VSP: ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ఏయూ కన్వెన్షన్ సెంటర్లో కళా ఉత్సవ్ జరుగనున్నట్లు సంగీత విభాగాధిపతి ఆచార్య సరస్వతి విద్యార్థి తెలిపారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, శతాధిక వృద్ధులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ అన్నవరపు రామ స్వామి విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు.
VZM: NRGSలో చేపట్టిన బీటీ రోడ్స్, చెరువు తదితర పనులను ఢిల్లీ సెంట్రల్ ఆడిట్ టీం సోమవారం సంతకవిడి, రాజాం మండలాల్లో పరిశీలించింది. పనుల నాణ్యతను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. పనులు నాణ్యతతో జరగాలని, బిల్స్ డేటా పక్కాగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.
GNTR: పిడుగురాళ్ల సర్వజనాసుపత్రి, పల్నాడు జిల్లాలో ఖాళీగా ఉన్న 150 నర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు గుంటూరు జోన్-3 ప్రాంతీయ వైద్య, ఆరోగ్య సంచాలకులు శోభారాణి తెలిపారు. ఒప్పంద విధానంలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నేటి నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అర్హులైనవారు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తులు అందించాలన్నారు.
NLR: ఉదయగిరి మండలం అయ్యవారిపల్లె పంచాయతీ దేకూరుపల్లి ఎస్సీ కాలనీలోని కోదండరామస్వామి ఆలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారి మెడలోని 2 గ్రాముల బంగారు మంగళసూత్రం, హుండీలోని సుమారు రూ.10 వేల నగదును అపహరించారు. ఈ ఘటనపై కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తూ.గో: జిల్లాలో అక్షరాంధ్ర కార్యక్రమం కింద నిరక్షరాస్య వయోజనులకు నిర్వహించిన ప్రాథమిక భాష, గణిత నైపుణ్యాల పరీక్షలు విజయవంతంగా జరిగినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మొత్తం 88,647 మంది నమోదు చేసుకోగా, 88,114 మంది హాజరయ్యారని, కేవలం 533 మంది గైర్హాజరయ్యారని చెప్పారు. జిల్లాలో అక్షరాస్యత శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.
నంద్యాలలో వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సోమవారం సూచించారు. వడదెబ్బ నివారణపై అవగాహన పోస్టర్లను ఆవిష్కరిస్తూ.. ఎక్కువగా నీరు, పళ్లరసాలు, మజ్జిగ తీసుకోవాలని, తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలని తెలిపారు.
ATP: గుంతకల్లు మున్సిపాలిటీలోని స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా మురుగునీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణ పనులను మంగళవారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి పరిశీలించారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు ఆదేశించారు. అనంతరం పలు వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ పర్యటించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ELR: జిల్లాలోని రిజర్వ్ అటవీ ప్రాంతాలు, అభయారణ్య ప్రాంతాలలో నివసించే ప్రజలకు సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు నివేదికలను సమర్పించాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. రిజర్వ్ అటవీ ప్రాంతాలు, అభయారణ్య ప్రాంతాలలో ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలపై సోమవారం కలెక్టరేట్ గౌతమి సమావేశపు హాలులో ఆమె సమీక్షించారు.
KDP: పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కడప జిల్లాలో పలువురు తహసీల్దార్లకు బదిలీలు చేస్తూ జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 14 మంది తహసీల్దార్లను వివిధ మండలాలకు బదిలీ చేయగా, మరో ఇద్దరు అధికారులను కొత్త నియమాకాల కోసం కలెక్టర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
W.G: గ్యాస్ సరఫరాలో కంపెనీలు, డెలివరీ బాయ్స్ వినియోగదారులను ఇబ్బంది పెట్టినా, అదనపు డబ్బులు డిమాండ్ చేసినా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 81216 76653కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తహసీల్దార్ ఐవీవీ సత్యనారాయణ సూచించారు. సోమవారం నరసాపురం గ్యాస్ ఏజెన్సీలను డీటీ మహేష్ కలిసి ఆయన తనిఖీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
CTR: పోలీసు శాఖలో ఉత్తమ సేవలందించిన పలువురు జిల్లా పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారాలను ప్రకటించింది. రాజశేఖర్ రాజు (ASP), గోపాల్ (RSI), చిత్తూరు వన్ టౌన్ సీఐ మహేశ్వర, ఐరాల ఏఎస్సై వేణుగోపాల్ నాయుడు, ఎస్ఆర్ పురం ఏఎస్సై పరంధామనాయుడు, హెడ్ కానిస్టేబుల్స్ ఉదయ్ కుమార్, సుమన్, సురేష్, ఢిల్లీ ఎంపికైన వారిలో ఉన్నారు.
KRNL: హాలహర్వి మండలం గూళ్యం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు రైలింగ్ మారెప్ప, వీరేషప్ప బైక్ ప్రమాదంలో గాయపడి బళ్లారి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆస్పత్రికి వెళ్లి వారిని సోమవారం పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.
AKP: ఎస్ రాయవరం మండలం ధర్మవరం అగ్రహారంలోని వరహానదిలో సోమవారం వినయ్ కుమార్ (22) ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. పశువులు మేపుతుండగా ఒక ఆవు నీటిలోకి వెళ్లడంతో దాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమిచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
TPT: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఈ నెల 19న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆస్థానం నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతం, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చనలు జరుగుతాయి. సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు పంచాంగ శ్రవణం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.
కృష్ణా: జిల్లాలోని బందరు, బంటుమిల్లి, పామర్రు, గుడివాడ, కంకిపాడు, మొవ్వ, గన్నవరం, అవనిగడ్డ ప్రాజెక్టులలో మొత్తం 82 అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 21-35 ఏళ్ల మధ్య వయస్సు కలిగి, 10వ తరగతి ఉత్తీర్ణులైన వివాహిత మహిళలు అర్హులన్నారు. ఈ దరఖాస్తులకు నేడే చివరి తేదీ అని సూచించారు. ఇతర వివరాలకు సంబంధిత ICDS కార్యాలయాలను సంప్రదించాలన్నారు.