NDL: ఆడపిల్లలు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని శక్తి టీం సభ్యులు పేర్కొన్నారు. నంద్యాల ASP జావలి ఆదేశాల మేరకు మంగళవారం చాపిరేవుల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ‘గుడ్ టచ్-బ్యాడ్ టచ్’పై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. హెడ్ కానిస్టేబుళ్లు రఫీ, తదితరులు పాల్గొని విద్యార్థులకు రక్షణ సూత్రాలను బోధించారు.
VZM: చీపురుపల్లి మండలంలో ప్రస్తుతం జరుగుతున్న భూ సర్వేను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ డి.ధర్మరాజు సూచించారు. భూ సర్వే ద్వారా రైతుల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం గొల్లలపాలెం, నిమ్మలవలస, మెట్టపల్లి, పతికేయవలస, ఆంజనేయ పురం,పెదనాడపల్లి, ఇటకర్లపల్లి గ్రామాలలో సర్వే జరుగుతుందని తెలిపారు.
NTR: పెనుగంచిప్రోలు మండలంలోని పెనుగంచిప్రోలు గ్రామంలో MPDO జి. శ్రీను ప్రభుత్వ ఆసుపత్రి, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత, శుభ్రతను సమీక్షించి మెరుగుపర్చాలని ఆదేశించారు. అంగన్వాడీలో పోషకాహారం, హాజరు, ప్రీ-స్కూల్ కార్యకలాపాలు తనిఖీ చేసి పిల్లల ఆరోగ్యం, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని సూచించారు.
పార్వతీపురం పేరుతో ‘మన్యం జిల్లా యూనిట్’గా ఒక పార్లమెంట్ స్థానం ఇవ్వాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి అన్న మీడియా కథనాల నేపథ్యంలో ఆయన స్పందించారు.
ASR: క్షయ రహిత సమాజం కొరకు అందరూ కృషి చేయాలని డుంబ్రిగుడ మండలం కిల్లోగుడ పీహెచ్సీ డా కుమార్ రత్న పిలుపునిచ్చారు. మంగళవారం ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం పురష్కరించుకుని అరకు సంతబయలులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. క్షయ వ్యాధిని ముందుగా గుర్తిస్తే 100% నయం చేయవచ్చన్నారు.
SKLM: జిల్లాలో గిరిజనులకు అందాల్సిన రాజ్యాంగ ఫలాలు సక్రమంగా అందాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఎస్టీలపై జరిగే దాడుల విషయంలో పోలీస్ శాఖ అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
PPM: సీతానగరం మండలం రామవరం, రెడ్డివానివలస గ్రామాలలో మంగళవారం సంచార వైద్య సేవలను సీతానగరం పీహెచ్సీ సిబ్బంది నిర్వహించారు. సుమారు 68 మందికి షుగర్, బిపి, మోకాళ్ళనొప్పులు, జలుబు, దగ్గు మొదలగు వాటికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం, ఆహార నియమావళి పట్ల అవగాహన కలిగి ఉండాలని ANM మౌనిక అన్నారు.
KRNL: ఆదోని నియోజకవర్గంలో జాయింట్ కలెక్టర్ ఓటర్ మ్యాపింగ్ పురోగతిపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రతి బీఎల్వో 90% లక్ష్యంతో పనిచేయాలని, జిల్లాలో పురోగతి తక్కువగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో తహసీల్దారు శేషఫణి, డిప్యూటీ తహసీల్దార్ బాబు, స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
KDP: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా మంగళవారం జేసీ నిధి మీనా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ మున్సిపల్ కార్యాలయానికి వచ్చి మర్యాదపూర్వకంగా జేసీతో సమావేశమయ్యారు. ప్రొద్దుటూరు పట్టణంలోని ట్రాఫిక్ పరిస్థితులను వివరించారు. ASP వెంట 1టౌన్ సీఐ కొండారెడ్డి, ట్రాఫిక్ సీఐ రాజగోపాల్, ఎస్సైలు ఉన్నారు.
BPT: జిల్లాలో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా 100 రోజుల అవగాహన కార్యక్రమాలను మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడుతూ.. ప్రజలు టీబీ పట్ల అప్రమత్తంగా ఉండాలని, పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభించే ఉచిత చికిత్సను బాధితులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
W.G: భీమవరం పట్టణంలోని 39,38,37,34,33 వార్డులలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంఛార్జి తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ.. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు మార్చి 29న టీడీపీని ప్రకటించినందున ఆవిర్భావ దినోత్సవం వారం రోజులు ముందుగానే నియోజకవర్గంలోని జరుగుతున్నాయని తెలిపారు.
PLD: ‘రైతన్నా మీకోసం-అన్నదాతా సుఖీభవ’ కార్యక్రమంలో భాగంగా చిలకలూరిపేట మండలం వేలూరు, యడ్లపాడు మండలం సందెపూడి గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. వేలూరు గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపన చేశారు.
GNTR: సీఎం నారా చంద్రబాబు నాయుడు రేపటి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. శ్రీ కన్వెన్షన్లో జరుగనున్న కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం ప్రత్యక్షంగా పరిశీలించారు.
ప్రకాశం: అర్హులైన వారికి టిడ్కోగృహాలు మంజూరు చేయాలని కోరుతూ మంగళవారం కనిగిరి ఆర్డీవో కార్యాలయం ప్రాంగణంలో సీపీఐ ఆధ్వర్యంలో పేదలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇంటి స్థలాలు, టిడ్కోగృహాలు, పక్కాగృహాల మంజూరు కోసం పేదలు ఎదురు చూస్తున్నారని సీపీఐ జిల్లా నాయకులు సయ్యద్ యాసిన్ అన్నారు. ప్రభుత్వం చొరవ చూపి అర్హులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.
సత్యసాయి: కదిరి ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో పవిత్ర స్నపన తిరుమంజనం వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి షాకీర్, మాజీ ఎమ్మెల్యేలు మోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, చాంద్ భాషా పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి అతిథిగా హాజరయ్యారు.