KRNL: ఆదోని పరిధిలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుప్పగల్, పెసలబండ, ఆస్పరి, మండిగిరి వంటి స్కీంల పరిధిలో గ్రామాలకు సక్రమంగా నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్కీంల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన కాంట్రాక్టర్లు 20-40% తక్కువ రేటుకు పనులు తీసుకుని, వర్కర్లకు జీతాలు సైతం ఇవ్వడం లేదన్నారు.
KRNL: ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఓ ప్రకటనలో సూచించారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న వేల ప్రజలు అవసరమైతే తప్ప బయటకి రావద్దన్నారు. ఏదైనా పని కోసం బయటికి వస్తే ఉదయం 10 గంటల్లోగా ముగించుకొని వెళ్లాలని, సాయంత్రం 4 గంటల తర్వాత బయటికి రావాలని సూచించారు.
సత్యసాయి: అమడగూరు మండలం మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన 25 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. పుట్టపర్తిలోని టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. పల్లె రఘునాథ్ రెడ్డి నూతనంగా పార్టీలోకి వచ్చిన వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
BPT: బాపట్లలో రోడ్డు భద్రతా నిబంధనలపై రవాణా శాఖ కఠిన చర్యలు చేపట్టింది. డీటీసీ పరంధామయ్య రెడ్డి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రమాదాల నివారణ కోసమే ఈ చర్యలన్నారు. లైసెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలను కూడా అధికారులు పరిశీలించారు.
ప్రకాశం: ఒంగోలు పట్టణంలోని బాలాజీ నగర్లో ఆదివారం డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు స్థానిక ప్రజలకు మత్తు పదార్థాలపై పోలీసులు అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు కార్డెన్ సర్చ్ నిర్వహించినట్లు DSP తెలిపారు.
KKD: పిఠాపురంలో ఆదివారం చికెన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. సాధారణ చికెన్ కిలో రూ.180 ఉండగా, స్కిన్లెస్ రూ.250-280, స్కిన్ చికెన్ రూ.240గా ఉంది. బోన్లెస్ కిలో రూ.300, నాటుకోడి రూ.400-450 వరకు పలుకుతోంది. నాణ్యతను బట్టి ధరల్లో రూ.10-20 వ్యత్యాసం ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. చికెన్ కొనుగోలు చేసేందుకు మాంసం ప్రియులు దుకాణాల వద్ద బారులు తీరారు.
కడప: రాజుపాలెం మండలం వెల్లాలలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సంజీవరాయ స్వామి, చెన్నకేశవ స్వామి, భీమలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈనెల 27 నుంచి నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఆదివారం తెలిపారు. ప్రతిరోజు వివిధ అలంకరణలతో స్వామి వారి ఊరేగింపు చేయనున్నారు. ఇక్కడికి, శ్రీరామచంద్రుడు సీతమ్మతో అరణ్యవాసంలో భాగంగా వచ్చినట్లు ప్రతీతి.
PPM: జియ్యమ్మవలస, కురుపాం మండలాల్లోని గడసింగుపురం, అడ్డకులగూడ గ్రామాల్లో ఆరోగ్య పరిస్థితిపై వైద్య అధికారులు సమగ్ర విచారణ చేపట్టారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. భాస్కరరావు తెలిపారు. ఓ పత్రికలో వచ్చిన వార్తకు ఆయన స్పందించారు. గడసింగుపురం గ్రామంలో గత కొన్నాళ్లుగా ఆరుగురు మరణించినట్లు గుర్తించామన్నారు.
అన్నమయ్య: పీలేరులో మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా పోలీసులు ఆదివారం భారీ కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. శ్రీనాధపురం, రాజీవ్ నగర్ కాలనీల్లో వేకువజామున జరిగిన ఈ తనిఖీల్లో సుమారు 450 ఇళ్లు, 1200 మంది, 214 వాహనాలను పరిశీలించారు. పత్రాలు లేని 64 బైకులు, 5 ఆటోలు, ఒక కారుపై చర్యలు తీసుకున్నారు. 15 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
TPT: నాగలాపురంలోని శ్రీవేదనారాయణ స్వామి ఆలయంలో నిన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఊయల సేవ రమణీయంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అభిషేకాల అనంతరం సుందరంగా అలంకరించి తిరుచ్చి పై వేంచేపు చేశారు. మంగళ వాయిద్యాలు నడుమ ప్రాకారోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామి వారు తన దేవేరులతో ఊయల సేవలో భక్తులకు దర్శనమిచ్చారు.
VSP: అక్షయ తృతీయ సందర్భంగా విశాఖలో బంగారు దుకాణాలు రద్దీగా మారాయి. ఆదివారం 22 క్యారెట్ బంగారం గ్రాము రూ.14,280, 24 క్యారెట్ రూ.15,578గా ఉంది. 8 గ్రాముల ధర రూ.1,24,624. వెండి గ్రాము రూ.280 పలుకుతోంది. శుభదినం కావడంతో కనీసం గ్రాము బంగారం అయినా కొనాలని ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
CTR: పులిచెర్ల(M) పాతపేట సమీపంలో ఆదివారం వేకువజామున ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. పశ్చిమ విభాగం అటవీ ప్రాంతం నుంచి పాతపాలెం అడవి మార్గంలో పాతపేట వద్దకు ఒంటరి ఏనుగు చేరుకుంది. అక్కడ మామిడి చెట్ల కొమ్మలను విరిచేసిన ఏనుగు కొబ్బరి చెట్లను సైతం కూకటివేళ్లతో పెకలించింది. అనంతరం అక్కడి నుంచి అడవుల్లోకి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు.
VZM: బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఉన్న ప్లేవుడ్ పరిశ్రమలో వ్యవసాయం సబ్సిడీ యూరియా వాడుతున్నట్లు ఆరోపణలు రావడంతో వ్యవసాయ శాఖాధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిశ్రమ గోదాములలో ఉన్న యూరియాను పరిశీలించి టెక్నికల్ గ్రేడ్ యూరియా వాడుతున్నట్లు గుర్తించారు. సబ్సిడీ యూరియాను వ్యవసాయేతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏవో మజ్జి శ్యామసుందర్ హెచ్చరించారు.
BPT: ప్యాడిసన్ పేటలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో సచివాలయం వద్ద నిరసన తెలిపారు. కుళాయిల ద్వారా కలుషిత నీరు వస్తోందని నాయకుడు శరత్ మండిపడ్డారు. కలుషిత జలాలతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. వారానికోసారి ట్యాంకర్లతో నీరిస్తే ఎలా అని ప్రశ్నించారు. సమస్యను పరిష్కరించాలని కోరారు.
PLD: జిల్లా పోలీస్ కార్యాలయంలోని పాత వాహన విడిభాగాలను ఈనెల 21న ఉదయం 10:30 గంటలకు వేలం వేయనున్నట్లు ఎస్పీ కృష్ణారావు తెలిపారు. నరసరావుపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఈ వేలం ప్రక్రియ జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు నిర్ణీత సమయంలో హాజరై వేలంలో పాల్గొనవచ్చు. వాడి పక్కన పెట్టిన టైర్లు, ఇతర సామాగ్రిని ఈ వేలం ద్వారా విక్రయిస్తారు.