ప్రకాశం: జిల్లా SP హర్షవర్ధన్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. కొందరు మోసగాళ్లు పోలీసులుగా నటిస్తూ వీడియో కాల్ చేసి మీరు అరెస్ట్లో ఉన్నారని భయపెట్టి డబ్బులు దోచుకుంటున్నారన్నారు. ఇటువంటి కాల్స్ నమ్మకుండా వెంటనే కట్ చేయాలని, వ్యక్తిగత వివరాలు లేదా డబ్బులు ఇవ్వకూడదన్నారు. మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలి లేదా సైబర్ క్రైంలో ఫిర్యాదు చేయాలని అన్నారు.
KRNL: ఆలూరు మారెమ్మ గుడి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈడిగ మునెప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఆటోలో ఉన్న మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి సమీప ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స కొనసాగుతోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో బుధవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.1,63,625 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 134 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 23 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు అని, 1620 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.
SS: ఆమడగూరు మండలం జౌకల కొత్తపల్లికి చెందిన మహిళా రైతు గజ్జల శ్రీదేవి చీయా పంట సాగుతో మంచి లాభాలు పొందారు. 1.30 ఎకరాల్లో సాగు చేసి 11 క్వింటాల దిగుబడి సాధించి, క్వింటాకు రూ.14,000 చొప్పున మొత్తం రూ.1,54,000 ఆదాయం పొందారు. రూ.15,000 పెట్టుబడితో రూ.1,39,000 నికర లాభం పొందిన ఆమెను పుట్టపర్తి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అభినందించారు.
NLR: వలేటివారిపాలెం తహశీల్దార్ కార్యాలయాన్ని బుధవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రీవెన్స్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించబోనని అర్జీదారులకు సరైన ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. కందుకూరు సబ్ కలెక్టర్ హిమ వంశీతో కలిసి రికార్డు రూమ్ విభాగాలను పరిశీలించి భూసేకరణ పరిహారం చెల్లింపులపై సమీక్షించారు.
ప్రకాశం: కొండపిసామాజిక ఆరోగ్యకేంద్రంలో జరుగుతున్న మరమ్మతు పనులను బుధవారం మంత్రి స్వామి పరిశీలించారు. వైద్యశాలను ప్రత్యేక శ్రద్ధతో పలు రకాల అభివృద్ధితో పాటు వసతులు కల్పించేందుకు మంత్రి కృషి చేస్తున్నారు. కొండపిలో వైద్యశాలకు ఇప్పటికే డయాలసిస్ యూనిట్ మంజూరు చేయించారు. మరమ్మతు పనులు వేగవంతం చేయాలని, పనులలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
TPT: జలధార-జలహారతి కార్యక్రమాన్ని జిల్లాలో సమగ్రంగా అమలు చేయాలని కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ సూచించారు. వర్షపు నీటి ప్రతి బొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాల పెంపు, వ్యవసాయాభివృద్ధి లక్ష్యంగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో కమిటీలు ఏర్పాటు చేసి సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
KRNL: గోనెగండ్లలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాన ఎజెండాగా తీసుకొని ఈనెల 13న నిరసన దీక్ష చేపట్టనున్నట్లు DCC అధ్యక్షుడు క్రాంతినాయుడు తెలిపారు. తాగునీరు, ట్రాఫిక్, వైద్యం, మైనార్టీ సంక్షేమం, అమలు తదితర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వోకు, పోలీసులకి వినతి పత్రం అందించారు.
TPT: తిరుపతికి చెందిన కే.అనంతమ్మ పుట్టినరోజు సందర్భంగా, ఆమె కుమార్తె శారద కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంకు రూ.10 లక్షల విరాళం అందజేశారు. బుధవారం ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో విరాళం డీడీని డైరెక్టర్ డా. శ్రీనాథ్ రెడ్డికి అందించారు. ఈ కార్యక్రమంలో డా. భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
VSP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ చేరుకున్నారు. ఆయనకు విశాఖ ఎయిర్ పోర్ట్లో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన ఆంధ్ర యూనివర్సిటీకి బయలుదేరి వెళ్లారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న ‘శతాబ్ది మహోత్సవ్ – ఏయూ మెగా కల్చరల్ ఫెస్ట్ 2026’లో ఆయన పాల్గొంటారు.
ELR: భవిష్యత్తు తరాల కోసం నీటి వనరులను కాపాడుకోవాలని కలెక్టర్ వెట్రి సెల్వి, ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. బుధవారం ఉంగుటూరు ఎంపీడీవో కార్యాలయంలో 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు విధానం, పనుల ప్రాధాన్యత, నిధుల వినియోగం, పారదర్శకతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటి సంరక్షణను సామాజిక ఉద్యమంలా తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
E.G: ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే, గ్రౌండ్ ట్రూతింగ్ పనులను కలెక్టర్ కీర్తి చేకూరి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ.. భూముల రీ-సర్వే ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరగాలని స్పష్టం చేశారు. ప్రతి రైతుకు సరైన సమాచారం అందించి వారి సమక్షంలోనే కొలతలు చేపట్టాలన్నారు.
NLR: బోగోలు మండలంలో ఈ నెల 15వ తేదీన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మండలంలోని జువ్వల దీన్నేకు వచ్చి మత్స్యకారులతో మాట్లాడుతారని వైసీపీ కార్యాలయ సిబ్బంది ప్రకటను విడుదల చేసింది. ఈ కార్యక్రమాన్ని వైసీపీ నేతలు కార్యకర్తలు విజయవంతం చేయాలన్నారు.
ప్రకాశం: ఒంగోలు, దర్శి, కందుకూరు, మార్కాపురం రవాణా కార్యాలయాల్లో జరుగు వాహన పటుత్వ పరీక్షలు (ఎఫ్సీ) రేపటి నుంచి మద్దిపాడు మండలం అన్నంగి వద్ద ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ (ATS) జరుపబడతాయని ఉప రవాణా కమిషనర్ సుశీల అన్నారు. 8వ తేదీకి ముందు స్లాట్స్ బుక్ చేసుకున్న వారు క్యాన్సిల్ చేసుకుని 9వ తేదీ నుంచి చేసుకోవాలని ఉప రవాణా కమిషనర్ సుశీల తెలిపారు.
కృష్ణా: నందివాడ మండలం రుద్రపాక గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా నియమితులైన డిప్యూటీ ఎంపీడీవో ఆర్. సుబ్రహ్మణ్యం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, పంచాయితీ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. గ్రామ అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక వసతుల మెరుగుదలకు సృష్టి సాధిస్తానని తెలిపారు.