గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం అయ్యింది. ఈ వేడుకలను పురస్కరించుకుని రేపు దేశ వ్యాప్తంగా 901 మంది పోలీసులకు పతకాలు అందించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ తెలిపింది. సీఆర్పీఎఫ్ సిబ్బందిలో గరిష్టంగా 48 గ్యాలంట్రీ అవార్డులు దక్కనున్నాయి. అలాగే మహరాష్ట్రలో విధులు నిర్వహిస్తున్న 31 మంది, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 25 మంది జమ్మూ కాశ్మీర్ పోలీసులు అవార్డులు దక్కించుకున్నారు. అలాగే ఢిల్లీ, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు చెందిన పోలీసులు అవార్డులు అందుకోనున్నారు. అదేవిధంగా 140 మందికి శౌర్య అవార్డులను కూడా కేంద్రం వెల్లడించింది.
లెఫ్ట్ వింగ్ ప్రాంతాల్లో పనిచేసిన 80 మందితో పాటు జమ్మూకాశ్మీర్ లో పనిచేసిన మరో 45 మందికి పలు అవార్డులు ఇవ్వనున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. 2021లో మహరాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పొటెగావ్ -రాజోలి మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మహిళలు సహ 15 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న 19 మంది అధికారులకు గ్యాలంట్రీ అవార్డులు ఇవ్వనున్నారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇద్దరు పోలీసు అధికారులకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ ఇవ్వనున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి అనిల్ కుమార్, బృంగి రామకృష్ణకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ ఇవ్వనున్నారు. ఏపీలో అతుల్ సింగ్, సంఘం వెంకట్రావుకు పోలీస్ మెడల్స్ దక్కాయి. అదేవిధంగా ఏపీలో 12 మందికి మెరిటోరియస్ సర్వీసెస్ పతకాలను కేంద్ర హోంశాఖ ఇవ్వనుంది.