MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి చిన్న చింతకుంట పీహెచ్సీలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ వైద్యులతో నిర్వహిస్తున్న శిబిరాన్ని పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం గర్భిణుల కోసం ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాలను సందర్శించి, ఆరోగ్య జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.
KDP: పోరుమామిళ్ల(మం) తిరువెంగళాపురంలో సుజాత అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. భర్త గురుశేఖర్తో పాటు అత్తమామలు కలిసి హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటన అనంతరం భర్త పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడు రాజమండ్రిలో ఓ కాంట్రాక్టర్ వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
BPT: కొరిశపాడు మండల హౌసింగ్ ఇంఛార్జ్ ఏఈగా కిషోర్ బుధవారం నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా DE దుర్గా రమేష్ చేతుల మీదగా ఆయన ఆర్డర్ కాపీని అందుకున్నారు. ఈ సందర్భంగా హౌసింగ్ సిబ్బంది అభినందనలు తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తానని ఏఈ కిషోర్ మీడియాకు తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావంతో పని చేస్తానన్నారు.
KMM: రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ వేం నరేందర్ రెడ్డికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నరేందర్ రెడ్డి పెద్దల సభలో అడుగుపెట్టడం సంతోషదాయకమని, ఆయన పదవీ కాలంలో తెలంగాణ ప్రయోజనాల కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తారని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు.
MLG: మంత్రి సీతక్కను మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కలిశారు. అనునిత్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసే మహిళా కార్యకర్తలకు పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధ్యక్షురాలికి మంత్రి సీతక్క సూచించారు.
TG: కరీంనగర్ డంపింగ్ యార్డు శాశ్వతంగా తరలించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నగరంలోని డంపింగ్ యార్డు ద్వారా ఆ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులు స్వయంగా వెళ్లి ఆయన పరిశీలించారు. ఈ డంపింగ్ యార్డ్ వరంగల్ కరీంనగర్ మధ్యలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. రెండు ప్రాంతాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
MNCL: రైతులకు మెరుగైన సేవలు అందించేలా మార్కెట్ కమిటీ పని చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. బుధవారం చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్గా మహేష్ ప్రసాద్ తివారి ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ.. రైతులకు అండగా ఉండి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలన్నారు.
SKLM: ఆమదాలవలస నియోజకవర్గంలో పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా మంజూరు చేసింది. స్థానిక MLA రవికుమార్ మున్సిపల్ కార్యాలయంలో బాధిత కుటుంబాలకు ఈ చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.
AP: అమరావతిలోని వెలగపూడి N9 జంక్షన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎల్ అండ్ టీ స్టాక్ పాయింట్ సంస్థలో భారీగా ప్లాస్టిక్ పైపులు తగలబడ్డాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో పైపులు తగలబడుతున్నాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
PPM: సీతానగరం మండలం చినభోగిల గ్రామంలో కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, డీఏంహెచ్వో ఎస్.భాస్కరరావు ఆదేశాల మేరకు బుధవారం స్కూల్ పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డా.పావని జలుబు, దగ్గు, దురదలు ఉన్నవారికి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. అలాగే, పిల్లలకు మెరుగైన ఆరోగ్య సూత్రాలు గురించి వివరించి చెప్పారు.
GDWL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ రిజ్వాన్ బాషా బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా నుంచే కాక పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి కూడా రోగులు వస్తుంటారని, వారందరికీ ఎల్లప్పుడూ మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆయన సూచించారు.
AKP: రాంబిల్లి మండలం పంచదార్లలో దళిత రైతులు చేపట్టిన నిరసన దీక్షలు బుధవారం 38వ రోజుకు చేరుకున్నాయి. గత ఎన్నో సంవత్సరాల నుంచి మామిడి, జీడి తోటలను సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలన్నారు. తమ భూములు లాక్కుంటే రోడ్డున పడతామన్నారు. తమకు న్యాయం జరిగే వరకు దీక్షలు కొనసాగిస్తామన్నారు.
SRCL: అవమానకరంగా మాట్లాడితే సహించేది లేదని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ అన్నారు. సిరిసిల్లలోని చేనేత చౌక్ వద్ద టీడీపీ ఎంపీల ఫ్లెక్సీలను మంగళవారం దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన డే, బ్లాక్ డే అని టీడీపీ ఎంపీలు అనడం దురదృష్టకరమన్నారు.
SRPT: ప్రభుత్వ పథకాల అమలుకు 2027 జనాభా లెక్కలు కీలకమని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మే 11 నుంచి జూన్ 9 వరకు తొలి దశ ఇళ్ల జాబితా నమోదు, 2027 ఫిబ్రవరిలో రెండో దశ గణన జరుగుతుందని వివరించారు. తొలిసారిగా డిజిటల్ విధానంలో మొబైల్ యాప్ల ద్వారా ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
NDL: బనగానపల్లె(మం) టంగుటూరులో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆయన సతీమణి కాటసాని జయమ్మ కలిసి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే దంపతులకు స్థానిక వైసీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే దంపతులు పెద్దమ్మ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.