KDP: కలసపాడులో సగిలేరు నది ఒడ్డున ఉన్న ఎస్పీజీ, పరిశుద్ధ పేతురు – పరిశుద్ధ పౌలు పట్టణ చర్చిలో ఈస్టర్ ఆరాధన దేవునికి మహిమకరంగా జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులంతా మహదానందంతో, భక్తిపారవశ్యంతో ఈస్టర్ పండుగను జరుపుకొంటున్నారు. పునరుజ్జీవానికి గుర్తు, మరణంపై యేసుక్రీస్తు సాధించిన విజయానికి ప్రతీక ‘ఈస్టర్’ అని రెవరెండ్ సింగమల ఆశీశ్ గాబ్రియేల్ అన్నారు.
NTR: కలెక్టరేట్లో ఈ నెల 6న సోమవారం “మీకోసం” పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్తో పాటు డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. రెవెన్యూ సమస్యల కోసం రెవెన్యూ క్లినిక్లు కూడా నిర్వహిస్తారు. Meekosam.ap.gov.inలో నమోదు చేసుకోవచ్చన్నారు.
VZM: రాష్ట్ర పురపాలిక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ బొబ్బిలికి వరాల జల్లు కురిపించారు. వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం ఆయన మూడున్నర కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ఆదివారం బొబ్బిలి పర్యటనలో భాగంగా రాణి మల్లమాదేవి పార్కును సందర్శించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
SKLM: ఆమదాలవలస మండలం వంజంగి గ్రామ గెడ్డగట్టు పైన పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను ఆదివారం సాయంత్రం ఎస్సై ఎస్. కాంతారావు తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ.10,020 లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పేకాట ఆడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
ATP: CM చంద్రబాబు నాయుడు సోమవారం యాడికి పర్యటించనున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలు మళ్లిస్తున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. వేములపాడు క్రాస్ నుంచి యాడికి మార్గంలో వాహనాలకు అనుమతి నిలిపివేశారు. గుత్తి నుంచి రాయలచెరువు మీదుగా వెళ్లే సిమెంట్ లారీలు జాతీయ రహదారి-67 ద్వారా తాడిపత్రి వైపు వెళ్లాలని సూచించారు.
KRNL: మున్సిపల్ కాంట్రాక్టర్లు, అధికారులు పరస్పర సహకారంతో సమస్యలను పరిష్కరించుకోవాలని మంత్రి టీజీ భరత్ సూచించారు. ఇవాళ నగరపాలక సమావేశ భవనంలో జరిగిన సమావేశంలో అధికారులతో ఆయన మాట్లాడుతూ.. ప్రతి పది రోజులకు ఒకసారి సమావేశాలు నిర్వహించాలని, బిల్లులను పారదర్శకంగా కాంట్రాక్టర్ల ఆమోదంతోనే మంజూరు చేయాలని ఆదేశించారు
TPT: మార్కెట్ కమిటీల ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేత కిరణ్ డిమాండ్ చేశారు. మామిడికాయల యార్డులో జరిగిన సమావేశంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం, జీతాల పెంపు, పదవీ విరమణ వయస్సు పెంపు వంటి డిమాండ్లు చేశారు. బీమా పెంపు, టైం స్కేల్, ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
PLD: జాతీయ టీ-10 మహిళా క్రికెట్ టోర్నీలో ఏపీ జట్టు గెలుపొందింది. ఇందులో పల్నాడు జిల్లా కారుచోలకు చెందిన హర్షియా సుల్తానా కీలక పాత్ర పోషించింది. ఆదివారం ఆమె ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ను కలిశారు. సుల్తానాతో పాటు ఆమె తల్లిదండ్రులను ఆయన అభినందించారు. భవిష్యత్తులో జాతీయ జట్టుకు ఎంపికవ్వాలని ఆయన ఆకాంక్షించారు.
KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో పుష్పయాగం వైభవంగా జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కార్యక్రమానికి ఈ వివిధ ప్రాంతాల నుంచి 3 టన్నుల 12 రకాల పుష్పాలను, 6 రకాల పత్రాలను తెప్పించారు. వీటితో సీతారామలక్ష్మణులకు పుష్ప నీరాజనం కన్నుల పండువగా సాగింది.
BPT: పట్టణంలో సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక భావనారాయణ స్వామి ఆలయ పాత రథాన్ని గుడి వద్ద నుంచి తూర్పు సత్రం స్థలానికి తరలిస్తున్నారు. అందువల్ల ముందస్తు జాగ్రత్తగా గడియార స్తంభం నుంచి కొత్త బస్టాండ్ వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు కరెంటు నిలిపివేయనున్నారు.
కోనసీమ: కొత్తపేట మండలం మందపల్లిలో శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో ఉన్న ఉమా నాగేశ్వర స్వామి ఆలయంలో గణపతికి ఆదివారం విజయవాడ కు చెందిన పల్లపు రాజు వెంకట సత్యనారాయణ దంపతులు పంచలోహ కవచాన్ని అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పురోహితుడు వెంకన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సత్యసాయి: నందమూరి బాలకృష్ణ సోమవారం హిందూపురం పర్యటనకు రానున్నారు. సాయంత్రం నూతనంగా తీసుకొచ్చిన పోలీసు వాహనాలను సీఐలకు అందజేయనున్నారు. అనంతరం లేపాక్షి మండల టీడీపీ కన్వీనర్ అభిలాష్ వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ పర్యటన నేపథ్యంలో స్థానిక నాయకులు, అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు.
NTR: విజయవాడ ఇంద్రకీలాద్రి పైఅమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత లభించిన సందర్భంగా సంకష్టహర చతుర్థి నాడు ఇంద్రకీలాద్రిలో గణపతి, నవచండీ హోమాలు నిర్వహించారు. ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ(గాంధీ), ఈవో వి.కె. శీనానాయక్ పాల్గొన్నారు. ఉదయం పూర్ణాహుతి నిర్వహించి, రాష్ట్రాభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ చేశారు.
CTR: చౌడేపల్లె మండలం బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ భారీగా నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో యాత్రికులు తరలిరావడంతో బోయకొండ భక్త జనసంద్రమైంది. కొండపై వాహన రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. కాగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
VSP: ఏపీలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం (IAC) ఏర్పాటు సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం విశాఖలో ACIAM సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త, ప్రతి నియోజకవర్గానికి ఒక MSME పార్క్ లక్ష్యమన్నారు. MSMEలకు రుణ భరోసా, ODR ద్వారా వేగవంతమైన వివాద పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.