WGL: నర్సంపేట మున్సిపాలిటీ కార్యాలయం ముందు మంగళవారం బీఆర్ఎస్ కౌన్సిలర్లు శాంతియుత నిరసన చేపట్టారు. పట్టణంలో శానిటేషన్ దారుణంగా ఉందని, చెత్త పేరుకుపోవడం, డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా కమిషనర్ స్పందించలేదని ఆరోపిస్తూ, వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
BDK: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అనీ, రైతు సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్నదని DCMS మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఇవాళ ఓ ప్రకటనలో వెల్లడించారు. యాసంగి పెట్టుబడుల క్రింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొదటి విడత 70 లక్షల మంది రైతులకు ఎకరానికి రూ. 6,000 చొప్పున రూ. 3,590 కోట్ల రూపాయలు విడుదల చేయడాన్ని హర్షం వ్యక్తం చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐదేళ్ల చిన్నారిపై ఇద్దరు బాలురు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఇవాళ వెలుగులోకి వచ్చింది. కాటారం డివిజన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన బాలికను తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా విషయం బయటపడింది. పోలీసులు వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
NGKL: వెల్దండ రైతు వేదికలో ప్రపంచ భూగర్భ జల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా అధికారిణి దివ్య జ్యోతి, సర్పంచ్ మట్ట యాదమ్మ ముఖ్య అతిథులుగా హాజరై, భూగర్భ జలాల పెంపుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుతూ, జల వనరులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అధికారులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
WNP: ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా జిల్లాలో 100 రోజుల టీబీ నిర్మూలన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ మంగళవారం ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని క్షయ నిర్ధారణ కార్యాలయంలో అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఓ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోగులకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో DMHO సాయినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
MDK: మనోహరాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి జ్యోత్స్న ఆధ్వర్యంలో ఆరోగ్య కేంద్రం ముందర బ్యానర్ ప్రదర్శించారు. ఆమె మాట్లాడుతూ.. క్షయ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో CHO బాలనర్సయ్య, ఆసుపత్రి సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
NGKL: గ్రామస్థాయి పాలనలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. కొల్లాపూర్ డివిజన్కు చెందిన 72 మంది నూతన సర్పంచ్ శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. సర్పంచ్లు బాధ్యతాయుతంగా పనిచేస్తేనే శక్తివంతమైన నాయకత్వం సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యాంప్రసాద్, అమరేందర్ పాల్గొన్నారు.
KNR: ఓటరు జాబితా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)ను ఎన్నికల సంఘం చేపట్టిందని, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇందుకు పూర్తిగా సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో భూ భారతిలో అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. ఈ కుంభకోణంపై ఇప్పటికే కమిటీ వేశామని, ముగ్గురు నలుగురు మీసేవ నిర్వాహకులను అరెస్ట్ చేశామని తెలిపారు. అవినీతికి పాల్పడిన వారు ఎంతటి అధికారులైనా వదిలేది లేదని, వారిని అరెస్ట్ చేసే వరకు వదిలిపెట్టమన్నారు.
ADB: భీంపూర్ మండలంలోని అందర్ బంద్ ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతలేని ఆహార పదార్థాలను తిరిగి పంపించాలని అధికారులకు సూచించారు.
ASF: పెంచికల్ పేట్ మండలం రంగె గ్రామంలో అడవి పంది దాడిలో మంగళవారం వాచర్ గాయపడ్డాడు. అడవిలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆకస్మికంగా దాడి చేయడంతో గాయాలయ్యాయి. సహచరులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అడవి జంతువుల సంచారం పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు.
MDCL: పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏమీ లేదని అధికారులు స్పష్టం చేశారు. నగరవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తగినంత స్టాక్ అందుబాటులో ఉందని, సరఫరా ఎక్కడా నిలవకుండా సాఫీగా సాగుతోందని HYD CP సజ్జనార్ వెల్లడించారు. పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీల వద్ద పరిస్థితిని HYD సిటీ పోలీస్ విభాగం, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షిస్తోందని చెప్పారు.
MNCL: జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణకు చేపట్టిన భూసేకరణకు సంబంధించి దరఖాస్తుల పరిష్కారం పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మంచిర్యాల ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించి దరఖాస్తుల పరిష్కారం వివరాలను పరిశీలించారు. 63, 163జి జాతీయ రహదారుల ఏర్పాటులో భాగంగా దరఖాస్తుల పరిష్కార చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
NLG: HYD-VJA జాతీయ రహదారిపై, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు మధ్య కేంద్రబిందువుగా ఉన్న చిట్యాల మున్సిపాలిటీని నూతన నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలని ఆదర్శ రైతు కన్నెబోయిన మహాలింగం యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భౌగోళికంగా కీలకమైన చిట్యాల అభివృద్ధి కోసం అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజలు, రైతులు ముక్తకంఠంతో కలిసి పోరాడాలని కోరారు.
NZB: బోధన్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఘటన మంగళవారం రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జేఎంసీ కాలనీ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో 18 మందికి గాయాలు కాగా హుటాహుటిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సంఘటన స్థలాన్ని నిజామాబాద్ సీపీ సాయి చైతన్య పరిశీలించారు.