SRD: పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోమవారం 54 మంది లబ్ధిదారులకు రూ.24.43 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల సంక్షేమం.. ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
SRCL: జిల్లాలో పులుల సంచారంపై అటవీ శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సూచించారు. చందుర్తి మండల కేంద్రం నుండి మోత్కరాపేట వెళ్లే మార్గంలో పులులు సంచరిస్తుండడంతో ఆ ప్రాంతాన్ని సోమవారం ఉదయం ప్రభుత్వ విప్ సందర్శించారు. అటవీశాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల్లో భయందోలనలపై అవగాహన కల్పించాలన్నారు.
RR: అత్తాపూర్లో నూతనంగా నిర్మించిన ధన్వంతరి ఆసుపత్రిని మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో సామాన్యులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని తెలిపారు.
ADB: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఆదిలాబాద్ జిల్లాకు రానున్నారు. జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పరామర్శించడానికి పట్టణానికి రానున్నారని బీఆర్ఎస్ నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న తెలియజేశారు.
NRML: నిర్మల్లో ఆదివారం జరిగిన సాధారణ రోడ్డు ప్రమాదాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని ASP సాయికిరణ్ తెలిపారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్పై ఒక కేసు, కారును ధ్వంసం చేసిన వ్యక్తిపై మరో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు నేటి ప్రకటనలో హెచ్చరించారు.
BHNG: జిల్లాలోని 427 గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.7.59 కోట్లు జమ అయ్యాయి. జనాభా ప్రాతిపదికన ఒక్కో పంచాయతీకి రూ.48 వేల నుంచి రూ.9.8 లక్షల వరకు అందాయి. ఈ నిధుల్లో 60 శాతాన్ని తాగునీరు, పారిశుద్ధ్య పనులు, మిగిలిన 40 శాతాన్ని పెండింగ్ బిల్లులు, ఇతర అభివృద్ధి పనులకు మార్చి 31లోగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
MNCL: 2027-28 విద్యా సంవత్సరం నుంచి ఐఐటీలో సింగరేణి ఉద్యోగుల పిల్లల ప్రవేశం కోసం ట్యూషన్ ఫీజు రియంబర్స్ చెల్లింపుకు సంంధించించి యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. ఈ పథకం 2025-26 విద్యా సంవత్సరంలో ఐఐటీలో ప్రవేశంపై వర్తిస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగులు ఐఐటీలో ప్రవేశం, ట్యూషన్ ఫీజు రశీదులు, ఇతర రుజువులతో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.
NGKL: హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం నిర్వహించిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి “వుషూ” క్రీడా పోటీల్లో పీఎంశ్రీ ప్రభుత్వ హైస్కూల్ అచ్చంపేట విద్యార్థి శివప్రసాద్ పాల్గొని ద్వితీయ స్థానం సాధించాడు. పోటీల్లో ప్రతిభ కనబరిచి పాఠశాల, అచ్చంపేటకు కీర్తి తీసుకొచ్చాడు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.
NLG: చిట్యాల బస్టాండ్ సమీపంలో ఉన్న 8వ వార్డులో భూగర్భ డ్రైనేజీ సమస్యతో అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీలో చెత్తాచెదారం పేరుకుపోవడంతో మురుగునీరు సాఫీగా పారక బయటకు పొంగుతోంది. దుర్గంధంను స్థానికులు భరించలేకపోతున్నారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని నివాసితులు ఆందోళన చెందుతున్నారు. స్థానికులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
GDWL: తెలంగాణ రాష్ట్ర కబడ్డీ జట్టు కెప్టెన్ గా గద్వాల కు చెందిన జి.రాజు ఎంపికైనట్లు కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డీకే స్నిగ్ధా రెడ్డి తెలిపారు. గుజరాత్లో రేపటి నుంచి ప్రారంభమయ్యే జాతీయస్థాయి సీనియర్ కబడ్డీ టోర్నీలో తెలంగాణ జట్టుకు సారథ్యం వహించనున్నారు. ఉమ్మడి జిల్లా నేతలు, కబడ్డీ అసోసియేషన్ సభ్యులు పీడీలు హర్షం వ్యక్తం చేశారు.
SRD: ముత్తంగి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సోమవారం స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. కాంప్లెక్స్ హెచ్ఎం శారద మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు తమ అనుభవాలను పంచుకోవడం ద్వారా బోధన నాణ్యత పెరుగుతుందని తెలిపారు. ఉత్తమ బోధన పద్ధతులతో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచవచ్చన్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుకు కృషి చేయాలని ఆమె సూచించారు.
NRML: నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈరోజు దిలావర్పూర్ మండలంలోని కాలువ, సిర్గాపూర్ గ్రామాల్లో చేపట్టాల్సిన శంకుస్థాపన కార్యక్రమాలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డాయని నీటిపారుదల శాఖ ఏఈ సొన్ కాంబ్లే గంగాధర్ ఓ ప్రకటనలో తెలిపారు, ప్రజా ప్రతినిధులు, అధికారులుఈ మార్పును గమనించాలని వారి కోరారు.
KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి పంట సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా 3వ విడతలో భాగంగా సోమవారం 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈఈ అక్షయ్ కుమార్ సోమవారం తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా ప్రస్తుతం 13.761 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు రైతులను కోరారు.
JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం స్వామివారి పల్లకి సేవ కన్నులపండువగా సాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలను రకరకాల పూలతో అలంకరించిన పల్లకిలో ఉంచి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
SRPT: జాజిరెడ్డిగూడెం మండలంలోని తిమ్మాపురం గ్రామ మొదటి వార్డులో కోతుల సమస్య నివారణకై ఆ వార్డు సభ్యురాలు చెరుకు స్వరూప భర్త చెరుకు సైదులు ఇవ్వాళ చింపాంజీ వేషధారణలో వీధులలో తిరుగుతూ కోతులను తరిమివేశారు. వార్డులో కోతుల సమస్య నివారణ కోసం చింపాంజీ దుస్తులను తెచ్చి వేసుకొని తిరుగుతున్నట్లు తెలిపారు.