KMR: బాన్సువాడ మండలం హన్మాజీపేట గ్రామంలో నూతన మీ సేవ కేంద్రం నిర్వహణకు అర్హులైన అభ్యర్థుల నుంచి సబ్ కలెక్టర్ కిరణ్మయి దరఖాస్తులు కోరారు. డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండి, 21-44 ఏళ్ల మధ్య వయస్సు గల మండల స్థానిక అభ్యర్థులు అర్హులు. ఆసక్తి గలవారు ఈ నెల 13 నుంచి 18 వరకు బాన్సువాడ తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి అన్నారు
MDCL: అలియాబాద్ మున్సిపాలిటీ పరిధి మజీద్పూర్ గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ పాల్గొని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా అనేక కుటుంబాలు సొంత ఇళ్ల కల నెరవేర్చుకుంటున్నాయని తెలిపారు.
ADB: ఈనెల 11,12 వ తేదీల్లో శనగ కొనుగోలును తాంసి సబ్ మార్కెట్ యార్డ్లో పూర్తిగా నిలిపివేసినట్లు సెంటర్ ఇన్ఛార్జ్ కేశవ్ శుక్రవారం తెలియజేశారు. శనగ నిలువలు ఎక్కువ అయినందున కొనుగోలను నిలిపివేసినట్లు వెల్లడించారు. తదుపరి కొనుగోలు తేదీని ఒక రోజు ముందుగానే తెలియజేస్తామని పేర్కొన్నారు. రైతులు విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
WNP: అమరచింత మండలం చంద్రనాయక్ తండాలో కమ్యూనిటీ హాల్, ఆలయం నిర్మించాలని గిరిజన మహిళలు ఎంపీ డీకే అరుణకు వినతిపత్రం అందజేశారు. శుక్రవారం మండల పర్యటనలో భాగంగా ఆమెను సర్పంచ్ కృష్ణానాయక్ ఆధ్వర్యంలో కలిసి సమస్యలు వివరించారు. తండా అభివృద్ధి పనులు చేపట్టాలని యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో కోరారు.
SRPT: ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ.. హోమియోపతి వైద్యం, నిత్యం యోగా సాధనతోనే దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేసుకోవచ్చని పిలుపునిచ్చారు. జీవనశైలి మార్పులతోనే మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ఆయన అన్నారు.
KMM: ఎన్కూర్ మండలం టీఎల్పేటలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇంటింటికి తిరిగి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యంమన్నారు. అందుకోసమే ప్రజా ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాదని పేర్కొన్నారు.
MLG: తాడ్వాయి మండల పర్యటనలో భాగంగా అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి సీతక్క సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలతో మంత్రి సీతక్క మాట్లాడి వారి బాగోగులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.
BHPL: ఎక్స్పోజర్ విజిట్లో భాగంగా గణపురంలోని కోటగుళ్లను కమలాపూర్ MJP గురుకుల పాఠశాల విద్యార్థులు సందర్శించారు. కోటగుళ్ల విశిష్టత, ప్రాముఖ్యతను పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ఆలయానికి విచ్చేసిన విద్యార్థులకు అర్చకులు నాగరాజు ఆశీర్వచనాలు, ప్రసాదాలను అందజేశారు. సుమారు 800 మంది విద్యార్థులు ఆలయాన్ని సందర్శించారు.
MBNR: రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు “అరైవ్-అలైవ్” పేరుతో వీడియో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకి తెలిపారు. గరిష్ఠంగా 3 నిమిషాల నిడివి గల వీయోడిలను రూపొందించి, ఈ నెల 14లోపు ఎస్పీ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఉత్తమ వీడియోకు రూ.5,000 నగదు బహుమతి అందజేస్తామని, ప్రమాదాల నివారణే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.
BDK: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 42వ డివిజన్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. శుక్రవారం కమిషనర్ సుజాతకు కార్పొరేటర్ దున్నపోతుల మణి వినతిపత్రం అందజేశారు. డివిజన్ పరిధిలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం, ఎస్టీ బజార్లో గత 40 సంవత్సరాలు నుంచి మంచినీటి పైప్ లైన్ సదుపాయం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
GDWL: తెలంగాణ రాజ్యాధికార పార్టీ గద్వాల జిల్లా అధ్యక్షుడిగా అయిజ పట్టణానికి చెందిన మొరుగు వీరేశ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పాలమూరు జిల్లా ఇంఛార్జ్ వేములవాడ మదన్ మోహన్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. ఇటీవల హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో తీన్మార్ మల్లన్న సమక్షంలో ప్రకటించారు.
SDPT: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి BRS అధినేత కేసీఆర్తో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. కేటీఆర్, గంగుల కమలాకర్, L.రమణ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన గులాబీ పార్టీలో చేరికపై చర్చించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలను కేసీఆర్ ఆయనకు పరిచయం చేశారు. జిల్లాలో పార్టీ బలోపేతం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై ఈ సందర్భంగా కీలక చర్చలు జరిగాయి.
VKB: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే తీవ్రమైన ఎండ వేడిమి ఉండటంతో మధ్యాహ్నానికి ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరుకుంది. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు వడదెబ్బ భయంతో వణికిపోతున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీరు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అనవసరంగా బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.
MNCL: జన్నారం మండలంలోని చింతగూడ గ్రామంలో ఏర్పాటు చేసిన ఆధార్ క్యాంపును మరో మూడు రోజులు పొడిగించడం జరిగిందని మంచిర్యాల జిల్లా పోస్టల్ అడిషనల్ సూపర్డెంట్ రామారావు తెలిపారు. శుక్రవారం చింతగూడ గ్రామంలో ఏర్పాటు చేసిన ఆధార్ క్యాంప్ను ఆయన పరిశీలించారు. ప్రజల నుండి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో మూడు రోజుల గడువును పెంచామన్నారు.
KNR: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని గంగాధర మండలం రంగరావుపల్లి గ్రామ సర్పంచ్ దాసరి శంకరయ్య కోరారు. శుక్రవారం స్థానిక అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారంతో పాటు యూనిఫాంలను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ద్యవ బహదూర్ రెడ్డి, పాల్గొన్నారు.