కోనసీమ: భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని కలెక్టర్ మహేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని కార్మికులందరూ తప్పని సరిగా తమ పేర్లను నమోదు చేసుకుని, ఆర్థిక ప్రయోజనాలను పొందాలన్నారు. వయో పరిమితి 18 నుండి 60 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు పథకానికి అర్హులన్నారు. నమోదు రుసుము క్రింద రూ. 50 చెల్లించాలన్నారు.
ATP: మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు దిశగా అడుగులు పడుతుండటంతో ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం అనంతపురం జిల్లాలో నాలుగు, శ్రీ సత్యసాయి జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు మహిళలకు రిజర్వ్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 33 శాతం కోటా ప్రకారం ఈ మార్పులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
E.G: డీ లిమిటేషన్కు మద్దతు ఇచ్చిన వారు ఆంధ్ర ద్రోహులు అని ఏపీ ప్రత్యక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు విమర్శించారు. శుక్రవారం రాజమండ్రిలో మీడియాతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన వచ్చే ఎన్నికల కోసం బీజేపీ పెద్ద కుట్ర వేసిందన్నారు. ఈ బిల్ పాస్ అయితే దేశంలో విభజన రావచ్చని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
KDP: కమలాపురంలోని పెద్ద చెప్పలిలో వెలసిన ఎల్లమ్మ జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం అర్ధరాత్రి దాటాక అమ్మవారు పులి వాహనంపై గ్రామ వీధుల్లో విహరించారు. అంతకు ముందు అమ్మవారిని ఆలయ అర్చకులు అత్యంత శోభాయమానంగా అలంకరించి, పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకోగా ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.
NDL: కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన 100 రోజుల ‘జలధార’ కార్యక్రమ వర్క్షాప్లో ఇవాళ కలెక్టర్ రాజకుమారి అధికారులకు అవగాహన కల్పించారు. భూగర్భ జలాల పెంపు, నీటి వనరుల సమర్థ వినియోగం, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యల నివారణ లక్ష్యాలుగా పని చేయాలని సూచించారు. కార్యక్రమ అమలు విధానం, ప్రణాళికలు, సాంకేతిక వినియోగంపై వివరించి దిశానిర్దేశం చేశారు.
AKP: గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు పోషకాహారాన్ని ఇవ్వాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ అన్నపూర్ణ, అంగన్వాడీ కార్యకర్త నాగమణి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మునగపాక మండలం పాటిపల్లిలో పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. జింక్ ఫుడ్స్కు దూరంగా ఉండాలని అన్నారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. సకాలంలో వ్యాధికి నిరోధక టీకాలు ఇవ్వాలన్నారు.
KRNL: వేసవిలో నియోజకవర్గ పరిధిలో గడ్డి వాములు అగ్ని ప్రమాదానికి గురవుతుండటం వల్ల పశువులకు మేత కరవవుతోందని ఎమ్మెల్యే శ్యాంబాబు అన్నారు. పత్తికొండ అగ్నిమాపక కేంద్రంలో శుక్రవారం నూతన వాహనాన్ని ఆయన ప్రారంభించారు. అగ్నిమాపక అధికారులు సరైన సమయంలో స్పందించి, మంటలను ఆర్పి వేస్తున్నారంటూ వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రీజినల్ జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
BPT: తెనాలి నుంచి పూడివాడ మీదుగా నిజాంపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సు ట్రిప్పులను అదనంగా మరో రెండు పెంచాలని కోరుతూ రేపల్లె టీడీపీ కార్యాలయంలో గ్రామస్తులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన టీడీపీ నేత శివప్రసాద్ వెంటనే తెనాలి డిపో మేనేజర్తో ఫోన్లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బాలకోటేశ్వరరావు, శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.
NLR: విద్యా వారోత్సవాల్లో భాగంగా వెంగళరావు నగర్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల HM షేక్ హసీనా జ్ఞానబాట బడిట కార్యక్రమం నిర్వహించారు. సిబ్బందితో కలిసి విద్యార్థుల ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించాలని కోరారు. ప్రైవేటు పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
ప్రకాశం: తడి, పొడి చెత్తను వేరు చేసే విధానం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో పర్యటించారు. గ్రామపంచాయతీ రిక్షాలు ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్లే విధంగా ఉండాలని పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
గుంటూరు: మత్తుపదార్థాల రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా ఈ నెల 21న గుంటూరు నగరంలో 2K వాక్ నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కేయస్ లక్ష్మణరావు వెల్లడించారు. యాంటీ డ్రగ్స్ ఫోరమ్ శుక్రవారం బ్రాడీపేటలో 2K వాక్ పోస్టర్లను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా లక్ష్మణరావు మాట్లాడారు. ఉదయం 8 గంటలకు శంకర్ విలాస్ సెంటర్ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు.
ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ స్వయంభూ జంబుకేశ్వరుడు శుక్రవారం అమావాస్య రోజు ప్రత్యేక అలంకరణలో భక్తులకి దర్శనం ఇచ్చాడు. పురోహితులు రామకృష్ణ ఉదయాన్నే స్వామి మూల విరాట్కి ప్రత్యేక అభిషేకాలు చేపట్టి, పుష్పాలతో విశేషంగా అలంకరించి మంగలనైవేద్యాలు అందించారు. భక్తులు పెద్దఎత్తున ఆలయానికి విచ్చేసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
కోనసీమ: అమలాపురం మున్సిపల్ కాలనీలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఏడుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ వీరబాబు తెలిపారు. పరస్పర ఫిర్యాదుల మేరకు మీసాల కృష్ణకుమారి వర్గంపై ముగ్గురు, గాడ విజయ్ పిర్యాదుతో మరో నలుగురిపై శుక్రవారం కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
NTR: నందిగామలో అర్చకుడు సాయిరాం నిజాయితీకి నిలువెత్తు ఉదాహరణగా నిలిచాడు. రాగాపురం గ్రామానికి చెందిన వ్యక్తి పోగొట్టుకున్న లక్ష రూపాయల నగదు బ్యాగును గొల్లమూడి శివాలయ అర్చకుడు సాయిరాం రోడ్డుపై గుర్తించాడు. వెంటనే సమాచారం ఇచ్చి, పోలీసుల సమక్షంలో యజమానికి నగదు అందజేశాడు. పోయిందనుకున్న డబ్బు తిరిగి రావడంతో బాధితుడు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
PPM: మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శుక్రవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంపీడీవో కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజల, ప్రయాణికుల, పాదచారుల, వాహనదారుల యొక్క దాహార్తిని తీర్చేందుకు ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటుచేసాము అన్నారు.