E.G: తాళ్లపూడి మండలం ప్రక్కిలంక గ్రామంలో శనివారం నిర్వహించిన ‘అన్నదాత సుఖీభవ-PM కిసాన్’ పంపిణీలో కలెక్టర్ కీర్తి చేకూరి, MLA ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మూడో విడత కింద 14,884 మంది రైతులకు రూ.8.39 కోట్లు జమ చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఏటా రూ.20,000 పెట్టుబడి సాయం అందించి అన్నదాతలను ఆదుకోవడమే లక్ష్యమని వెల్లడించారు.
NDL: మహానంది పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. వేసవిలో ఎండల తీవ్రత దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నడిచే మార్గాల్లో గ్రీన్ మ్యాట్లు, చల్లటి తాగునీటి సౌకర్యం కల్పిస్తామని, దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా నిర్వహిస్తున్నట్లు వివరించారు.
TPT: తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ బాగా పెరిగింది. టోకెన్ లేని భక్తులకు దర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోంది. నారాయణగిరి షెడ్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం 67,264 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 29,410 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.28 కోట్లుగా నమోదైందని టీటీడీ వెల్లడించింది.
KKD: పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్మన్, వైసీపి రాష్ట్ర కార్యదర్శి నెక్కంటి సాయిప్రసాద్ను జగ్గంపేట నియోజకవర్గం పరిశీలకుడిగా నియమిస్తు వైసీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. నిరంతరం కేంద్ర కార్యాలయంతో నమన్యయం చేసుకుంటూ, జగ్గంపేట నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది.
SKLM: ఉమ్మడి ఏపీ మాజీ DGP హెచ్.జే దొర ఆకస్మిక మృతి పట్ల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం దిగ్భ్రాంతిని ప్రకటించారు. ఆయన మరణ వార్త తనను అమితంగా కలచివేసిందని అన్నారు. 1965 బ్యాచ్ IPS అధికారి అయిన దొర నిజాయితీ, నిబద్ధత కలిగిన అధికారి అని కొనియాడారు. అనంతరం కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని కేంద్ర మంత్రి తెలిపారు.
PPM: పట్టణంలో శనివారం ఉదయం స్దానిక పోలీసులు ‘వజ్ర పహార్’ కార్యక్రమంలో భాగంగా కార్షన్ సెర్చ్ను నిర్వహించారు. ఎస్పీ ఎస్.వీ.మాధవరెడ్డి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రెల్లి వీధిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా 6 మోటార్ సైకిళ్ళు, 12 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సత్యసాయి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ HJ దొర తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దొర శ్రీ సత్యసాయి బాబాకు చిరకాల భక్తుడు కావడంతో పుట్టపర్తి ప్రాంతంతో ఆయనకు విడదీయలేని అనుబంధం ఉంది. బాబా సేవా కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొనేవారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భక్తులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.
ATP: తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్లతో సమావేశమయ్యారు. పట్టణ అభివృద్ధి కోసం గత ఐదేళ్లుగా అందరూ కలిసి పనిచేశామని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో ఎవరైనా సరే అభివృద్ధిని చూసే ఓటేయాలని ప్రజలను కోరాలని సూచించారు. పట్టణ ప్రగతి కోసం కృషి చేసే వారికే ప్రజలు మద్దతు ఇస్తారని పేర్కొన్నారు.
AKP: అచ్యుతాపురం మండలం జగ్గన్నపేట గ్రామంలో గల సత్తెమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలో ప్రవేశించి హుండీ తెరిచి భక్తులు సమర్పించిన కానుకలను ఎత్తుకెళ్లారని గ్రామస్తులు తెలిపారు. శనివారం ఉదయం చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. మూడు నెలల నుంచి హుండీని తెరవలేదన్నారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామన్నారు.
GNTR: తెనాలిలో మానవత్వం వెలుగు చూసింది. రైలు నుంచి పడిపోయి మృతి చెందిన పశ్చిమ బెంగాల్కు చెందిన బిందం నాయక్ (39) మృతదేహానికి స్థానికులు అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లే స్థోమత లేకపోవడంతో కుర్రా శ్రీను, అతని మిత్ర బృందం ముందుకు వచ్చి దహన సంస్కారాలు పూర్తి చేశారు.
E.G: జనసేన పార్టీ 13 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గ ఇంఛార్జ్ అత్తి సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక దేవిచౌక్ సెంటర్లో భవన నిర్మాణ కార్మికులకు అల్పాహార వితరణ కార్యక్రమం చేపట్టారు. శనివారం ఉదయం చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆంధ్ర రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ డైరెక్టర్ గంటా స్వరూపరాణి హాజరై ఆహారాన్ని పంపిణీ చేశారు.
ATP: డి. హీరేహల్ మండలం మురడి గ్రామంలో వెలసిన ప్రసిద్ద ఆంజనేయుడు ప్రత్యేక అలంకరణలో భక్తులకు కనువిందు చేశాడు. వేకువజామునే స్వామి మూల విరాట్కి సుప్రభాత సేవ, పంచామృత వివిధ అభిషేకాలు చేపట్టి పుష్పాలు, తమలాపాకుల హారాలతో విశేషంగా అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. స్థానిక భక్తులే కాక ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు.
ప్రకాశం: దొనకొండ మండలంలోని భూమనపల్లి, మంగినపూడి, రుద్రసముద్రం, ఇంద్లచరువు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని అర్జీలు స్వీకరించారు. తాగునీరు, రహదారులు, విద్యుత్, వ్యవసాయం, ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన సమస్యలను స్థానికులు వివరించారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామి ఇచ్చారు.
ELR: ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ హెల్పర్లను వర్కర్లుగా ప్రమోట్ చేయడానికి కొత్త మార్గదర్శకాలను(G.O) విడుదల చేసింది. ఈ నిబంధనల ప్రకారం, 50% వర్కర్ పోస్టులు హెల్పర్లకే కేటాయించనుంది. టెన్త్ ఉత్తీర్ణత, ఐదేళ్ల సర్వీసు, ఫిట్నెస్ తప్పనిసరి. నియామక సంవత్సరం జులై 1 నాటికి 50 ఏళ్లు దాటకూడదు. సీనియారిటీ, వయస్సు, విద్యార్హతలను బట్టి పదోన్నతులు కల్పిస్తారు.
KRNL: పెద్దకడుబూరులో స్వచ్ఛత కార్యక్రమాలను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో స్వచ్ఛ రథం వాహనాన్ని టీడీపీ ఇన్చార్జి రాఘవేంద్ర రెడ్డి ప్రారంభించారు. గ్రామంలో పరిశుభ్రత, వ్యర్థాల సక్రమ నిర్వహణకు వాహనం ఉపయోగపడుతుందని తెలిపారు. స్వచ్ఛమైన గ్రామాల నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా కృషి చేయాలన్నారు. ప్రజలు పరిశుభ్రతపై మరింత అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.