ప్రకాశం: వెలిగండ్ల మండలం మరపుగుంట్ల స్వర్ణ గ్రామంలో యు.ఎఫ్.ఎస్ సర్వే, అభివృద్ధి పనులను శుక్రవారం డబ్ల్యూ డిప్యూటీ ఎంపీడీవో ఎస్. రాంప్రసాద్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించి, సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
KRNL: జిల్లాలో రహదారి ప్రమాదాల నియంత్రణకు ప్రతి శనివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై ప్రచారం చేపట్టారు. హెల్మెట్ ధరించడం, ఓవర్ స్పీడ్, మద్యం సేవించి డ్రైవింగ్ చేయరాదని పేర్కొన్నారు. జనవరి 1 నుంచి ఏప్రిల్ 3 వరకు పలు ఉల్లంఘనలపై ఈ-చలాన్లు నమోదు చేసినట్లు తెలిపారు.
CTR: కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానాన్ని కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు.
KDP: కలసపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నారెడ్డి పల్లిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 7 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు SI సుబహాన్ తెలిపారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
GNTR: మంగళగిరిలో గ్యాస్ డోర్ డెలివరీ నిలిపివేతపై తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర స్పందించారు. అధికారులతో కలిసి ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. నిబంధనల ప్రకారం వినియోగదారుల ఇళ్ల వద్దకే సిలిండర్లను డెలివరీ చేయాలని ఆదేశించారు. వాహనాల వద్దకే వచ్చి సిలిండర్లు తీసుకెళ్లాలని ప్రజలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
TPT: పిచ్చాటూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్లో అంగన్వాడి కార్యకర్త-1, హెల్పర్- 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏప్రిల్ 6 నుంచి 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హతలు కలిగిన స్థానిక మహిళలు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణతతో పాటు 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలన్నారు. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారన్నారు.
CTR: పుంగనూరు నగిరి వీధిలో వెలసిన శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు శనివారం సాయంత్రం వైభవంగా ముగిశాయి. 11 రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాల్లో ఒక్కోరోజు ఒక్కొక్క వాహనంపై పార్వతీ పరమేశ్వరులు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమాలకు సహకరించినవారికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
PLD: వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని తాసిల్దార్లు డిప్యూటీ తాహసిల్దార్లతో జాయింట్ కలెక్టర్ సంజనా సింహ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లోని పరిష్కారం కానీ ఇనాం గ్రామాలు, 22-ఏ తొలగింపు, మ్యూటిషన్స్, వెబ్ ల్యాండ్ సమస్యలు, హౌస్ సైట్స్ రీ సర్వే సమస్యలు పాస్ పుస్తకాల పంపిణీ వంటి అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
NTR: నందిగామలోకృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ గోపి, న్యాయ సేవాధికారి రామకృష్ణ కోర్టు ప్రాంగణం, సబ్ జైలు పర్యటించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ కరీముల్లా, కార్యదర్శి చెరుకుమల్లి రామారావు నేతృత్వంలో ఘన స్వాగతం పలికారు. బార్ ఛాంబర్లో సమస్యలు వివరించగా పరిష్కరిస్తానని జడ్జి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
BPT: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 9 పర్యటించనున్న నేపథ్యంలో జిల్లాలో ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. శనివారం జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ అధికారులతో కలిసి భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో పర్యటించారు. సభ వేదిక, హెలిప్యాడ్ ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను పరిశీలించి, భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేశారు.
TPT: పేరూరు చెరువు నుంచి అవిలాల చెరువు వరకు సప్లై ఛానల్కు సంబంధించిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పనులకు రూ. 8 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచి, అవిలాల చెరువు సుందరీకరణతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి చేపట్టాలని అధికారులకు సూచించారు.
SKLM: సింగుపురంలో బాదం పాలు తాగి 80 అస్వస్థతకు గురైన ఘటనపై జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీనివాస్ స్పందించారు. శనివారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్తో ఫోన్లో మాట్లాడారు. బాధితులకు అందుతున్న వైద్యం గురించి మంత్రి ఆరాతీశారు. బాధితులు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ను ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ASR: గిరిజన యువతి దూసరి లక్ష్మి ఆత్మహత్య ఘటనపై అనంతగిరి మండలంలో కోరపర్తిలో గ్రామస్తులు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రేమ పేరుతో మోసం చేసిన కొల్లి లోకేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, ఎక్స్గ్రేషియా, ఉద్యోగం కల్పించాలని కోరారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితుడిని శిక్షించాలని కోరారు.
GNTR: రమేష్ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. 64 ఏళ్ల రోగికి మత్తు ఇవ్వకుండా మెలకువలోనే గుండె బైపాస్ ఆపరేషన్ చేశారు. గతంలో క్యాన్సర్ చికిత్సల వల్ల సదరు రోగి ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. సాధారణ మత్తు ఇస్తే ప్రాణాపాయం ఉంటుందని వైద్యులు భావించారు. దీంతో డాక్టర్ల బృందం వెంటిలేటర్ అవసరం లేకుండానే ఈ సర్జరీని పూర్తి చేశారు.
ప్రకాశం: ఇటీవల మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వెలిగండ్ల మండలం చోడవరం గ్రామానికి చెందిన పొదిలి మహేంద్ర కుటుంబాన్ని వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ శుక్రవారం పరామర్శించారు. జిల్లా వైసీపీ అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకటించిన రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని మహేంద్ర భార్య నాగమణికి అందజేశారు.