కృష్ణా: వల్లభనేని వంశీ తనపై సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్లో అసత్య ప్రచారం జరుగుతోందని తెలిపారు. గురువారం ఆయన గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దుష్ప్రచారం చేస్తున్న వారి ఆధారాలను వంశీ పోలీసులకు సమర్పించారు. వీడియో మార్ఫింగ్ చేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
VZM: ప్రజలకు అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను డీసీసీబీ అందిస్తోందని డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున తెలిపారు. ఈ మేరకు విజయనగరం పట్టణానికి చెందిన ఎం. లక్ష్మి నారాయణ, ఛైర్మన్ సమక్షంలో గురువారం విజయనగరం బ్రాంచ్లో FD రూపంలో రూ. 5,10,000లు జమ చేశారు. డీసీసీబీ ప్రజల విశ్వాసాన్ని సంపాదిస్తూ ఆర్థికంగా బలంగా ఎదుగుతోందన్నారు.
W.G: ఉపాధి హామీ పథకం కార్మికులకు ముఖ ఆధారిత మస్తర్ విధానాన్ని రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కండెల్లి సోమరాజు డిమాండ్ చేశారు. ఇవాళ తాడేపల్లిగూడెం మండలం మాధవరంలో ఉపాధి హామీ పని ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ముఖ ఆధారిత మస్తర్ విధానం వల్ల కూలీల కళ్లు సరిగా స్కాన్ కావడం లేదన్నారు. దీంతో నిరాశతో కూలీలు వెనుతిరుగుతున్నారన్నారు.
PPM: సీతానగరం మండలం చినభోగిలి గ్రామంలోని శ్రీ రామాలయాన్ని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గురువారం సందర్శించారు. ముందుగా ఎమ్మెల్యేకు గ్రామ పెద్దలు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికి ఎమ్మెల్యేను సత్కరించారు. అనంతరం ఆయన శ్రీ సీతారాముల వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
VZM: జామి మండలం కుమారం గ్రామంలో గురువారం ACLP డ్వాక్రా సంఘాల శిక్షణ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీఎం అప్పలనాయుడు మాట్లాడుతూ.. మహిళా సంఘాల అభివృద్ధికి ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ సందర్భంగా యాన్యువల్ క్రెడిట్ లైలీవుడ్ ప్లాట్స్, వార్షిక రుణ జీవనోపాదుల ప్రణాళిక వంటి అంశాల మీద చర్చించారు.
ELR: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపి ప్రజలకు అండగా నిలవాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఇవాళ పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
KRNL: రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాలు కొనసాగుతున్నాయని వైసీపీ ధ్వజమెత్తింది. రుద్రవరం టోల్ ప్లాజా వద్ద తనను గుర్తించలేదన్న కోపంతో మహేష్ అనే ఉద్యోగిని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి బెదిరించారు. ఆయన ఆదేశాలతో అనుచరులు సదరు ఉద్యోగిని వాహనంలో బలవంతంగా ఎమ్మెల్యే సొంత గ్రామానికి తరలించారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేసింది.
SKLM: మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర కల్పించకపోవడం పట్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రణస్థలం మండలం నగరపాలెంలో పంటను గురువారం పరిశీలించి, రైతులతో మాట్లాడారు. క్వింటాలు రూ. 2400 నుంచి రూ. 1600కి పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
KDP: విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసులు అధికారులకు సూచించారు. ఇవాళ పులివెందులలోని స్థానిక విద్యుత్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం, సోలార్ ప్రాజెక్టు పనులు, విద్యుత్ సేవల పురోగతి తదితర వాటిపై సమీక్షించారు. పగటిపూట వీధిలైట్లు వెలగకుండా చూడాలన్నారు.
బాపట్ల: జిల్లాలో ఎన్సీడీ సర్వే జాప్యంపై కలెక్టర్ వీ. వినోద్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నూరుశాతం సర్వే పూర్తయ్యేలా చూడాలని అధికారులను గురువారం ఆదేశించారు. ఆభా(ABHA) ఐడీల ద్వారా వైద్యసేవల డిజిటలైజేషన్పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే, ఆయుర్వేద ఆస్పత్రుల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలం లొల్లలాకులు కాలువల మరమ్మతు, ఆధునీకరణ, రావులపాలెం-బొబ్బర్లంక రాష్ట్ర రహదారి విస్తరణ పనులకు ప్రభుత్వం రూ. 74.2 కోట్లు కేటాయించిందని కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 2వ తేదీన పరిపాలన అనుమతి లభించగా.. డిజైన్ ప్రతిపాదనలు చీఫ్ ఇంజనీర్ సెంట్రల్ డిజైన్ విభాగానికి సమర్పించారు. త్వరలో టెండర్లు పిలుస్తామని స్పష్టం చేశారు.
NDL: డోన్ క్లబ్ హౌస్లో మెప్మా ఆర్పీలు, సిబ్బందితో ఇవాళ నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పథకాల అమలులో వేగం పెంచాలని ఆదేశించారు. మహిళా సంఘాలు, స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, బ్యాంకు లింకేజులపై దృష్టి పెట్టాలని సూచించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకాల లబ్ధి చేరేలా అధికారులు కట్టుదిట్టంగా పనిచేయాలని స్పష్టం చేశారు.
W.G: అగ్ని ప్రమాదాల నివారణపై ముఖ్యంగా మహిళలు అవగాహన కలిగి ఉండాలని తణుకు ఫైర్ ఆఫీసర్ ఐ. అజయ్ కుమార్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఇవాళ తణుకు పట్టణ పరిధిలోని పలు అపార్ట్మెంట్ల ఆవరణలో మహిళలకు అవగాహన కల్పించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు జరిగినప్పుడు నివారణకు తీసుకోవలసిన అత్యవసర చర్యలపై వారికి అవగాహన కల్పించారు.
ప్రకాశం: గ్రామీణ సంపద పెంపుదలకు పెయ్యదూడల ఉత్పత్తి పథకం ఎంతో మేలని ప్రకాశం జిల్లా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మురళీకృష్ణ పేర్కొన్నారు. మర్రిపూడిలో డాక్టర్ మని శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన 56వ ప్రదర్శన సభలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం దూడల కోసం ప్రత్యేక టీకాను కేవలం రూ. 150కే అందిస్తోందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
KRNL: వెలగపూడి అసెంబ్లీ భవనంలో ఇవాళ జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. రోడ్లు, భవనాల శాఖ ఆడిట్ అంశాలు, టెండర్ డిస్కౌంట్ మాఫీ వల్ల పెరిగిన వ్యయంపై చర్చించారు. ప్రజాధనాన్ని పారదర్శకంగా వినియోగించాలని ఆయన అధికారులకు సూచించారు.