాలన్నారు.