నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళాలో 69 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ శశికళ బుధవారం తెలిపారు. మొత్తం 132 మంది అభ్యర్థులు హాజరయ్యారని ప్రిసిపల్ పేర్కొన్నారు. ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని ఆమె సూచించారు.
ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత బుధవారం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని కలిశారు. నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాల దుస్థితిని వివరించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, అసంపూర్తి పనులు, కాంపౌండ్ గోడల లేమి వంటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కొత్త కేంద్రాల ఏర్పాటుతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరారు.
SS: ఎస్సీ కార్పొరేషన్, ఆర్టీసీ ఆధ్వర్యంలో హెవీ డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సర్టిఫికెట్లు అందజేశారు. హిందూపురం డిపోలో శిక్షణ పొందిన పది మంది నిరుద్యోగ యువతకు బుధవారం కలెక్టరేట్లో వీటిని పంపిణీ చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
BPT: యద్దనపూడి మండలం గన్నవరంలో రూ. 58 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చొరవతో రూ. 94 లక్షలతో ‘జలసిరి’ పథకం కింద గ్రామంలోని 357 ఇళ్లకు తాగునీటి కనెక్షన్లు ఏర్పాటు చేసినట్లు మండల టీడీపీ అధ్యక్షుడు రంగయ్య చౌదరి బుధవారం తెలిపారు. అభివృద్ధి పనుల ద్వారా గ్రామ రూపురేఖలు మారుతాయని పేర్కొన్నారు.
PLD: నరసరావుపేటలో జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ జనసేన నేతలతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చురుగ్గా నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.
PLD: పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేపట్టిన ‘ప్రజల వద్దకు ప్రవీణ్ – 100 రోజులు 100 గ్రామాలు’ కార్యక్రమం బుధవారం రాత్రి బలుసుపాడు గ్రామానికి చేరుకుంది. పర్యటనలో భాగంగా ఆయన నేరుగా ప్రజల సమస్యలు విని, పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ పర్యటన కొనసాగించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
GNTR: రాజధాని అమరావతి అభివృద్ధి పనుల కోసం ఏపీ ప్రభుత్వం రూ.1,400 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణాల ద్వారా వచ్చే ఈ నిధులను 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేటాయించారు. ఈ మొత్తాన్ని సీఆర్డీఏ పీడీ ఖాతాలో జమ చేయనున్నారు.
PLD: యువతలో ఆసక్తి పెంచేందుకే సీఎం చంద్రబాబు ప్రజాప్రతినిధులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే పుల్లారావు అన్నారు. విజయవాడలో జరుగుతున్న ఏపీ శాసనసభ క్రీడాపోటీల్లో ఆయన పాల్గొన్నారు. తోటి ఎమ్మెల్యేలతో కలిసి వాలీబాల్ ఆడారు. ప్రజలను సంతోషంగా ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని, సాంకేతికత ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు క్రీడలే ఉత్తమ మార్గమన్నారు.
GNTR: ప్రత్తిపాడు ఈదులపాలెంలోని కాటూరి మెడికల్ కళాశాల 22వ గ్రాడ్యుయేషన్ వేడుకలకుబుధవారం ఏపీ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైద్య విద్య పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆయన పట్టాలు అందజేశారు. డాక్టర్ చంద్రశేఖర్తో కలిసి నవతరం వైద్యులను అభినందిస్తూ, వృత్తిలో రాణించాలని గవర్నర్ ఆకాంక్షించారు.
BPT: బాపట్లను మత్తు రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసులు ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్’ చేపట్టారు. ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలతో వేదుళ్లపల్లి పోలీసులు, ఈగల్ సెల్ సిబ్బంది విద్యాసంస్థల వద్ద తనిఖీలు చేశారు. నిషేధిత ‘కూల్ లిప్’ తదితర పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. పాఠశాలలకు 100 మీటర్ల లోపు వీటిని అమ్మరాదన్నారు.
KDP: జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు రౌడీ షీటర్లు, నేరచరిత్ర గల వ్యక్తులకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సత్ప్రవర్తనతో జీవిస్తూ కుటుంబంతో గౌరవప్రదమైన జీవనం గడపాలని హితవు పలికారు.
రాయచోటి వీరభద్ర స్వామివారిని రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన వారి కుటుంబ సభ్యులు కలిసి దర్శించుకున్నారు. వారికి దేవస్థాన అర్చక స్వాములు, ఆలయ ఛైర్మన్ తిరుమల మనోజ్ కుమార్, ఆలయ కార్యనిర్వాహణాధికారి డీవీ రమణారెడ్డి పూర్ణపలంతో స్వాగతం పలికారు. అర్చనలు చేసిన అనంతరం తీర్థప్రసాదాలు అందించారు.
KRNL: జిల్లా వ్యాప్తంగా బుధవారం జరిగిన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 852 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి (RIO) లాలప్ప తెలిపారు. 27,571 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా.. 26,718 మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదన్నారు.
ELR: ఉంగుటూరు MLA క్యాంపు కార్యాలయంలో బుధవారం MLA పత్సమట్ల ధర్మరాజు అధ్యక్షతన గణపవరం మండల నాయకులతో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ.. రేపటి నుంచి ప్రారంభమవుతున్న ప్రారంభమవుతున్న 5వ విడత జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు వల్ల కార్యకర్తలకు కలిగే ప్రయోజనాలు వివరించారు.
W.G: పెనుగొండ ఎంపీడీవో సూర్యనారాయణమూర్తి పని తీరుపై కలెక్టర్ చదలవాడ నాగరాణి అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల వ్యాప్తంగా జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పురోగతిపై సమీక్షించారు. సర్వే నత్త నడకన సాగడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం జేశారు. రెండు రోజుల్లో టార్గెట్ పూర్తి చేయాలంటూ ఆమె ఆదేశాలు జారీ చేశారు.