PDPL: రామగుండం మండల కేంద్రంలోని టీజీ మోడల్ స్కూల్లో ఆరో తరగతితో పాటు 7 నుంచి 10వ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈనెల 28తో ముగియనుంది. ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సదానందం యాదవ్ తెలిపారు. వోసీ విద్యార్థులకు రూ. 200, ఇతరులకు రూ. 125 ఫీజు ఉంటుందని, ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 19న నిర్వహిస్తామన్నారు
SRD: మార్చి 13న సాయంత్రం ఐదు గంటలకు నియోజకవర్గ స్థాయి ఇఫ్తార్ విందు జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరుగనుంది. గత 27 సంవత్సరాలుగా ప్రతి ఏడాదీ ఇలాంటి విందు నిర్వహిస్తున్నట్లు గూడెం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. సమావేశంలో ముస్లిం మత పెద్దలు, సీనియర్ నాయకులు పాల్గొని ఏర్పాట్లను సమీక్షించారు.
NLG: మునుగోడు మండలం కేంద్రంలో మార్చి 1న ఉదయం 11 గంటలకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మర్రిగూడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ కోరారు.
WGL: నల్లబెల్లి (M) కేంద్రంలోని దస్తగిరిపల్లె గ్రామంలో శుక్రవారం పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని తాహసీల్దార్ ముప్పు కృష్ణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన B. R. Ambedkar చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని’ వాటి పరిరక్షణ కృషి చేయాలని అధికారులకు సూచించారు.
కాకినాడ: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని శుక్రవారం సచివాలయంలోని ఆయన ఛాంబర్లో ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో గల సుబ్బారెడ్డి సాగర్ మరమ్మతు పనులు, చంద్రబాబు సాగర్ కాలువ నిర్మాణ పనులు, సిబ్బంది కొరత తదితర పనులకు అనుమతులు, నిధులు మంజూరు చేయమని కోరుతూ వినతి పత్రాలు అందచేశారు.
MNCL: నెన్నెల మండల MRO కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని MRO శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. MRO మాట్లాడుతూ.. మండల ప్రజలు ఆధార్ కార్డుల్లో తప్పుల సవరణకు, కొత్త కార్డుల నమోదుకు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ప్రజలు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
TG: ఎన్నికల ముందు హామీలివ్వడం.. తర్వాత మాట తప్పడం కాంగ్రెస్ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. యాసంగి మొదలై రెండు నెలలు గడిచినా రైతు భరోసా నిధులు జమ చేయకపోవడమేంటని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు సీఎం రేవంత్కు సంజయ్ బహిరంగ లేఖ రాశారు.
KMR: రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ‘సీఎం-కప్’ క్యారం పోటీల్లో జిల్లా యువకులు ప్రతిభ చాటారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో రామారెడ్డి యువకులు ప్రణయ్, రాజు, జగదీశ్ పాల్గొని మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించారు. విజేతలను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్ విజేతలను అభినందించారు.
KMM: హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం, మద్యం సేవించి డ్రైవింగ్కు దూరంగా ఉండాలని కమిషనర్ సునీల్ దత్ సూచించారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ప్రియదర్శని ఇంజనీరింగ్ కాలేజ్లో ‘అరైవ్ అలైవ్’ రహదారి భద్రత ప్రచారం నిర్వహించారు. ముందస్తు జాగ్రత్తలతోనే ప్రమాదాల నివారణ సాధ్యమన్నారు. పొగమంచు సమయంలో లో-భీమ్ లైట్లు, సురక్షిత దూరం పాటించాలని తెలిపారు.
AP: ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్పై మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఒంగోలులో భూకబ్జాలు, అక్రమాలు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్, ఇసుక రవాణా జరుగుతుందన్నారు. ఎక్కడపడితే అక్కడ భూకబ్జాలు చేస్తున్నారని విమర్శించారు. ఆయన దందాలను ప్రశ్నిస్తూనే ఉంటానని బాలినేని స్పష్టం చేశారు.
కడప: కలెక్టరేట్లో జరిగిన డైపీసీ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అందిన 11,033 దరఖాస్తుల్లో 10,886కి అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. వివిధ పారిశ్రామిక అభివృద్ధి పాలసీల కింద రూ.3.53 కోట్లకు పైగా నిధుల విడుదలకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు.
KMM: ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మెరుగైన శిక్షణ అందించాలని, కేంద్రంలో మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందిని అదనపు కలెక్టర్ శ్రీజ ఆదేశించారు. ముదిగొండ మండలం రాఘవాపురంలోని ప్రాథమిక పాఠశాల భవిత కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. విద్యార్థుల నమోదు, వారికి అందుతున్న విద్య, వైద్య సేవలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
KRNL: హాలహర్వి మండలంలో పలుకేసుల్లో సీజ్ చేసిన వాహనాలను మార్చి 3వ తేదీన వేలం వేస్తున్నట్లు హాలహర్వి ఎస్సై ఈశ్వరరావు తెలిపారు. ఆయన ఇవాళ మాట్లాడుతూ.. 3 కార్లు, 44 ద్విచక్ర వాహనాలకు వేలం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న వారు వేలంలో పాల్గొనాలని సూచించారు. మరిన్ని వివరాలకు హాలహర్వి పోలీసు స్టేషన్లో సంప్రదించాలన్నారు.
ELR: కామవరపుకోటలోని ప్రభుత్వ మద్యం దుకాణాలను చింతలపూడి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల్లోని స్టాక్ నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు, మద్యం బాటిళ్లను స్కాన్ చేసి వివరాలను సరిచూశారు. నిబంధనల ప్రకారం నిర్ణీత ధరలకే మద్యం విక్రయించాలని, ఎక్కడా ఉల్లంఘనలు జరగకుండా చూడాలని అన్నారు.
SDPT: బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ధరణి పేరుతో దోచుకున్నది కేసీఆర్ కుటుంబమేనని డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజు యాదవ్ ఆరోపించారు. చిన్నకోడూరులో ఆయన శుక్రవారం మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్యే హరీశ్ రావు ఏనాడు తహసీల్దార్ కార్యాలయాలను తనిఖీ చేయలేదన్నారు. అధికారం పోయాక తనిఖీలు చేపట్టడం సిగ్గు చేటని విమర్శించారు.