GDWL: గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. 99 రోజుల ప్రణాళికలో బుధవారం ఐడిఓసి మందిరంలో డాక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి ఏడాదీ 10,000 ప్రసవాలు జరుగుతున్నట్టు, వాటిలో 2,500 ప్రభుత్వ, 2,500 ప్రైవేట్, 2,500 ఇతర ప్రదేశాల్లో జరుగుతున్నాయని తెలిపారు.
NLG: తిప్పర్తి మండలం తిప్పలమ్మ గూడెం వద్ద ఇవాళ ఉదయం పల్నాడు సింహాద్రి ఎక్స్ప్రెస్ రైలు ఓ గేదెను ఢీకొట్టింది. దీంతో ఆ గేదె చక్రాల కింద ఇరుక్కుపోయింది. వెంటనే అప్రమత్తమైన లోకోపైలట్ రైలును నిలిపివేశారు. గేదెను ఢీకొన్న తర్వాత ఇంజిన్లో సమస్యలు తలెత్తాయి. దీంతో పట్టాల మీదనే రైలు నిలిచిపోయింది.
SRPT: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నడిగూడెం సర్పంచి దున్న శ్రీనివాస్ ముందుకు సాగుతున్నారు. ఈరోజు ఉదయం ఆయన చేపట్టిన మార్నింగ్ వాక్ ప్రజల కష్టాలను తెలుసుకునే వేదికగా మారింది. గ్రామంలోని వీధుల్లో పర్యటిస్తూ ప్రజలతో నేరుగా ముచ్చటించిన సర్పంచి.. పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణపై ఆరా తీశారు.
NLG: నాగార్జునసాగర్ (నందికొండ) మున్సిపాలిటీ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆంధ్ర సరిహద్దుకు ఆనుకుని ఉండడంతో గంజాయి, డ్రగ్స్, పేకాట దందాలు, వ్యభిచారం వంటి కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ఇవి యువతపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని ఆందోళన చెందుతున్నారు.
NZB: జిల్లాలో తల్లి మందలించిందని మనస్తాపంతో ఓ 14 ఏళ్ల బాలుడు సైకిల్పై 50 కి.మీ. ప్రయాణించాడు. కామారెడ్డి జిల్లా ‘ఆపరేషన్ కవాచ్’లో భాగంగా టేక్రియాల్ వద్ద పోలీసులు బాలుడిని గుర్తించి, తల్లిదండ్రులకు అప్పగించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన పోలీసులను ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు.
SDPT: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో 31 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. TSKC, కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో ‘కోవలెంట్ ల్యాబరేటరీస్’ ప్రతినిధులు ఈ డ్రైవ్ నిర్వహించారు. కెమిస్ట్రీ విభాగం సహకారంతో జరిగిన ఈ ఇంటర్వ్యూలకు 72 మంది UG, PG విద్యార్థులు హాజరుకాగా, ప్రతిభ కనబరిచిన 31 మందికి నియామక పత్రాలు అందజేశారు.
PDPL: రాష్ట్ర ప్రభుత్వ నుంచి సింగరేణికి రావాల్సిన రూ.50 వేల కోట్లు తక్షణమే చెల్లించాలని CITU రాష్ట్ర గౌరవ అధ్యక్షులు భూపాల్, ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి అన్నారు. రామగుండం సింగరేణి OCP-5 ప్రాజెక్టు ఆవరణలో బుధవారం జరిగిన గేట్ మీటింగ్లో నాయకులు పాల్గొని మాట్లాడారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని యాజమాన్యాన్ని కోరారు.
WNP: గోపాల్పేట మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారింది. బుకింగ్ చేసిన వారికి వారం గడిచినా మెసేజ్ రాకపోవడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని అంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి సరఫరా మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు.
BHNG: జిల్లాలో భూ భారతి, ప్రభుత్వ భూములు, సాధా బైనామాలు, ఎస్ఐఆర్, మీ సేవ సేవలు, ధాన్యం కొనుగోలు, ఆన్లైన్ ద్వారా ఇసుక సరఫరా అంశాలపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డితో కలసి బుధవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హల్ లో జరిగిన సమావేశంలో సమీక్షించారు. భూభారతి రికార్డులను క్షేత్రస్టాయిలో పరిశీలించాలన్నారు.
MHBD: గూడూరు మండలం పొనుగోడులో పోలీసుల ఆధ్వర్యంలో గురువారం క్రీడా సామగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సీఐ వినయ్ కుమార్, ఎస్సై గిరిధర్ రెడ్డి పాల్గొని చిన్నారులకు, యువతకు క్రీడా పరికరాలు అందజేశారు. సీఐ మాట్లాడుతూ.. బాల్యం నుంచే క్రీడలపై ఆసక్తి పెంపొందిస్తే మానసిక, శారీరక దృఢత్వం సాధ్యమవుతుందని, యువత క్రీడల్లో రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలి.
SRPT: పెన్ పహాడ్ మండలం గాజుల మల్కాపురంలో విషాదం నెలకొంది. నిఖిల్ అనే బాలుడు తాటి ముంజల కోసం చెట్టు ఎక్కేందుకు యత్నించగా పక్కనే ఉన్న విద్యుత్ తీగలు తగిలి షాక్ తో అక్కడికక్కడే మృతి చెందాడు. సరదాగా వెళ్లిన బాలుడు విగతజీవిగా మారడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కళ్లముందే చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్లో ఈనెల 18 నుంచి నిర్వహించే వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన, కళ్యాణ మహోత్సవానికి హాజరుకావాలని ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్కు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.
ASF: జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. హరిత బెజ్జూర్ ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. బోధన తీరు, భోజన నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతిలో 100% ఫలితాలు సాధించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి రిజిస్టర్లను పరిశీలించారు.
NRPT: ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవంలో భాగంగా జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో క్రీడలను ప్రారంభించడానికి గురువారం ఉదయం 10 గంటలకు ఎంపీ డీకే అరుణ వస్తున్నట్లు బీజేపీ పార్టీ ప్రతినిధులు తెలిపారు. కావున జిల్లా వ్యాప్తంగా బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధ్యక్షులు పెద్ద ఎత్తున తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.