TPT: నెల్లూరులోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఈనెల 8న వైసీపీ నేతలు ఆందోళన చేశారు. సీఐ శ్రీనివాసరావు ఇతర పోలీసులు అక్కడికి చేరుకుని, ఆందోళనకు అనుమతి లేదని చెప్పినా నేతలు పట్టించుకోలేదు. తమ విధులకు ఆటంకం కలిగించారని సీఐ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రి కాకాణి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటిపై కేసు నమోదైంది.
VZM : గజపతినగరం మండలంలోని పాతబగ్గం గ్రామంలో ఉచిత సోలార్ విద్యుత్ను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారికి ప్రభుత్వం ఉచితంగా సోలార్ విద్యుత్ను అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
KKD: మత్స్య సంపద పెంపు కోసం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది. అద్దరిపేట నుంచి అంతర్వేది వరకు 170 కిలోమీటర్ల పరిధిలోని మత్స్యకారులు ఈ వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. నిషేధ సమయంలో ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం మత్స్యకారులకు రేషన్ పంపిణీ చేయనుంది. మత్స్య సంపద పునరుత్పత్తికి సహకరించాలని అధికారులు తెలిపారు
ATP: గుత్తి పట్టణానికి చెందిన గుర్రం మనోహర్ భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ సమక్షంలో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై బీజేపీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ ప్రధాన కార్యదర్శి చామంతుల ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
NLR: ఆత్మకూరు మండలంలో జనగణన కోసం శిక్షణ ప్రక్రియ మొదట విడత పూర్తయ్యిందని తహసీల్దార్ పద్మజ కుమారి ఇవాళ తెలిపారు. మొత్తం 69 మందితో జనగణన నిర్వహిస్తుండగా తొలి శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందితో కొన్ని ఇళ్ల వద్ద వారి వివరాలతో ట్రయల్ నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ప్రతి ఇంట్లో నివసించేవారి వివరాలను నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు.
SS: పెనుకొండలో కియా, దాని అనుబంధ పరిశ్రమల రాకతో విద్యా వ్యవస్థ రూపురేఖలు మారుతున్నాయి. CSR నిధులతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నారు. డిగ్రీ కళాశాలలో రూ.80 లక్షలతో ఆధునిక గ్రంథాలయం నిర్మించి, 18 వేలకు పైగా పుస్తకాలను ఆన్లైన్ చేశారు. ఇది 83 గ్రామాల విద్యార్థులకు వరంలా మారింది.
VSP: ఈ నెల 14న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతిని నిర్వహిస్తున్నామని డాక్టర్ అంబేడ్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు కళ్యాణ్ రావు తెలిపారు. ఆదివారం రామ టాకీస్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ నెల 14న ఉదయం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు, ఎల్ఐసీ కూడలి నుంచి అంబేడ్కర్ భవనం వరకు ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. అనంతరం జయంతి సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
SKLM: హిర మండలంలోని దేవరశెట్టి వీధిలో శనివారం భారీ చోరీ జరిగిందంటూ జరిగిన ప్రచారంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. చోరీకి గురయ్యాయని బాధితులు తెలిపిన ఆభరణాలన్నీ ఇంటిలోనే ఉండటంతో అసలు చోరీయే జరగలేదని పోలీసులు గుర్తించారు. శనివారం ఉదయం భారీ చోరీ జరిగిందంటూ పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశారు.
PPM: అరకు ఎంపీ నిధులు మంజూరు చేసినా.. మన్యం జిల్లా అధికారులు వాటిని అభివృద్ది కోసం ఎందుకు ఖర్చు చేయడం లేదని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పి.రంజిత్ అన్నారు. అధికారులు నిధులు తేలేరు, ఎంపీ ఇచ్చిన నిధులు ఖర్చు చేయరు ఇదేం పద్దతి అని ప్రశ్నించారు. నిధులు ఖర్చు చేయకపోవడం అంటే మన్యం జిల్లా ప్రజలను నిర్లక్ష్యం చేయటమేనని ఆయన పేర్కొన్నారు.
విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడికి చెందిన సింగిరెడ్డి సాయి శ్రీ హరికృష్ణ (26) అమెరికాలో ప్రమాదవశాత్తు నదిలో జారిపడి మృతి చెందాడు. శనివారం తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి మారమేక్ స్టేట్ పార్క్కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. పుట్టినరోజునే సాయి శ్రీ హరికృష్ణ మృతి చెందాడన్న వార్త రావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
KRNL: జిల్లాలోని క్రీడాకారులు వేసవి క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ కోరారు. ఇవాళ నగరంలోని తన నివాసంలో టీజీవీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వేసవి క్రీడా శిక్షణా శిబిరాల వాల్ పోస్టర్లు ఆయన ఆవిష్కరించారు. జిల్లాలో 6 ప్రాంతాలలో ఉచితంగా తైక్వాండో క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కృష్ణా: రాజకీయ నేపథ్యం లేని సాధారణ కుటుంబం నుంచి వచ్చి ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లో వచ్చిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని కంకిపాడు టీడీపీ కిషోర్ బాబు ఈరోజు అన్నారు. సౌకర్యవంతమైన జీవితాన్ని ఎంచుకునే అవకాశం ఉన్నప్పటికీ, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సేవ చేయడం ఎమ్మెల్యే ప్రత్యేకత అని తెలిపారు.
VSP: జీవీఎంసీ 65వ వార్డు రాజీవ్ క్రీడా ప్రాంగణంలో వాకర్స్పై ఏడాదికి రూ.720 యూజర్ చార్జీల విధింపుకు వ్యతిరేకంగా ఆదివారం ఏఐవైఎఫ్ నేతలు నిరసన చేపట్టారు. జిల్లా కార్యదర్శి కె. అచ్యుత్ రావు మాట్లాడుతూ.. చార్జీల భారంతో వాకర్స్ సంఖ్య తగ్గిందన్నారు. ఆన్లైన్ చెల్లింపులే అనుమతిస్తూ భద్రతా సిబ్బంది ప్రవేశాన్ని ఆపుతున్నారని విమర్శించారు.
ATP: పీఏబీఆర్ కుడి కాలువ గేటును అధికారులు విజయవంతంగా మూసివేసి, నీటి సరఫరాను నిలిపివేశారు. 132 రోజుల పాటు 4.5 టీఎంసీల నీటిని విడుదల చేసి 48 చెరువులను నింపారు. ప్రస్తుతం జలాశయంలో 2.623 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూలై వరకు ఉమ్మడి అనంతపురం జిల్లా తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేదని ఎస్ఈ సుధాకర్ రావు స్పష్టం చేశారు.
గుంటూరు: ఎండల్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఉపశమనం కలిగించేలా విశ్రాంత ప్రిన్సిపల్ నేతి చలపతి 40 సోలార్ హెల్మెట్లను అందించారు. శివాజీ చౌక్లో నిర్వహించిన కార్యక్రమంలో సీఐలు మల్లికార్జునరావు, రాములు నాయక్ వీటిని సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ హెల్మెట్లు ఎండ తీవ్రతను తగ్గించడంలో సహాయపడతాయని అధికారులు తెలిపారు.