NLR: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మంగళవారం బుచ్చి, కోవూరు మండలాలలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు బుచ్చిలో అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొంటారు. అనంతరం పంచాయతీ బెల్లకూరు కాలనీ నందు నూతనంగా నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, స్వర్ణాంధ్ర-2047 విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయం పాల్గొంటారని కార్యాలయ ప్రతినిధులు తెలిపారు.
TPT: శ్రీకాళహస్తి టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వర్గీయ శ్రీ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి జయంతి సందర్భంగా ఏప్రిల్ 15న చేపట్టబోయే సేవా కార్యక్రమాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బొజ్జల జయంతి పోస్టర్ను ఆవిష్కరించి, ఆయన ఆశయాల బాటలో ముందుకు నడవాలని సూచించారు.
PPM: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఏ. కృష్ణప్రసాద్ సోమవారం పార్వతీపురం సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీలకు అందుతున్న ఆహారం, వైద్యం, సౌకర్యాలను పరిశీలించి, వారి హక్కులపై అవగాహన కల్పించారు. న్యాయ సహాయం అవసరమైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ, జైలు రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు.
ASR: జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్లు, మధ్యాహ్న భోజన కేంద్రాలు, ప్రభుత్వ వసతి గృహాలకు అంతరాయం లేకుండా డిపోల నుంచి సరుకులను చేరవేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీపూజ అధికారులను ఆదేశించారు. అందులో ఉత్పన్నమయ్యే సమస్యలను అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. సరుకుల సరఫరాకు జియో ట్రాకింగ్ తో కూడిన వాహనాలను, డ్రైవర్లను అందుబాటులో ఉంచాలన్నారు.
సత్యసాయి: కదిరికి చెందిన ఎం. చరణ్ కుమార్ గుండె శస్త్రచికిత్స విజయవంతం కావడంతో సోమవారం ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడికి మంత్రి చొరవతో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి పునర్జన్మ లభించింది. ఈ సందర్భంగా చరణ్ కుమార్ తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనై మంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు.
BPT: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించారు. 59 మంది స్వయంగా తమ సమస్యలు ఎస్పీకు విన్నవించుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని చెప్పుకొచ్చారు. గడువులోగా వినతులను పరిష్కరించాలని ఆదేశించారు.
SKLM: పలాస నియోజకవర్గంలోని గ్రామాల్లో సర్పంచుల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో, పాలనలో ఎటువంటి జాప్యం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు లేని సమయంలో అధికారుల బాధ్యత మరింత పెరుగుతుందని గుర్తు చేశారు. పలాసలో తన కార్యాలయంలో సోమవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
VSP: విశాఖ మెట్రోను భోగాపురం వరకు పొడిగించాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సూచించారు. రుషికొండలో టీసీఎస్, యాక్సెంచర్ వంటి దిగ్గజ సంస్థలు వస్తున్నందున మెట్రో అనుసంధానం ఐటీ ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎండీ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. విశాఖలో మొత్తం 76.90 కి.మీ మేర 4 కారిడార్లను ప్రతిపాదించామని తెలిపారు.
EG: జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ని సోమవారం ఏ. శివప్రియ, డీ.ఎస్.పీ సౌత్ జోన్, నార్త్ జోన్ డీఎస్పీ జీవన జిల్లా పోలీస్ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి రిపోర్ట్ చేశారు. ఎస్పీ డీఎస్పిని అభినందించి, తమకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు.
ATP: గుత్తి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రోడ్డుపై సత్యసాయి తాగునీటి పైప్లైన్ లీకేజీ కావడంతో త్రాగునీరు వృధాగా పోతున్నాయి. దీంతో రోడ్డు మీద నీరు నిలబడడంతో వాహనాదారులు, పాదాచారులు ఇబ్బందులు పడుతున్నారు. అసలే వేసవికాలం త్రాగునీరు వృధాగా పోతుండడంతో పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
AKP: అచ్యుతాపురం కేజీబీవీ ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆదేశించారు. విద్యార్థిని నవ్య మృతి చెందిన నేపథ్యంలో ఇవాళ ఆకస్మికంగా ఎమ్మెల్యే కేజీబీవీని సందర్శించి పరిసరాలను పరిశీలించారు. పాఠశాల సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ప్రకాశం: ఒంగోలు మహిళా పోలీస్ స్టేషన్కు నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పీ. శ్రీధర్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వీ. హర్షవర్ధన్ రాజు (ఐపీఎస్)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ శుభాకాంక్షలు తెలుపుతూ.. మహిళలు, పిల్లల కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బాధితులకు తక్షణ న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
GNTR: కలెక్టరేట్ ఆవరణలో చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి ప్రారంభించారు. పీజీఆర్ఎస్కు విచ్చేసిన దరఖాస్తు దారులకు మజ్జిగ కూడా పంపిణీ చేశారు. వేసవి ఎండలు దృష్ట్యా కలెక్టరేట్ అవరణలోని వివిధ శాఖల కార్యాలయాలకు వచ్చే సందర్శకుల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రం ఏర్పాటు చేసామన్నారు.
VZM: పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించి మంచి పనితీరు కనబరిచిన అధికారులకు ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుందని JC సేధు మాధవన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలకు స్పష్టమైన పరిష్కారం చూపాలని సూచించారు.
NLR: పడుగుపాడు- కొడవలూరు రైల్వే స్టేషన్ మధ్య సుమారు 40-45 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి మరణించింది. మహిళ పచ్చని చీరపై వంగపూత రంగు చుక్కలు, అంచు కలదు. ఎర్రని జాకెట్, నల్లని లంగా ధరించి ఉంది. మేడలో పూసలతో కూడిన పసుపు దారం, కుడి చేతిపై పచ్చ బొట్టు ఉంది. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.