SRPT: భద్రాచలం రాములోరి తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేర్చేందుకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాటు చేసింది. కళ్యాణానికి ప్రత్యేకంగా రాలేని భక్తుల కోసం కార్గో సేవల ద్వారా ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు కోదాడ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. తలంబ్రాలు కావాలనుకునే భక్తులు కోదాడ బస్ స్టేషన్లోని 9959226302 నంబర్కు సంప్రదించాలన్నారు.
ఎన్టీఆర్: నందిగామ పట్టణ పరిధిలోని 17వ వార్డు ఉమా కాలనీలో చౌక ధరల దుకాణాల షాపును ఆదివారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు సరుకులు సక్రమంగా అందేలాగా చూడాలని డీలర్కు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మండవ కృష్ణకుమారి, పలువురు అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
NRML: దేశ సేవలో సుదీర్ఘ కాలం పాటు పనిచేసి పదవీ విరమణ పొందిన నిర్మల్ పట్టణం శ్రీనగర్ కాలానికి చెందిన భాస్కర్ యాదవ్ ఇండియన్ ఆర్మీలో దిగ్విజయంగా 24 సంవత్సరాలు దేశ రక్షణ, సేవలు తన ఉద్యోగ పదవీ బాధ్యతలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మొదటిసారిగా కాలనీకి విచ్చేస్తున్న సందర్భంగా కాలనీవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి జాతీయ జెండాలతో స్వాగతం ఘనంగా సన్మానించారు.
బీహార్లోని గయా జిల్లాలో ఇమ్రోజ్ అలీ అనే ఉపాధ్యాయుడు వినూత్నంగా ఆలోచించారు. బడికి రాని విద్యార్థుల కోసం ఆయన తన బృందంతో మేళతాళాలు వాయిస్తూ నేరుగా వారి ఇళ్లకు వెళ్తున్నారు. ఈ సంగీతంతో పిల్లలను ఉత్సాహంగా పాఠశాలకు రప్పిస్తున్నారు. ఆయన కృషి వల్ల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. దీంతో ఆ ఉపాధ్యాయుడిని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు నెటిజన్లు అభినందిస్తున్నారు.
ఏలూరు: మహిళలు, పోలీసులు ఆదివారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఫైర్ స్టేషన్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ అడ్మిన్ సూర్య చంద్రరావు మాట్లాడారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలన్నారు. పని ప్రదేశాల్లో మగవారితో సమానంగా వేతనాలు పొందడం, గౌరవ ప్రదమైన వాతావరణంలో పనిచేయడం మహిళల హక్కని, ఈ దిశగా చైతన్యం తీసుకురావడమే లక్ష్యమన్నారు.
ఏపీని తెలుగునాడుగా మార్చాలని ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు డిమాండ్ చేశారు. ‘కేరళను కేరళం అని మార్చినట్లే ఏపీని కూడా తెలుగునాడుగా మార్చాలన్నారు. తమిళనాడులా తెలుగునాడు అని మార్చేందుకు మాజీ సీఎం NTR ప్రయత్నించారు. కేరళ వాళ్లకున్న పట్టుదల మనలోనూ ఉంటే మన బతుకులు కూడా మారుతాయి’ అంటూ చెప్పుకొచ్చారు.
NDL: ఆత్మకూరు కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినిలకు చట్టాలపై అవగాహన సదస్సు ఇవాళ నిర్వహించారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరన్ ఆదేశాలతో డీఎస్పీ ఆర్.రామాంజి నాయక్, అర్బన్ సీఐ ఓ. మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి బంగారు భవిష్యత్తు సాధించాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.సమస్యలు ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.
NLR: దుత్తలూరు మండలం నందిపాడు కస్తూర్భా పాఠశాల సమీప హైవే వద్ద ఆదివారం కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలు అవ్వగా సమాచారం అందుకున్న 108 సిబ్బంది గాయపడిన వ్యక్తిని ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కడప నుంచి పొదిలికి వెళ్తున్న కారు నందిపాడు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఎవ్వరికి ప్రాణ హాని జరగలేదు.
SDPT: జగదేవ్పూర్ మండలం కొత్తపేట గ్రామ సమీపంలో పెద్ద పెద్ద బండ రాళ్ళ మధ్య పెద్ద రాయి పై కాల భైరవ స్వామి రూపం ఒకటి కనబడింది. గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. పూర్వ కాలం నుంచి ఇక్కడున్న పెద్ద పెద్ద గుండ్లను బయన్న గుండ్లుగా పిలిచారని అన్నారు.పెద్ద రాయి పై చెక్క బడిన ఈ కాలభైరవుని రూపం బృహత్ శిలా యుగ కాలానికి ( క్రీ.పూ. 1000 సం.ల క్రితానికి) చెందినది అని తెలిపారు.
MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో నూతన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ఆదివారం ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి ఏర్పాటు చేయించారు. వార్డులో విద్యుత్ సమస్య లేకుండా ఉండేందుకు నూతన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయించినట్లు మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి.అరిఫ్ తెలిపారు.
KRNL: నగరంలోని APSP 2వ బేటాలియన్లో మాజీ సైనికులు, వీర నారీమణులు, వారి కుటుంబాల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ మెగా ఈ.ఎం.ఎస్ ర్యాలీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీ.జీ భరత్ , కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి పాల్గొన్నారు. వీర కుటుంబాల సంక్షేమానికి ప్రత్యేక చర్యలను తీసుకునే విధంగా కార్యాచరణను సమీక్షించారు.
W.G: కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదానికి సంబంధించి అధికారులు అప్రమత్తం అయ్యారు. పెనుమంట్ర మండలంలో బాణసంచా దుకాణాలను పెనుగొండ సీఐ విజయ్ కుమార్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. యజమానులకు పలు సూచనలు అందచేశారు. నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
MBNR: శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లాలో మార్చి 1 నుంచి 30 వరకు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, బహిరంగ సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
NRPT: మరికల్ మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా శివప్రసాద్, చెన్నయ్య, అధ్యక్షులుగా కృష్ణయ్య, రాములు, ప్రధాన కార్యదర్శిగా ముకుంద రెడ్డి, రాజేష్, అయ్యప్ప, కోశాధికారిగా హరిప్రసాద్తో పాటు సంయుక్త కార్యదర్శి సలహాదారులుగా పలువురిని ఎన్నుకున్నారు.
GDWL: గద్వాల పట్టణంలోని ఆర్టీసీ పెట్రోల్ పంప్ పక్కన రహదారి చెత్తాచెదారంతో అధ్వానంగా తయారైంది. ఈ మార్గంలో ప్రయాణించే వారు తీవ్రమైన దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొందరు వ్యక్తులు బాధ్యత లేకుండా రోడ్డుపైనే చెత్త పారేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి, ఆ వ్యర్థాలను తొలగించాలని డిమాండ్ చేశారు.